26, మార్చి 2018, సోమవారం

నూతిలో గొంతుకలు

అన్న కట్టిన కొత్తింటి చుట్టూ తిరిగి చూసి చాలా బాగుందిల్లు. అదివరకంటే విశాలంగా ఉంది .గాలి వెలుతురూ ధారాళంగా వస్తుంది,పైగా బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చని సంతోషిస్తూ పడమటి వైపు గోడకి అవతల వాస్తుదోషం వుందని  విడగొట్టబడిన స్థలంలో బాగా పెరిగిన వేప టేకు చెట్లు,వేప చెట్టు చూసి  పోనీలే వాస్తు పిచ్చిలో పడి  మొక్కలకి జాగా అయినా  మిగిల్చారు అనుకున్నా.  ఎంతైనా తండ్రి అదృష్టవంతుడు. తన జీవితకాలంలో రెండుసార్లు  క్రొత్త ఇళ్ళల్లో ఉండే భాగ్యం కల్గింది . ఒకటి తండ్రి కట్టిన ఇల్లు, రెండవది కొడుకు కట్టిన ఇల్లు. నీళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈశాన్యంలో  తవ్వించిన ఆరడుగుల వెడల్పు గల నూతిలోకి  మోటార్ బిగించి  ట్యాంక్ లో నీరు నిలవ ఉండే ఏర్పాటు చేసి  తండ్రికి నీళ్ళు తోడుకునే శ్రమ కూడా లేకుండా చేసాడు కొడుకు అనుకుంది.

ఈ ఇంటి నీటి కష్టాలన్నీ ఆడవాళ్ళవే కదా !  ఆర్థికంగా చితికి ఇంట్లో  పనివాళ్ళు లేకపోయాక మగమహారాజులు యే రోజైనా నూతిలోకి కడవేసి నీళ్ళు తోడిన కష్టం తెలిస్తే కదా అని ఉక్రోషపడింది. అప్రయత్నంగా బలిష్టంగా ఉన్న తన దండ చేతులని చూసుకుంది . మీ పోలికలు, శరీర ఆకృతి అంతా బాగుంటుంది. చేతులే మగవాళ్ళ చేతుల్లా ఉంటాయి  అనింది శాంతమ్మ అనే స్నేహితురాలు.ఇంటి అవసరాలకి, పశువులు త్రాగడానికి   పదేళ్ళ వయసునుండే నూతిలో  నుండి నీళ్ళు తోడి, మోసి భుజం దగ్గరనుండి మోచేతి దాకా ఒకేలా ఉంటూ  బలంగా తయారయింది ఇందుకేననుకుంటా అనుకున్నానప్పుడు.

మళ్ళీ దక్షిణం వైపు గోడ దగ్గరికి వచ్చి గోడవతల తొంగి చూసే ప్రయత్నం చేసి తనకన్నా అరడగు ఎత్తు ఎక్కువలో ఉన్న గోడపై నుండి అవతలకి తొంగి చూసే వీలు లేక ముక్కాలి పీట యెక్కి గోడవతలకి తొంగి చూసాను.  నూతి చూపు తగిలిన ఇరవై అడుగుల వెడల్పు  స్థలమంత మేరా  వదిలేసి కట్టిన ప్రహరీ గోడ అవతల ఇంటి నేలమట్టం అంతెత్తు చెరువు మట్టి తొలి ఉండటం గమనించి "ఎందుకు నాన్నా! అంత మెరక పోశారు, చాలా ఖర్చై ఉంటుందిగా. అయినా ఇప్పుడు నుయ్యి పూడిపోయి రోడ్డులో కలిసిపోయిందిగా,  అంత స్థలం వదిలేసి గోడకట్టి విడగొట్టారెందుకు?   రెండున్నర సెంట్ల స్థలం దాకా ఉంటుంది. ఇంత స్థలం పొతే చాలా డబ్బు పోయినట్టుకాదు ఈ ఊరు కూడా CRDA లో కలిసి పోయిందిగా"  "నుయ్యి పూడ్చేస్తే మాత్రం  దాని చూపు పోనే  పోదు. విడగొట్టి ఇల్లు కట్టమన్నాడు సిద్దాంతి . అందుకే పాతింటి స్థలంలోనే ఉత్తరం తూర్పు  బాగా వదిలి  కట్టాం . ఇంచ్ కూడా దక్షిణపు ప్రక్క పల్లం ఉండకూడదని అంత మెరక తోలిచాడు అన్నాయ్" అన్నాడాయన.

చూపు సారించి తమకి తూర్పున ఉన్న ఇంటికి ఆగ్నేయంగా రోడ్డులో కలిసిపోయిన పెద్ద నుయ్యిని  గుర్తు చేసుకుంది జ్ఞాపకాలలో.  ఎంత పెద్ద నుయ్యో అది.  పెద్దవాళ్లందరూ మోటబాయి అనేవాళ్ళు  ఇప్పుడంటే నుయ్యి అని నాజూకుగా అంటన్నారుకానీ  నా చిన్నతనంలో బాయే అనేవాళ్ళు అని చెపుతూ  తాతయ్య నా చిన్నప్పుడు చెరువు నీళ్ళు రాని చోట పెద్ద బాయిలు తవ్వి  ఇత్తడితోనూ,ఇండాలియన్ తోనూ చేసిన పెద్ద పెద్ద బానలతో,తొట్టె ఆకారం లాంటి పాత్రలతో   నీళ్ళని యెద్దులతో తోడించి  పాటి మీద తోటల్లో పొగాకు  పండించే వాళ్లు.  మన పెద్ద చావిట్లో అటక మీద వున్నయ్యే అయ్యే మోటలంటే  వెళ్లి చూసిరా అని చెప్పేవాడు.

 పెద్ద నూతిలో నీళ్ళు ఎంత  నల్లగా ఉండేవి,అంతే తీయగా కూడా ఉండేవి.ఇత్తడి బిందెకి తాడు బిగించి   తాబేటి  పై అంగేసి ఒక్కసారిగా తాడుని నూతిలోకి  వదిలితే  డబ్ మన్న చప్పుడుతోపాటు నీళ్ళు తొణికిసలాడుతూన్న శబ్దానికి రెండు బజార్ల అవతల నిద్రపోతున్నవాళ్ళు కూడా లేసి కూర్చునేవారు. వేప పుల్ల నోట్లో వేసుకుని వచ్చి బిందెలో నీళ్ళు ముంచుకుని తెల్లారిందంటే పిల్లా! నిద్దరబోతున్న నీళ్ళని కూడా లేపేసి జోళ్ళు జోళ్ళు మోసేసి గాబులు నింపేస్తావ్! యెనకమాల మాక్కాసిని ఉంచావా లేదా అని పరాచికాలడేది నాగరత్నమ్మ మామ్మ.   తనకి ఊహ వచ్చాకే ముగ్గురు ఆడవాళ్ళు ఆ నూతిలో  పడి చనిపోయారు . తను కూడా ఒకసారి కాలుజారి నూతిలో పడిపోతూ  ఎలాగో ఒకచేత్తో గట్టిగా తాగాడిని పట్టుకుని వ్రేలాడుతుండగా పెద్దతాత కొడుకొచ్చి చేతిని పట్టుకుని పైకి లాగి రక్షించాడు.అప్పటికే నిండుగా ఉన్న నూతిలోకి ఒరిగి సగం శరీరం తడిసి పోయింది కూడా.

ఆరోజు అమ్మ గట్టిగా ఏడ్చింది. గంగమ్మ చల్లగా చూడబట్టి నా బిడ్డ బ్రతికి బయటపడింది . ఆ నూతిలో పడిన వాళ్ళలో ఒక్కరైనా బ్రతికి బయట కట్టలేదు. పిల్ల నింపిన గాబులో నీళ్ళు పోసుకుని ఉరుకులు పరుగులుమీద రాచకార్యాలు యెలగబెట్టటానికి పోవడమే తప్ప  మగాడయి వుండి  ఏనాడైనా నాలుగు జోళ్ళు నీళ్ళు తెచ్చి పోసిన పాపాన పోయ్యాడా అని నాన్నని సాపిస్తూ, ఇంత కఠినాత్ముడిని ఎట్టా కన్నదో మహా తల్లి . ముసలాళ్ళకి నీళ్ళు తోడి పోసావంటే నీ కాళ్ళు  ఇరక్కొడతా అంటూ హెచ్చరించింది. మధ్యలో నాయనమ్మ ఏం చేసింది ఆమెని తిడతావ్ అంటూ  విసుక్కుంటూ అమ్మకి దూరంగా జరిగి బట్టలుతకడానికి వేసిన బొంత రాయి పై కూర్చున్నా . నాయనమ్మ గబగబా వచ్చి పమిట చెంగుతో నీళ్ళు కారుతున్న తలని తుడిచి రిబ్బన్ పువ్వునిప్పిరెండు జడలని విప్పి తల బాగా తుడిచింది.

అంతమంది దొడ్లలో బారలు బారలు పెరిగిన తాళ్ళున్నాయి . ఒక్కల్లైన  ఒక తాడిని నరికి తాగాడిని వెయ్యకపోతున్నారు . పుచ్చిపోయి వూలిపోయి వున్న తాగాడి యెప్పుడు విరిగి నూతిలో పడుద్దో అన్నట్టు ఉంది  అందరూ సొంత నూతులు తవ్వుకుని దాన్ని వొదిలెసారు . ఈశాన్యం స్థలం లేక నుయ్యి తవ్వుకోలేక ఇంత దూరం నుండి నీళ్ళు మోసుకోలేక అవస్థ పడతున్నాం . ఉండటానికి ముగ్గురు కొడుకులుండి తిండికే కాదు నీళ్ళకి అలమటించాల్సివస్తుంది  అంది నాయనమ్మ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ .

మా అమ్మ నీళ్ళు పోయ్యొద్దు అంటే మాత్రం నేను మానేస్తానా నాయనమ్మా!.  చూడకుండా అయినా నేను పోస్తానుగా ఏడవబాకు అంటే. నీళ్ళ కోసం కాదమ్మా! ఆ నూతి మీద నీళ్ళు తోడుతూ నువ్వేమవుతావో అని నాకు భయం. మీ పెద్దత్తనిని మింగిన నుయ్యి అది . మీ నాన్న మేనత్తని మింగిన నుయ్యి కూడా అదే అంది. ఇంకా కల్యాణి , కళ్యాణీ వాళ్ళ అమ్మ, మూలింటి వాళ్ళ కోడలు కూడా ఆ నూతిలో  పడి చచ్చిపోయారుగా  అన్నాను. ఆ తర్వాత ఆ నూతిలో  నీళ్ళు తోడటానికి నాకేంభయం వేయలేదు కానీ అమ్మకి భయమేసింది.

అమావాస్య రోజు రాత్రిపూట మా ఇంటి చాకలిని తోడు తీసుకుని  కోడి పెట్టని ఒకదాన్ని పట్టుకుని దానికి పసుపు పూసి కుంకమ బొట్లు పెట్టి మెడలో వేపాకుల దండేసి ఆ కోడి పెట్టని నన్ను  నూతి  దగ్గరకి  తీసుకెళ్ళి కోడిని నా చుట్టూ మూడుసార్లు త్రిప్పి నేలకి తాపించి  కోడిని  కోసి   తల నుండి కారే రక్తాన్ని నూతిలోకి  విదిలించింది మా చాకలి . చచ్చిన  కోడిని  నూతి ప్రక్కనే గుంటతీసి పూడ్చి వేసి ఆ మట్టిపై పెద్ద రాయిని పెట్టిచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చి తలస్నానం చేయించి నా చేతికి తాయెత్తు కట్టి యిక భయమేమి లేదు. గంగ గండం అమ్మాయికి తొలిగిపోయినట్లే అని అమ్మ దగ్గరనుండి వందరూపాయలు పుచ్చుకుని వెళ్ళింది. ఇక అప్పటినుండి  దూరంగానున్న  వేరే నూతి నుండి నీళ్ళు తెచ్చుకోవడం మొదలు పెట్టాం . తర్వాతతర్వాత ఆ నుయ్యి కృంగిపోయి పూడిపోయింది. అలా నా జ్ఞాపకాలలో పెద్ద నుయ్యిని గుర్తుచేసుకుని భారంగా నిట్టూర్చి ఇంటిలోపలికి వచ్చాను. ఆ రాత్రి ఇంటికి వచ్చాక కూడా నూతి జ్ఞాపకాలు నన్నొదలలేదు. ముఖ్యంగా కల్యాణి, తన గురించే ఆలోచిస్తూ పడుకున్నాను .

*******************

నేను చెంబు తీసుకుని పాటిమీదకి వెళుతున్నాను.  ఎవరెవరో నేనెరుగని ముఖాలు రెండు, యెరిగిన ముఖాలు మూడు నూతిలోనుండి కీచు గొంతులతో నన్ను పిలుస్తున్నట్టు ఉంది. అందరూ ఏమిటేమిటో చెపుతున్నారు . ఎవరేమి చెపుతున్నారో నాకసలు అర్ధం కావడం లేదు. చెవుల్లో హోరు మనే శబ్దంతో పాటు యేడుస్తున్న శబ్దం, వెక్కిళ్ళు పెడుతున్న శబ్దం. నేను నూతిలోకి తొంగి చూస్తున్నాను. అమ్మ నాయనమ్మ వచ్చి నన్ను చేయి పట్టి వెనక్కి లాక్కోస్తున్నారు. ఉండండి వాళ్ళు ఏమిటో చెపుతున్నారు విని వస్తాను అంటున్నా వినకుండా  ఇంటికి లాక్కుని వచ్చేసారు. నేను  బిర్ర బిగదీసి దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు నూతిలో గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి. అబ్బబ్బా ! మీరందరూ ఇలా రొద పెడితే నాకేమి అర్ధం అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి వింటాను అన్నాను . వినడమే కాదు యీ రాత్రి  మా గొంతుకలకి నీ కలం అరువువ్వాలి. ఎవరికీ చెప్పని రహస్యాన్ని నీకు చెపుతున్నాం అన్నాయి. రహస్యమా ! అందరూ చెప్పేది రహస్యాలేనా  అంటూ  ఆసక్తిగా లేచి కూర్చున్నాను.

ముందుగా వయసులో పెద్దదాన్ని నేను చెపుతా .. అంటూ రత్తమ్మ గొంతు విప్పింది.  నీకన్నా మూడు తరాల ముందు ఇంటి ఆడపడుచుని నేను అంటూ కథ మొదలెట్టిందామె.అయిదుగురు అన్నదమ్ముల మధ్య ఒకే ఒక ముద్దుల చెల్లిని. అన్నదమ్ముల కళ్ళ ముందరే తిరగాలని మేనమామ దాయాదుల ఇంటికి కోడలిని చేసారు. ఐదురోజుల పెళ్ళి మీనాలో ఊరేగింపు,  వడ్డాణం,కంటె, రవ్వ బేసరి, నాలుగు జతల గాజులు,నాలుగుబళ్ళ ఇత్తడిసామాను,పందిరిమంచం,ఆవు,దూడ రెండెకరాల పొలం కట్నం కింద రాసిచ్చి సారె చీరలతో ఘనంగా అత్తవారింటికి  పంపారు. నేను కాస్త పొట్టిగా తెల్లగా  మరీ సన్నం మరీ బండగా కనబడని ముక్కుతో  అందంగా ఉండేదాన్ని. మా ఆయన అన్నదమ్ములిద్దరూ. మా ఆయన కూడా నాలానే పొట్టి మనిషి. ఆయనకీ విరుద్దంగా మా బావ ఆజానుబాహువు అందగాడు. మా తోడికోడలు పేదింటి పిల్ల. చంకలో  పిల్ల కడుపులో పిల్లతో నీరసంగా ఉండేది. మా అత్త,విధవరాలైన ఆడపడుచు తగని గయ్యాళులు. పెళ్ళైన పదహారురోజులకే నా ఒంటిమీద నగలన్నీ వొలుచుకుని భోషాణంలో  పెట్టి తాళాలు బిగించుకున్నారు.  గొప్ప సంబంధం అని చేసుకుంటే ఇంతేనా ఇచ్చేది అని సూటిపోటి మాటలతో దెప్పి పొడిచేవారు.వారానికొకసారి అయినా యేదో ఒక సారె పుట్టింటి నుండి రాకపోతే కాల్చుకు తినేవాళ్ళు. రాత్రి పూట మా ఆయన పడకటింట్లోకి వస్తే చాలు మా అత్తగారు  ధాన్యం పురి దగ్గర ఎలుకలు తవ్వుతున్నాయనో, దూడలు విప్పుకుని ఆవుల దగ్గరకి వెళ్ళాయనో కేకలు పెట్టి   మమ్మల్ని దూరం చేసేది. పగలల్లా పొలం పనులతో ఆయన ఇంటి పనులతో నేను తీరిక లేకుండా ఉండేవారిమి. ఏడాది దాటినా మా మధ్య మొగుడు పెళ్ళాం బంధం ఏర్పడనేలేదు . కోడలు నీళ్లోసుకోలేదు అంటే ఆమె పుట్టింటి నుండి తెచ్చిన భోగభాగ్యాలు తినడానికి ఆ నలుసే లేదు పాపం అని మెటికలు విరిచేది. మా ఆయన మెతక అవడంతో యేమీ మాట్లాడలేక నిస్సహాయంగా చూస్తూ ఉండేవాడు. మా బావ చూపు నాపై పడింది. తమ్ముడిని వరికుప్ప దగ్గరకి కాపాలాకి పంపి గదిలోకి వచ్చి గడియవేసాడు. నా అరుపులు విని అత్తా ఆడపడుచు కిటికీ ప్రక్కకొచ్చి  నోరుమూసుకుని ఉండు. ఎన్నాళ్ళ నుండి సాగుతుందీ రంకు. మేము చూసేసరికి అరుపులు మొదలు పెట్టావ్ .. అని కానీయరా అబ్బాయ్ , ఒక నలుసు కడుపులో బడితే వారసుడిని అడ్డం బెట్టుకుని దాని మేనమామలు కాజేసిన  మన ఆస్తిని దీని అమ్మకి కట్టబెట్టారుగా . ఇప్పుడు  దీని అన్నదమ్మల నుండి ఆ  ఆస్తిని లాగేయవచ్చుఅని కిటికీ తలుపులు మూసి వెళ్ళారు. కాసేపటికే  నా బ్రతుకు ఆ కుక్క చింపిన విస్తరి అయిపోయింది. ఆసంగతి నా అన్నదమ్ములకి చెప్పాలని  ఆ అర్ధరాత్రి వేళే  దొడ్డి తలుపు తీసుకుని పుట్టింటికి బయలుదేరాను. ఇంకా పర్లాంగు దూరం అయితే పుట్టింట్లో పడేదాన్ని. మా అత్త ఆడపడుచు బావ ముగ్గురూ నా వెనుకగా వచ్చి నా చీర చెంగే ముఖాన కప్పి మజ్జిగ కవ్వం తాడుతో మెడకి ఉరి బిగించి యీ నూతిలోకి తోసేసి యింటికెళ్ళి యేమీ యెరగనట్టు పడుకున్నారు. తెల్లారాకనూతిలో  నా శవాన్ని చూసి గగ్గోలు పెడుతూ .. ఇంకా కడుపు పండలేదు మా అబ్బాయికి మగతనం లేదా అని అనుకుంటారు అన్నానమ్మా ! ఆ మాటకే నూతిలో  దూకి చావాలా  అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడ్చారు. మా ఆయనకి జరిగినది తెలిసినా పెదవి విప్పలేదు. అత్తింటి వాళ్ళు కట్నం చాలలేదని ఆరళ్ళు పెట్టారు అందుకే నూతిలో దూకిందని యేడ్చుకుని యేడ్చుకుని ఆళ్ళ పిల్లలకి నాపేరు పెట్టుకున్నారు అని ముగించింది. తాతయ్య ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు.  అసలు  సంగతి ఇదా అంటూ ఆశ్చర్యం ప్రకటించాను.ఇక మీ మేనత్త తన చెపుతుంది విను అంది.

***************************

  నా మేనత్త . ఆమెనసలు చూడనే లేదు నేను. అందరూ ఎత్తు, లావు,  కళ్ళు,జుత్తు అన్నీ ఆమె పోలికే అంటారు. ఏదీ నన్ను చూడనీ అంటూ బావిలోకి తొంగి చూసాను. గోధుమ రంగు శరీర ఛాయ,  పెద్ద కళ్ళు ,ఒత్తైన కనురెప్పలు, నల్లటి నిగ నిగలాడే పొడవైన జుత్తు, పల్చటి పెదాలు కొద్దిగా బండ ముక్కు.. నాకులాగానే ఉంది ఆమె. అచ్చు అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టు గానే ఉంది. అత్తా .. అన్నాను సంభ్రమంగా. చిన్నగా నవ్వింది. నీకులాగానే చురుకుగా ఉండేదాన్ని. ఇంటి వెనక వాళ్ళబ్బాయి దబ్బపండులా పచ్చగా ఉండేవాడు. కావాలని చేసుకున్నాడు. గోడదిగి పుట్టింటికి కూడా రానిచ్చేవాడు కాదు. పెళ్ళైన కాడి నుంచి ఒకటే రోగం. ఎంతమందికి చూపించినా నా రోగం తగ్గేది కాదు . ఆఖరికి బెజవాడ వెళ్లి కూడా చూపించాడు మా పెద్దతమ్ముడు. అయినా తగ్గలేదు. ఇది యింటిపనికి పనికిరాదు పడకటింటికి పనికిరాదు. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపొండి..అని పంపించేసారు. నా రోగం ఏమిటన్నది నేను ఎవరికీ చెప్పినదాన్ని కాదు. మా అత్త  పెళ్ళి అయి నాలుగేళ్ళు అయినా పిల్లలు పుట్టలేదని తిట్టిపోసేది. పిల్లలు ఎందుకు పుట్టటం లేదో నేను ఎలా చెప్పేది. నా మొగుడు పరమ వికృతమైన వాడు. ఒంటిమీద బడితే విలవిలలాడాల్సిందే. ఏ పశువో, పక్షో అయితే ఆడమగ కలయికంటే యేమిటో తెలిసేదేమో, వాడు పేరుకే మనిషి.   క్షేత్రంలో విత్తు నాటితే మొలకెత్తుతుంది గాని యింకెక్కడో నాటుతానంటే ఎన్నాళ్ళని ఓర్చుకునేది. ఎవరితోనయినా చెప్పుకోవాలంటే సిగ్గు. ఆఖరికి డాక్టర్తో చెప్పుకుందామంటే మగ డాక్టర్ అయిపోయే. ఎవరైనా నీకెక్కడ బాగోలేదు అని అడిగారా ? నాడి చూసేది,కళ్ళు చూసేది, వొళ్ళు చూసేది అంతే. దొడ్డికి వెళితే రక్తం ధారలుగా పోయేది. నడక కష్టమై నిత్యం జ్వరంతో ఉండికూడా   మొగుడిముందు బోర్లా పడుకునే బాధ యే౦దిరా భగవంతుడా అనుకుని కన్నీళ్లు పెట్టడమే ! రక్తం అంతా పోయి వొళ్ళు నీలంగా మారిపోయి మంచానికి అత్తుక్కుంటే.. రెండెకరాలు పొలం అమ్మి  వైద్యానికి మద్రాసు తీసుకుపోవడానికి తయారైనాడు మా పెద్ద తమ్ముడు. అప్పుడైనా నా బాధ యిది అని మా అమ్మకి చెప్పాలనుకున్నా  కానీ చెప్పలేకపోయా.  వైద్యం చేయించుకుని నేను బ్రతికి మళ్ళీ ఆ మొగుడి దగ్గరకే కదా పోవాలి అనుకుని చడి చప్పుడు కాకుండా  చెంబుతో నీళ్ళు తీసుకుని  పాటిదిబ్బల మీదకి పోతున్నట్లు పోయి .. యీ నూతిలో  దూకేసా ! అట్టా నా వాళ్లకి యెకరాలు మిగిలే, నా బాధలు తీరె! అంది కళ్ళు తుడుచుకుంటూ.నేను మాట రాక చూస్తూ ఉండిపోయా.

మగాడికి పెళ్ళాన్ని సుతిమెత్తగా చూసుకోవడం తెలియకపోయే మనసెరిగి కాపరం చెయ్యడం తెలియకపోయ్యే. వొళ్లో పెట్టేదాన్ని దడిలో పెడతా, రొచ్చుని తీసుకొచ్చి నోట్లో పెడతా అంటే రోగాలు కాక యేమొస్తాయి తల్లీ! పగాడికి కూడా వద్దు ఈ బాధ. సానికొంపల్లో పుట్టినదానికి కూడా యెగటు పుట్టే కాపరం అది. ఇదిగో ఈ గంగమ్మ చేతులు జాపి చల్లగా తనలోకి జేర్చుకుని రొవ్వంత శాంతినిచ్చింది. చెప్పుకోలేని రోగం వచ్చి చచ్చిపోయింది అని చెప్పుకోకండి.  ఇకముందు మన యింటి  ఆడాల్లైనా  యిదిగో అత్త యీ ఇబ్బంది పడి చెప్పులేక చచ్చిపోయింది అని చెప్పుకోండి తల్లీ . అని కళ్ళు తుడుచుకుంది. ధారలగా కారే కన్నీరుని తుడుచుకోవాలనే సృహ కూడా లేకుండా అత్తా  అంటూ ఆమె దగ్గరకి వెళ్లబోయాను. జాగ్రత్తమ్మ,నూతిలో  పడిపోతావ్ ,వెనక్కి వెళ్ళు నేను కూడా వెళ్ళుతున్నా అని మాయం అయింది ఆమె.

****************
అత్తా అని  లేచి ఏడుస్తున్నాను. కలో మేలుకవో తెలియని స్థితిలోనే కాసిని  నీళ్ళు త్రాగి పడుకున్నాను.  మళ్ళీ కళ్ళముందు కళ్యాణీ కదలాడింది. నిజంగానే కళ్యాణీ కాలు జారి నూతిలో పడిందా లేక వాళ్ళ అన్నయ్య స్నేహితుడు అమ్మ నాన్న ఆట ఆడేసాడా? అప్పటికీ  ఇప్పటికి నా సందేహం అలాగే ఉండిపోయింది.. ఆలోచిస్తూ అలా కళ్ళు మూసుకున్నాను.

*********************

వెక్కి వెక్కి ఏడుస్తుంది కళ్యాణీ .. ఏయ్.. ఎందుకేడుస్తున్నావ్ ! నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా చాలా యేడ్చాను కళ్యాణీ. ఏం జరిగింది, వాడు చెంబు తీసుకుని వెళ్ళినప్పుడు తుమ్మ పొదలమధ్యకి తీసుకెళ్ళి మళ్ళీ యేమన్నా చేసాడా? అమ్మ నాన్న ఆట ఆడితే పిల్లలు పుడతారని నీకు ఖచ్చితంగా తెలుసా ! అవున్లే మీ నాన్న గారు డాక్టర్ యేగా! నీకు తెలిసే ఉండవచ్చు. పిల్లలు పుడతారంటే ఇష్టం లేకపోతే మందులేసి, జిల్లేడు వత్తులేసి  కడుపులు తీసేస్తారని నువ్వే చెప్పావుగా ! అలా చేయించుకునే పనిగా , అసలెందు చచ్చిపోయావ్ , నాకు ఆడుకోవడానికి నీలా మంచి స్నేహితులే లేరని ఎంత యేడుస్తున్నానో తెలుసా !  అన్నాను.

కళ్యాణీ నవ్వి నువ్వు చాలా తెలివికలదానివి. నీకు అనుమానం వచ్చేసిందా ! నిజంగానే నేను నూతిలో  ప్రమాదవశాత్తు పడిపోలేదు ,కావాలనే దూకేసాను.  మా అన్నయ్య స్నేహితుడు ఆ సాయిబ్బుల అబ్బాయి నా వెంట పడుతున్నాడు అని చెప్పానుగా , వాడే మా యింట్లో యెవరూ లేనప్పుడు దూరి మా పందిరి మంచం క్రింద వొక్కసారంటే వొక్కసారి అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అని ఆడాడు. తర్వాత కూడా మా అన్నయ్యకి ఆ సంగతి చెప్పేస్తా అని బెదిరించి రోజూ ఆడతానే ఉన్నాడు. అమ్మ లేదు, అక్క దగ్గరకి కాన్పు చేయడానికి వెళ్ళింది కదా ! నాన్న కూడా  రోజూ ఇంటికి రాకుండా నర్స్ యింటికేపోతున్నాడు. ఇక నేను యెవరికీ చెప్పాలి. అన్నయ్యకి చెపితే చంపేస్తాడు.  ఆరోజు  మధ్యాహ్నం వాంతులు అయ్యాయి. అవి ఎలాంటి వాంతులో  నాకు తెలుసుగా. అక్కవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు అలాగే వాంతి చేసుకునేవారు. మధ్యాహ్నం  అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అని వచ్చిన ఆ సాయబ్బుల అబ్బాయిని మనం నిజంగానే అమ్మా నాన్న కాబోతున్నాం యెటైనా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాము అని అడిగాను.  అప్పుడు వాడు అమ్మ నాన్న ఆటా , అసలు మనమెప్పుడు ఆ ఆట ఆడాము?నాకు తెలియనే తెలియదు.. మీ నాన్నకి చెప్పి నిన్ను కొట్టించాలి అని వెళ్ళిపోయాడు. నాకు ఏడుపొచ్చి నూతిలో  దూకేసాను అంది.

 నా అనుమానం నిజమే అయింది కళ్యాణీ ! అసలు నువ్వెందుకు అలా చేసావ్ ? వాడు నన్ను కూడా అలాగే అన్నాడు. మా అమ్మతో చెపుతా అన్నాను.   నువ్వు నాతో అప్పుడే చెపితే మా అమ్మతో చెప్పి వాడి కీళ్ళు విరగ్గొట్టిచ్చి ఉండేవాళ్ళమి కదా ! అనవసరంగా చచ్చిపోయావ్ అన్నాను వెక్కుతూ. కళ్యాణీ కూడా యేడుస్తూనే ఉంది. మీ అమ్మ రాకుండానే నిన్ను పూడ్చి పెట్టేసారు. తర్వాత మీ అమ్మ వచ్చి ఎంత యేడ్చిందో తెలుసా ! మంచానికి అతుక్కుపోయింది. ఆ సాయిబ్బులాడు వంకరగా నవ్వుతూనే ఉండేవాడు నన్ను చూసి. ఒకరోజు పాటి మీద నా చేయి పట్టుకున్నాడు. ఏడుస్తూనే చెంబుతో వాడి ముఖం మీద కొట్టి పారిపోయి వచ్చేసాను. తర్వాత నేను నూతిమీద నీళ్ళు తోడుతుంటే నూతిలో  ఈత కొడుతూ నా కాళ్ళ మధ్య నుండి చూస్తూ యేడిపించేవాడు.అప్పుడు అమ్మకి చెప్పాను వాడిసంగతి.   తర్వాత మా ఇంట్లో మరుగుదొడ్డి కట్టించేసింది.  తర్వాత వాడికి పెళ్లై యిద్దరు పిల్లలు పుట్టాక పెళ్ళాం ఎవరితోనో లేచిపోయింది. వాడికి యేదో రోగం వచ్చి ఈసూరుమంటూ ఉండేవాడు. ఇప్పుడు వాడు చచ్చాడో బతికాడో కూడా  తెలియదు, నాకు వాడంటే అంత అసహ్యం. అన్నట్టు నీకు తెలుసా! మీ అమ్మ కూడా ఇదే బావిలో పడి చచ్చిపోయింది. అన్నాను. ఇదిగో అమ్మ కూడా యిక్కడే వుందిగా చూడు అంది కళ్యాణి.

******************

" డాక్టర్త్ గారి అత్తయ్య గారూ " అన్నాను నేను సంతోషంగా. పిల్లా ! ఇంకా ఆ పేరుతోనే పిలుస్తావా ?అంటూ నవ్వింది. ఎలా ఉన్నారు? మీరు ఈ నూతిలో  పడి చచ్చిపోయాక యిక యెవరూ యీ నూతి నీళ్ళు వాడటం మానేశారు. మేము కూడా  నీళ్ళకి రావడం మానేశాము  !  అవునూ మీరెలా పడిపోయారు ? కళ్ళు తిరిగి పడిపోయారా ? అన్నాను.

లేదమ్మా ! చెప్పుకుంటే సిగ్గుచేటు. మా ఇంటెదురుగా ఉండేవాడే మీ రంగా రావు మావయ్య వాడే నా చావుకి కారణం. ఛీ ..వాడా ! వాడంటేనే ఆడాల్లందరికీ అసహ్యం. కళ్యాణీ కూడా మీకెప్పుడూ చెప్పి ఉండదులే ! ఆడపిల్లలు కనబడితే చాలు పంచె యెత్తి రెండుకాళ్ళ మధ్యన ఉన్నదాన్నితీసి  చూపించే వాడు. దాన్ని చేత్తో పట్టుకుంటావా / రూపాయిస్తా ! అనేవాడు. వాడితో మాట్టాడితే వాత పెడతాను. వొట్టి మదపు వెధవ..అని మా  చిన్న మేనత్త కూడా తిట్టేది అన్నాను. ఊ ..వాడే ! మీ డాక్టర్ మామయ్య గారు లేనప్పుడు ఇంట్లోకి జొరబడి మా ఆవిడ కార్తీక మాసం అని మడి కట్టుకుని కూర్చుంది. వస్తానన్న నర్సి ముండ ఇంతవరకూ రాలేదు. మీ ఆయన కూడా లేడుగా . వెయ్యి రూపాయలిస్తా అంటూ తలుపులు బిగించి మంచానికి కాళ్ళు చేతులు కట్టేసి ముఖం మీదకి తెచ్చి రుద్దబోయాడు. అరిసినా వదిలిపెట్టలేదు . చెంపలు చెంపలు వాయించి వాడి కుతి తీర్చుకోబోయాడు పైగా మీ ఆయన డాక్టర్ గా . ఇలాంటివి నీకు నేర్పే ఉంటాడు. నువ్వైతే బాగా వొడుపు నేర్చుకుని వుంటావని వస్తే యిలా కొరికి పెడతావేమిటే ముండా అంటూ .. పిడి గుద్దులు గుద్దాడు. నేను గట్టిగా అరిచేటప్పటికి వెనకింటి వదిన గారు వచ్చారు. ఆమెని చూసి రెండు కాళ్ళ మధ్య రక్తం కారుతున్న దాన్ని పంచతో వొత్తిపట్టుకుని పరిగెత్తాడు. ఆరుగురు బిడ్డల తల్లిని.  అన్నయ్యగారూ  అని పిలిచే నన్ను వావి, వయసు మరిచి  బిడ్డపోయిన దుఃఖంలో ఉన్న  సంగతి కూడా మరిచి అంతటి దురాగతానికి పాల్పడ్డాడు. అందరూ నావి ఎత్తు పళ్ళు, పార పళ్ళు అని వెక్కిరించేవాళ్లుగా, ఆ పళ్ళనే ఆయుధాలుగా చేసి వాడి తీట తీశాను కానీ వెనకింటి ఆమె చూడనే చూసింది. మీరు చనువియ్యకపోతే దైర్యంగా లోపలికి ఎందుకు వస్తాడు ? డబ్బులకి ఆశపడి ఉంటారు,అందులో కుటుంబం కూడా జరగడంలేదుగా అంది. అవమానం అనిపించింది  నూతిలో దూకాను. అందరూ మతిస్థిమితం లేక  నీళ్ళు తోడుకుంటూ ఓపిక లేక కళ్ళు తిరిగి పడిపోయింది అనుకున్నారు అని చెప్పింది. అత్తయ్యగారు అన్నాను బాధగా , ఆ రంగారావు గాడు  మిమ్మల్ని అలా చేసినందుకు యేదో గుప్తరోగం వచ్చి చచ్చాడులే ! అన్నాను. నూతిలో నుండి యే సవ్వడి లేదు. అయ్యో! ఇప్పటిదాకా మాట్లాడిన వీళ్ళందరూ ఇంతలోనే యేమైపోయినట్లు ..అనుకుంటూ నూతొడ్డు  నుండి లేవబోయాను.

***********************

అందరు చెప్పింది విన్నావ్ . మరి నేను చెప్పేది వినవా ..అంది ఇంకో గొంతు చెయ్యి పైకెత్తి ఊపుతూ. ఆ చేతి నిండుగా  రంగు రంగుల గాజులు. ఇంకో రెండు రోజులుంటే అమ్మలక్కలు ఆ చేతుల గాజుల్ని పగలగొట్టి విధవని చేసేసేవాళ్ళు. పెద్ద కర్మ అవకముందే చచ్చిపోయింది కాబట్టి ఇదే నూతి ఒడ్డున చేటల నిండుగా గాజులు తెచ్చి అందరికి పంచిన జ్ఞాపకంలో నుండి తేరుకుంటూ   ఆమె వొంక చూసి నువ్వు మూలింటి  వాళ్ళ కోడలివి కదా అన్నాను. అవును అంది నవ్వుతూ. చందమామ ముఖంలో మల్లెపూలు పూసినట్టు ఉంది ఈమె నవ్వు అనుకున్నాను . పాపం ! మీ ఆయన చనిపోయాడని నువ్వు కూడా నూతిలో దూకి చనిపోయావు కదూ! తప్పు కదూ,పాపం నెలల పసిపిల్లవాడ్ని వదిలేసి మీరిద్దరూ అలా చచ్చిపోవచ్చా అన్నాను

 ఏం చేయను ? చచ్చిపోవాలని లేకపోయినా చచ్చిపోయాను. మా మామ ఎంతటి అభాండం వేసాడో నామీద. మా ఆయనకీ రెండో భార్యని నేను. మా అత్తమామ ఎప్పుడో గొడవలు పడి విడిపోయారంట . మా ఆయన మా మామ దగ్గర పెరిగి మంచి ఉద్యోగస్తుడు అయ్యాడు.హాస్పిటల్ లో పనిచేసేవాడు మా ఆయనకీ పెళ్ళి చేసి ఆయనతోనే ఉండేవాడట మామ. రెండో సంబంధం అయినా అందంగా ఉండాడు ఆస్తిపాస్తులున్నాయని మా అమ్మ  నన్ను వొప్పించి పెళ్ళి చేసింది. సంబంధం మాట్లాడుకునే టప్పుడే తండ్రి కొడుకు వేరు వేరుగా వుండేటట్టు అయితేనే పిల్లనిస్తానని మా అమ్మ చెప్పింది అంట. మా మామ ఈ ఊర్లోనే ఉండేవాడని మీకు తెలుసు కదా ! అప్పుడప్పుడు మా ఇంటికివచ్చేవాడు. మా ఆయన తను ఉన్నప్పుడే తండ్రిని మా ఇంటికి రమ్మని తను లేనప్పుడు మా యింటికి రావద్దని గట్టిగా చెప్పేసాడు. నా సవతి మీద లేనిపోనివన్ని పుట్టిచ్చి మా ఆయనకీ ఎక్కించి వాళ్ళని విడగోట్టేసాడని మా ఆయన చెప్పేవాడు. మా ఆయన చచ్చిపోయిన రోజు  యేమి జరిగిందంటే మామ మా ఇంటికి వచ్చాడు. భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి మా ఆయన డ్యూటికి వెళుతూ తండ్రిని బస్ యెక్కించేడు. మా ఆయన దూరంగా వెళ్ళాక ఎక్కిన బస్ దిగి   మళ్ళీ మా యింటికి వచ్చి కూర్చున్నాడు. నాకు యేదో జరుగుతుందని భయంగానే ఉంది. వంటింట్లో పనిచేసుకుంటున్న  నా వెనుక నిలబడి నడుం చుట్టూ  చేయి వేసాడు. అంతలో భళ్ళున తలుపు తెరచుకుంది . గుమ్మంలో మా ఆయన. నన్నేమి అనలేదుకానీ  తండ్రి ముఖాన ఖాండ్రించి ఉమ్మాడు. లోపలి గదిలోకి వెళ్లి మత్తు ఇంజక్షన్ చేసుకుని మంచంపై పడుకుని చనిపోయాడు. నేను తేరుకుని చూసేసరికి ఘోరం జరిగిపోయింది. దహన  కార్యక్రమాలన్నీ అయినాక కొడుకు చచ్చిపోవడానికి కారణం నేనే అని ఆయన హాస్పిటల్ నుండి యింటికి వచ్చేసరికి  నేనెవరితోనో కలిసి వుండటం చూసాడని అందుకే ఇంజెక్షన్ చేసుకుని చచ్చిపోయాడని  బంధువులందరికీ చెప్పాడు. ఆస్థిలో చిల్లిగవ్వ కూడా యివ్వనని  పేచీ పెట్టాడు. కొడుకు  ఎందుకు చనిపోయాడో మా అత్తకి తెలుసు. అంతకి ముందు భార్యపై చెప్పిన కల్లబొల్లి విషయాలన్నీ కూడా మా మామ కట్టుకతలే అని తల్లి కొడుకులకి తెలుసునని ఆమె చెప్పింది. అర్ధరాత్రి సమయంలో నన్ను నిద్రలేపి వాడి నిజస్వరూపాన్ని నాకళ్ళకి చూపించింది. పశువులతోనూ , పెంపుడు కుక్కలతోనూ వాడి పైశాచిక రతి క్రీడల గురించి చెప్పింది. నేను వణికిపోయాను. కొడుకుకి వారసత్వంగా వచ్చే ఆస్తిని పసిపిల్లాడి పేరున వ్రాయించడానికి పూనుకుంది కూడా !   మా అత్తకూడా నా తరపున మాట్లాడేసరికి నన్ను బెదిరించడం  మొదలపెట్టాడు. నా భర్తకి వచ్చే వాటా కాకుండా తనకున్న ఆస్తి మొత్తం నా పిల్లాడికి వ్రాసి యిస్తాను తనతో ఉండిపొమ్మని లేకపోతే  బయటవాళ్ళతో యెవరితోనో కాదు నీకు నాకు సంభంధం ఉండటం వల్లే నా కొడుకు చచ్చిపోయాడని చెపుతానని బెదిరించాడు. వాడి వేధింపులు భరించలేక నేను లేకపోయినా పిల్లాడిని మా అత్త బాగా చూసుకుంటుందనే నమ్మకం కుదిరి .. చెంబు పట్టుకుని వచ్చి మా అమ్మ ప్రక్కన ఉండగానే  ఈ నూతిలోకి దూకేసాను అంది. నేను మూగబోయి వింటూనే వున్నా.

ఆడాళ్ళకి చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడల్లా యిదిగో ఇట్టాంటి నూతులే సీతమ్మని భూదేవి  తల్లి తనలోకి పొదువుకున్నట్టు చల్లగా అక్కునజేర్చుకుంటుంది.  వినిపించుకునే మనసుండాలే కానీ వేల వేల నూతుల్లో నాలాంటి స్త్రీల లోగొంతుకలు వినబడుతూనే ఉంటాయి. నీ కలం అరువిచ్చి ఈ గొంతుకలని వినిపించు చెల్లీ .. ఇంటింటికి ఒక నుయ్యి లేకపోయినా వీధి వీధికి ఒక నుయ్యి అయినా ఉండాలి. జనం నీళ్ళు త్రాగడానికి కాదు. మన ఆడాళ్ళు కన్నీళ్లు దాచుకోవడానికయినా నుయ్యి ఉండాలి. నూతులని పూడ్వ నీయకండి.  తరతరాల ఆడాళ్ళ ఆత్మాభిమానాన్ని ఇలాగన్నా నిలుపుకోనీయండి,  వికృతమైన మగాడి కోరికల అగ్గి నుండి తప్పించుకుని పుట్టిళ్ళు ఆదరించకపోయినా  నిస్సహాయతలో ఆదుకోవడానికి ఓ తోడు ఉండనివ్వండి   అంటూ తలని నీళ్ళలోకి వంచింది ఆమె. నేను తేరుకునే లోపే గుడ గుడ మనే శబ్దం నూతి మధ్యలో. నీళ్ళు కాసేపు వలయాలుగా తిరిగి తిరిగి నిశ్చలంగా నిలబడిపోయాయి.

ప్రొద్దున్నే పనిమనిషి వచ్చి ఇల్లు ఊడుస్తూ అమ్మగారూ .. ఇవిగో యీ కాయితాలు యేవిటో చూడండి పనికొచ్చేయ్యే అంటారా .. కథలు గిధలు వ్రాసుకుంటారుగా, అయ్యేమన్నానేమో చూసుకోండి అంటూ  పేపర్ చదువుకుంటున్న నా  ముందు పెట్టి వెళ్ళింది.

నేనెప్పుడు వ్రాసానబ్బా ఈ కథ!  అనుకుంటూ చూసానా .. నూతిలో గొంతుకలు అని కనబడింది. వినబడింది కూడానేమో ! అందుకే కలం అరువిచ్చాను కాబోలు అనుకుంటూ  ఆలోచనగా ఆ కాగితాలవైపు చూస్తూ వున్నాను (అమ్మలు పెద్దమ్మలు అక్కలు అందరూ చిన్న పిల్లలు వింటే జడుసుకుంటారని గుసగుసలుగా చెప్పుకునే విషయాలు సబ్ కాన్షియస్ గా ఉండి ఈ కథ వ్రాశానా లేక నిజంగా  వాళ్ళందరూ కలలోకి వచ్చి జరిగిన విషయాలని చెప్పారా అని  తేల్చుకోలేక సతమతమవుతున్నా) 


(2018 మార్చి భూమిక రజతోత్సవ సంచికలో ప్రచురితం )


కామెంట్‌లు లేవు: