4, జనవరి 2013, శుక్రవారం

ఆనవాలు

పురిటి గడ్డని ఓ నాలుగేళ్ల తర్వాత చూస్తున్నాననేమో   ఎద లయలలో  ఎక్కడో రేగుతున్న  ఎడతెగని  ఉద్వేగపు అలజడి కన్ను మూతపడ నివ్వడం  లేదు. పక్క  కుదరడం   లేదు.

 పక్కనే మెసులుతున్న సవ్వడికేమో భార్య లేచి బద్దకంగా ఆవలిస్తూ "ఏమండీ! ఇకనైనా  నిద్రపోరా?ఎంతసేపని ఆలోచిస్తారు. మీకే విషయం మీద ఒక అభిప్రాయం లేనిదే ఇక మీ నాన్నకి  చెప్పి ఏం ఒప్పించ గల్గుతారు . ఆయనకన్నా సెంటిమెంటల్ ఫూల్ మీరు" అనేసింది. 

నేను ఏం సమాధానం చెప్పలేదు. "మీరు నిద్రపోతారో లేదో మీ ఇష్టం.తెల్లవారుజ్హామున లేచి  మెయిన్  డోర్  బయట  లాక్ చేసుకుని మీరు వెళ్ళిపొండి.నాకసలే నిద్ర చాలడం లేదు " అని చెప్పేసి ముసుగు తన్ని పడుకుంది. 

తన భార్యకి అంత సుతిమెత్తనైన మనసు లేకపోవడమే మంచిదేమో!ఎదుటి వారి మనసు గాయ పడుతుందో లేదో చూసుకోకుండానే అనాల్సిన మాట అనేసి ఎదుటి మనిషిని బాద పెట్టామనే బెరుకు కూడా లేకుండా అతి మాములుగా ఉంటుంది.

ఈ మాటలే  ఆమెతో అన్నాననుకోండి.  మీలా ఉంటే   ఇక ఈ లోకంలో బ్రతికినట్లే !   అయినా మిమ్మల్ని అని ఏం లాభం ? మిమ్మల్ని అలా పెంచిన ఆ పుణ్యమూర్తులని  ఎంతైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే అంటూ  గాలిదుమారంలా మాటలని విసురుతూ  విషయాన్ని అమ్మ నాన్నల వైపు  మళ్ళిస్తుంది.   లోకంలో   భార్యామణుల అసంకల్పిత ప్రతీకార చర్యకి ఎప్పుడూ బలయ్యేది భర్త వైపు వాళ్ళే  అనుకుంటాను. ఇలా ఆలోచిస్తూ ఒక గంటలోపే గడిపేసానేమో  ఇక ప్రక్క పై నుండి లేచి బయటకి వచ్చాను. హాల్లో దక్షిణం వైపు గోడకి  అమ్మ ఫోటో మినుకు మినుకు వెలుగుతోఉన్న దీపం.నాలో మిగిలినవనుకున్న జ్ఞాపకాల గుర్తుల్లా..  

అక్కడి   నుండి  .నా చూపు క్రిందికి దిగి దివాన్ కాట్ పై పడింది. ఒక ఇరవై రోజుల క్రితం వరకు నాన్న స్థానం అది.  అప్పుడప్పుడు నాన్న   పడక పిల్లలతో పాటే.  వాళ్ళ గదిలో కబుర్లు,హాయిగా క్రింద ఏ చాపో,దుప్పటో  పరచుకుని ఏ ఆంక్షలు లేకుండా నేలంతా డొల్లాడుతూ ఉష్! అమ్మ వస్తుంది అనే హెచ్చరికలు మద్య, కాశీ మజిలీ కతలు,సుమతీ శతకం వల్లె  వేయించడాలు, పిల్లల అల్లరి ప్రశ్నలు నాన్న ఓపికైన సమాధానాలు తో అదో చైతన్యం. 

కాలం  అలాగే గడచి పోతుందనుకున్నఆశ అడియాశ అయిపొయింది .

నాన్న ఇక్కడి నుండి వెళ్ళిన రోజు ఏం జరిగిందో కళ్ళ ముందు మెదిలింది.  నాన్న వల్ల పిల్లలకి క్రమశిక్షణ లేకుండా పోతుందని క్లాస్స్ లో రాన్కింగ్ పడిపోయిందని లాగే ఉంటే పల్లెటూర్లో  మట్టి  పిసుక్కో డానికి కూడా పనికి రారని  నా భార్య నిశ్చితాభిప్రాయం.

" మామగారూ ! మీ పాత కాలం సుద్దులు,శతకాలు వాళ్ళని ఏ అందలాలు ఎక్కించాలేవు. మీరు లేనప్పుడే నయం  పిల్లలు నేను చెప్పిన మాట వినేవారు. ఇప్పుడు మీ అలుసు చూసుకుని ఈవెనింగ్ ట్యూషన్ కి వెళ్ళడం లేదు" అంది.

"ట్యూషన్ లో చేర్పించు తల్లీ! నేనే రోజు సాయంత్రం  తీసుకునివెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాను " ఆన్నాడు నాన్న మృదువుగా..

"మీకెందుకు ఆ శ్రమ !? ఎలాగు గొడ్డు చాకిరి చేసుకుంటూ ఇంటాబయటా కష్ట పడి సంపాదిస్తున్నాను కదా.. ఇంటికే వచ్చి ట్యూషన్ చెప్పి వెళ్ళే ఏర్పాటు చేసాను లెండి. మీరు వాళ్ళ చదువుకి అడ్డు రాకుంటే చాలు" అంది పెడసరంగా.   

"అమ్మా!  తాత గారిని ఏమన్నా అన్నావంటే ఊరుకోను. నేనే ఎగ్జాం కి బాగా ప్రిపేర్ అవలేదని   చెపుతున్నాను కదా!"అన్నాడు రిషి . 

"ఏంటిరా ! ఎదురు సమాధానం చెపుతున్నావ్? చీరేస్తాను"అంటూ వాడి వెంట పడింది. 

ఆ రోజు రాత్రి మీ నాన్న ఇక్కడ ఉంటే..నా పిల్లలు నా మాట వినరు. వాళ్ళ భవిష్యత్   బాగుండాలనే కదా.. ఉద్యోగం చేస్తున్నాను అంది. తను ఒక రియల్ ఎస్టేట్ వారి ఆఫీస్ లో డెస్క్  వర్క్ చేస్తుంది. 

"అందుకే నాన్న ఉంటే మన ఇద్దరం వచ్చేవరకు వాళ్ళకి ఒంటరి తనం ఉండదు కదా! అయినా ఆయనేం చేసారు ..మధ్యలో "అన్నాను. 

"ఆయన ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్  తీసుకుని  ఏదో కొద్ది రోజులు ఉంది వెళ్ళిపోతారు అనుకున్నాను. ఆయన ఇక్కడే ఉండిపోతారని   అనుకోలేదు. అదివరకులా ఆ పల్లెలోనే ఉండవచ్చు కదా.".అంది.

"ఉన్నది నేను ఒక్కడిని. అమ్మ పోయిన పదేళ్ళ నుండి చుట్టపు చూపుగా రావడమే తప్ప ఆయనిక్కడ  ఎప్పుడైనా ఒక నిద్ర అయినా చేసారా ? ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఆయన అక్కడ ఉండటం ఏం బాగుంటుంది". అన్నాను. 

"మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆయన ఇక్కడ ఉండటానికి లేదు.."ఖండితంగా చెప్పింది. నేను ఇంకా వాదిస్తే నాన్నకి వినబడుతుందని నేను మాట్లాడలేదు.

వూళ్ళో పదెకరాల పొలంలో వచ్చే ఆదాయం అంతా తీసుకుని వచ్చి నాన్న కోడలికే ఇస్తుంటారు.  "ఇల్లాలంటే సంసారం నడిపే రధ సారధి. మగవాళ్ళకి ఏం తెలుస్తాయి  ఇంటి ఖర్చులు   అవీ.. పొద్దస్తమాను   కష్టపడటం  ఇంటికి వచ్చి తిని పడుకోవడం తప్ప "అంటారు.

అమ్మ ఉన్నప్పుడు అంతా అమ్మే చూసుకునేది.  తాతలు ఇచ్చిన రెండెకరాల పొలాన్ని పది ఎకరాలు చేసి.. ఇరవయ్యి ఏళ్ళు  నా పట్నం చదువుల కోసం  ఆహర్నిశలు  శ్రమించిన ఆయన్ని నా ఇంట్లో విశ్రాంతిగా ఉండనివ్వలేని నా చేతకానితననాకి  సిగ్గుపడాల్సి వస్తుంది.

 లోలోప దుఖం. "బాబూ !ఇలాగేనా నువ్వు మీ తండ్రికి ఇచ్చే గౌరవం అని అమ్మ నిలదీసి అడిగినట్లు ఉంటుంది. 

తెల్లవారాక నేను లేచే టప్పటికే నాన్న తన బట్టల సంచీతో ఊరికి వెళ్ళడానికి తయారుగా ఉన్నాడు.

"నాన్నా ఇప్పుడు ఊరికి వెళ్ళడం ఎందుకు? మీరు వెళితే పిల్లలకి ఎవరు తోడూ ఉంటారు? అన్నాను .నా మాటలు అతుకు పెట్టినట్లుగా ఉన్నాయని నాకు తెలుస్తూనే ఉన్నాకూడా

"మళ్ళీ వస్తానులే  బాబు.  ఏమిటో,  ఆర్నెల్లు అయ్యిందిగా ఊరిపై పీకుతుంది "అన్నాడు నాన్న.
తాతగారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని  కావ్య  ఏడుపు  మొహం పెట్టింది.

మళ్ళీ త్వరగానే వచ్చేస్తాను కదా తల్లి. ! అలా ఏడవ కూడదు అంటూ మనుమరాలిని  ఓదారుస్తూనే      అటు వైపు తిరిగి నాన్న కళ్ళు తుడుచుకుంటున్నారు.  


నేను ఏమి మాట్లాడకుండా కాలకృత్యాలు తీర్చుకుని నాన్నని బస్ స్టాండ్ లో దింపి వచ్చాను. 

నేను వచ్చే టప్పటికి భార్యా మణి పోన్ లో  వాళ్ళ అక్కతో అనుకుంటాను మొహం అంతా వెలుగుతూ ఉండగా చెపుతూ ఉంది.  

"అబ్బ , ఆ ముసలాయన పీడా వదిలిపోయింది.  ఆర్నెల్ల నుండి నా ఇల్లు నాకు పరాయిదై పోయింది. రోజు గంట కొట్టినట్లు అయిదున్నరకి అల్లా ఆయన గారికి కాఫీలు అందించడం,ఏడు గంటలకి టిఫిన్లు పెట్టడం.. విసుగేసిపోయింది అనుకో. ఆయన నాలుగు గంటలే లేవడం,వాకింగ్ కి కొడుకుని  లేపడం . పూలు కోసుకు వచ్చి పూజ చేసుకో అమ్మా అని చెప్పడం, నేను లేవడం ఆలస్యం అయితే వంట ఇంట్లోకి జొరబడి కాఫీలు   కలిపి .కొడుకుకి ఇవ్వడం నా వంట ఇల్లు అంతా  అరాచకం అయిపొయింది అనుకో !  పైగా ఆయన ఉంటే మా ఆయన నైటీ వేసుకోనివ్వారు. పెద్ద వాళ్ళ ముందు గౌరవంగా ఉండటం నేర్చుకోమని పోరు పెడుతుంటారు.  నా స్వేచ్చ, నా ఇష్టా ఇష్టాలు అన్నీగాయబ్.!  అందుకే మొహమాటం లేకుండా పిల్లల చదువు వంక చెప్పి గట్టిగా క్లాస్  తీసుకున్నాను. 


తెల్లారేసరికి సంచీ సర్దేసాడు." చెపుతుంది.

అటు వైపు ఏం అడిగారో కానీ నా గురించి ఒక స్టాండ్ మార్క్ స్టాక్ డైలాగ్  

"మా ఆయన ఒట్టి సెంటిమెంటల్ పూల్. ఆయన వెంట బడి బస్ స్టాండ్ దాకా వెళ్ళాడు.  మళ్ళీ ఈ సారి ఆ ముసలాయనని  ఈ ఇంటికి రాకుండా ఏం చేయాలో ఏమిటో..?  ఫిక్సుడ్ డిపాజిట్ లాగా పిక్సుడ్ లైఫ్ ఉంటే బాగుండును. సీనియర్ సిటిజన్స్ అనేది లేకుండా " అని.. పగలబడి నవ్వుతూ .  వెనుకకి తిరిగి నన్ను చూసింది కానీ  ఏమి తొట్రు పడలేదు.

పైగా "జోక్ బాగా పేల్తుంది కదండీ"అంది.

"నోర్ముయ్యి."అని మాత్రం అనగల్గాను. 

"మా ఆయనలో సెన్సాఫ్ హ్యుమరే లేదు. అన్నిటికి విసుగే "అని చెపుతుంది.

నిజమే!  నాలో సేన్సాఫ్ఫ్ హ్యూమర్ ఏమిటీ? హ్యుమానిటీ కూడా తగ్గుతుంది అనుకుని అక్కడినుండి దూరంగా పారిపోయాను.  నాలా భార్యల ముందు పిరికిగొడ్డులా పారిపోయేవాళ్ళు యెంత మందో! 

అలా నాన్న వెళ్ళాక ఫోన్ సమాచారమే తప్ప  ప్రేమగా ఆయనని నేను వెళ్లి చూసే తీరిక లేక  పోయింది.

నిన్న సాయంత్రం భార్య  ఆఫీసు నుండి హడావిడిగా వచ్చి చెప్పుల్లో   కాళ్ళు   అయినా తీయకుండానే

"ఏమండీ ఇది విన్నారా..!?"అని అడిగింది.

ఏమిటన్నట్లు చూసాను.  "మన వూరు ఉంది చూసారు."ఆగింది. నేను ఏమి అంటానో అని అనుకుంటాను.. 

మన వూరు అని అందంటే.. ఏదో ప్రమాదం ముంచు కొచ్చినట్లే  అని నా మనసు సంకేతం అందించింది. నేను చెప్పు అనకుండానే చెప్పడం మొదలెట్టింది. 

"మన వూరిలో మన పొలం ప్రక్క నుండే బైపాస్ రోడ్డు పడుతుంది అట. మన పొలం ప్రక్కన ఉన్న పొలాన్ని  ఓ ఇరవయి ఎకరాల వరకు  మా రియల్ ఎస్టేట్  వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారట.ఆ వెంచర్ కోట్ల లాభాలు ఆర్జించి పెడుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ కొనే పొలానికి దారి మన పొలం లోనుండే వెళుతుందట." అని చెప్పుకొచ్చింది. 

"అది దారి కాదు కాలువ కట్ట. ఆ కాలువ లో నుండి వచ్చే నీళ్ళే మాగాణి భూములకి ఆధారం. అలాగే వరదలు వచ్చినప్పుడు చేలల్లో నీళ్ళు అన్నీ ఆ కాలువ ద్వారానే బయటకి వెళ్ళాలి " అని చెప్పాను. 

"నిజమే అనుకోండి కానీ ఇపుడు వ్యవసాయం ఏం గిట్టు బాటుగా ఉందండీ, మనం ఆ కాలువ ని ఆనుకుని మన పొలం పొడుగూతా కొన్ని గజాలు దారికి ఇచ్చామంటే మన పొలంకి బోలెడంత  రేటు పెరుగుతుంది. మనం ఇచ్చిన స్థలానికి రేటుకి రేటు ఇచ్చి  మనకి సిటీలో  డ్యూ ప్లెక్స్  ఇల్లు ఇస్తామంటున్నారు. ఇచ్చేద్దా మండి. "అని చెప్పింది. ఒహొ..యెంత  పకడ్బందీ ప్లాన్ వేసేవే! భార్యా మణి అనుకున్నాను.

" నాన్నని ఒక మాట అడిగి "అన్నాను.ఆమె మాటని తక్షణం కాదంటే ఏం ఉపద్రవం సృష్టిస్తుందో తెలిసి.

"మీరు గట్టిగా చెపితే ఆయన ఏమంటారు. ఆయనకీ మనం కాక ఎవరం   ఉన్నాం. మన మంచి-చెడు ఆయనకీ కాక   ఎవరికి చెప్పుకుంటాం ? అంది.

నేను ఆమె మాటలకి ఆశ్చర్యపోలేదు. పదేళ్లుగా ఆమె రెండునాల్కల  ధోరణికి అలవాటు పడిపోయాను. 

"రేపే వెళ్లి మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి ఒప్పించండి." హుకుం జారీ చేసింది. నాన్న ఒప్పు కుంటాడో లేదో! కానీ నాన్నని ఒక  సారి చూసినట్లు ఉంటుంది వూరికి   వెళ్లి రావాలి అనుకుని ఆమె తో.. మాత్రం " సరే వెళతానులే  ! " అన్నాను. 

అలా నాలుగేళ్ల తర్వాత ఊరికి వెళుతున్నాను. సమయం నాలుగు గంటలవుతుంది.ఇక మళ్ళీ పడుకోకుండా స్నానం చేసి తయారు అయ్యాను. బయలుదేరేముందు ఎందుకైనా మంచిదని నాన్నకి   ఫోన్ చేసాను.   నాన్న ఆశ్చర్య పోతూనే  బండి మీద వద్దు దట్టమైన పొగ మంచు కురుస్తుంది. బస్ ఎక్కి రా అని చెప్పాడు. 

నేను బస్ దిగేటప్పటికి నాన్న  బస్ స్టాప్ లో నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను బస్ దిగగానే నా చేతిలో ఉన్న సంచిని అందుకోబోయాడు.నేను  సున్నితంగా తిరస్కరించాను. చాలా కాలంకి రావడం మూలంగా నేమో.. "బాబూ బాగున్నావా? చాలా ఏళ్ళ తర్వాత వచ్చావ్? నాన్నని మళ్ళీ  తీసుకు వెళ్ళడానికి వచ్చావా? "లాంటి ప్రశ్నలతో నన్ను నాకు గుర్తు చేస్తున్నారు. 

 అందరిని పలకరింపులకి సమాధానం ఇస్తూ  ఇంటికి వచ్చే టప్పటికి ఓ పావు గంట పట్టింది.  

"పిల్లలు ఎలా ఉన్నారు ? పద్దాక వాళ్ళే గుర్తుకు వస్తున్నారు" అడిగాడు నాన్న. "బాగున్నారు నాన్నా. నిన్ను తీసుకురమ్మన్నారు "అబద్దం చెప్పాను. 

నిజానికి   నేను ఇక్కడికి వచ్చేదే తెలియదు వాళ్ళకి . అని మనసులో అనుకుంటూ                


నాన్న చేది పట్టిన బావిలోని నీళ్ళు   పాకుడు పట్టకుండా తెల్లగా సున్నం రాసిన రాతి తొట్టి నిండా  తొణికిసలాడుతున్నాయి నా మనసులో నిండిన సంతోషంలా .  

కాళ్ళు కడుక్కుని   కాస్త మొహం మీద నీళ్ళు చిలకరించుకుని కర్చీఫ్ తో తుడుచుకుంటుంటే నాన్న తన భుజం మీద తువ్వాలు తీసి ఇచ్చాడు అమ్మ చీర కొంగుతో తుడుచుఉన్న ఆత్మీయ  స్పర్శ గుర్తుకు తెచ్చేలా. 

"ఇటు కూర్చోరా ఇప్పుడే కాఫీ తెచ్చి ఇస్తాను" అన్నాడు నాన్న. అతిది మర్యాదలు జరపడానికి నాన్న తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు. ఉండాల్సిన అమ్మ పది ఏళ్ళక్రితమే కాలం   చేసింది.  అమ్మ ఉన్నప్పుడు మరుగున పడిన నాన్న ప్రేమ ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. నాన్న కాఫీ కలుపుతూ ఉంటే  ఇల్లంతా తిరిగి చూసాను. పెచ్చులు పెచ్చులు గా ఊడిపోయి ఉన్న సున్నం గోడలు, పగలంతా ఎనిమిది గంటల కరంట్ కోతతో చీకటితో నిండిన గదులు  ఒక   విధమైన ముక్కు   వాసన  అబ్బ ఈ వాసనలో ఈ చీకటిలో నాన్న ఎలా ఉంటున్నాడో !?  

అందరి ఇళ్ళు బాగున్నాయి. తను బ్యాంకు లోన్ తీసుకుని అయినా  మంచి ఇల్లు ఇక్కడే కట్టుకోవాలి. ఎక్కడెక్కడో.పెద్ద ఇల్లు ఉంటే మాత్రం ఏం గొప్ప? పుట్టిన ఊర్లోనే గొప్పగా ఉండాలిగాని అనుకున్నాను స్వగతంలో  

అమ్మ ఉన్నప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే ఇల్లు ఇలా అయిపొయింది. క్రింద గచ్చంతా  కూడా తవట వేసినట్లు మచ్చలు మచ్చలుగా ఉంది. నాన్న వంట ఇంట్లో ఏదో అవస్థలు పడుతున్నట్లున్నాడు. 

నా కోసం  ఏమి ప్రత్యేకంగా చేయ వద్దు   అని చెప్పడానికన్నట్లు వంటింట్లోకి  వెళ్లాను. వంటింటి  గోడపై అమ్మ సంప్రదాయం కొనసాగిస్తూ  ఉన్నట్లు బల్లులు రాకుండా ఉంటాయని అమ్మ పెట్టినట్లుగానే కోడిగుడ్డు డోప్పలు తగిలించే ఉన్నాయి. శుభ్రంగా కాగితాల పిండితో అలికిన చేట, గోడకి కొట్టిన  గ్యాస్ లైటర్ స్టాండ్ అన్నీ అమ్మ ఉన్నప్పుడు  ఉన్నట్లే ఉన్నాయి. బియ్యం డబ్బా తీసి చూసాను పురుగు పట్ట కుండా ఎండిన వేప ఆకు కలిపి   వుంది.  కాఫీ తాగుతూ పెరట్లో తిరుగుతుంటే నాన్న బియ్యం కడిగి ఆ నీటిని కరివేపాకు చెట్టు మొదట్లో వంచుతూ కనబడ్డాడు.  చిన్నప్పుడు తను  నిద్ర లేచేటప్పటికే ఎర్రగా మండుతూ సెగలు కక్కే బొగ్గుల కుంపటి,పొగ గొట్టం తుప్పు పట్టి కనిపించాయి అమ్మ పక్కనే ఉండి సరదాగా  పొగ ఊది అవస్థలు పడిన రోజులు  జ్ఞాపకం వస్తున్నాయి.  విసన కర్ర తీసుకుని బొగ్గుల పొయ్యిని బాగా రాజింపజేసిన జ్ఞాపకం, 

ఎన్నో రోజులుగా కోయకుండా రాలిపోయి ఉన్న సన్నజాజులు మనుషులు ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్న  విధంకి  ప్రతీకగా కనిపించాయి. 

నిజానికి తన వూరు ఊరంతా ఖాళీ అయిపొయింది. తన తండ్రితరం వారు కొద్దిగా వాళ్ళ తండ్రుల తరం వారు వేళ్ళ సంఖ్యలోనూ  గత వైభవాన్ని గుర్తుకు తెచ్చు కుంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఒకమాదిరిగా ఉన్న కుటుంబాలలోని పిల్లలందరూ చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే   స్థిరపడి పోయి వాళ్ళ ఆర్దిక   అభివృద్దికి చిహ్నంగా పాత పెంకుటిళ్ళు కూల్చి  మేడలు కట్టారు కార్లు అమర్చారు కానీ అందులో ఉంటున్నది మాత్రం జీవచ్చవాలే! ఏడాదికో రెండేళ్ళకో ఆ ఇళ్ళకి ఓ పది రోజులు పండగ వస్తుంది. అంతే! వచ్చినప్పుడు..కూడా ప్రేమగా, ఆత్మీయంగా హత్తుకోలేని అడ్డు గోడలు ఒట్టి పోయిన  పశుశాలలు.

కాన్వెంట్   చదువుల కోసం మిగిలిన కుటుంబాలు దగ్గరలోని సిటీకి  కాపురాలు  మార్చడం, నామ మాత్రంగా మిగిలిపోయిన వ్యవసాయం, విస్తరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం.ఇది తన ఊరు ముఖ చిత్రం. 

దాదాపుగా అన్ని ఊర్ల పరిస్తితి ఇంతేనేమో! పల్లె వెళ్లి పట్నంలో కలుస్తుందా ? పట్నం వచ్చి పల్లెని  కబలిస్తుందా?  ఏదో చెప్పలేని పరిస్థితి.    

ఎండ పెరిగింది. లోపలి వచ్చాను. గోడల చల్లదనం హాయిగా ఉంది . చలువరాతి పరిశుభ్రమైన   ఇంటిలో ఉంటున్న తను ఈ ఇంటి వాతావరణం కి అలవాటు పడటానికి   ఓ గంట పట్టింది.అయినా ఇక్కడ ఏదో తెలియని హాయి ఉంది. నాన్న ఏదో రెండు కూరలు వండాక తనకి పెద్దమ్మ  వరుసకయ్యే ఆమె వచ్చి మా ఇంట్లో భోజనం చేయి బాబు. పాపం నాన్న ఏం చేయి కాల్చుకుని చేస్తాడు అని వచ్చింది. 


"లేదులే పెద్దమ్మా  నాన్న  వంట చేసేసాడు.ఇక్కడే తింటాను." అని చెప్పాను.సరే రాత్రియినా మా ఇంట్లో భోజనం చేయి."అని చెప్పింది పెద్దమ్మ. 

రాత్రికి  ఇక్కడ ఉండటమా? ఆలోచన. సరే అన్నట్లు తల ఊపాను. నాన్న ముఖంలో సంతోషం; ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఓగంట తర్వాత భోజనం చేసాం. నాన్న కొసరి కొసరి   వడ్డించాడు. ఇంట్లో నాలుగు రకాల కూరలలో లేని రుచి ఏదో తగులుతుంది.అది ప్రేమ రుచి అనుకుంటాను.  

కాసేపు అలా పందిరి మంచం మీద పడుకున్నాను. చిన్నప్పుడు నుండి ఈ మంచం మీదే కదా పెరిగి పెద్దయ్యింది ఎందుకో ఆ మంచం మీద అమిత మైన ప్రేమ పుట్టుకొచ్చ్చింది. ఏనాడు నాన్నని ఏది అడగని నేను..  నాన్నా ఈ పందిరి మంచం కావాలి నాకు అడిగాను. నాన్న నవ్వి అలాగేలేరా వేసి పంపనా? అన్నాడు. కాదు నేనే వేసుకెళతానూ అన్నాను. నాన్న అర్ధమైనట్లు తల ఊపాడు. ఓ గంట పాటు చిన్న కునుకు   తీసి  నాన్న ఇచ్చిన టీ  తాగి నాన్నా ! అలా మాగాణి పొలం లోకి వెళ్లి వద్దామా అడగాలనుకున్నాను. అంతలో నాన్నే అడిగారు. "అలా. మాగాట్టి చేలోకి వెళ్లి వద్దాం రా ! అని.   సరే అన్నాను. 

మాగాణి పొలాల మద్య నుండి నున్నని తారు రోడ్డు. పల్లె నుండి పట్టణానికి జ్ఞానాన్ని, సంపదనంతటిని  మోసుకుని వెళ్ళడానికి   వేసినట్లు.

ఈ రోడ్డుని వెడల్పు జేసి   బందరు దాకా బైపాసస్ రోడ్డు వేస్తున్నారు రా అన్నాడు నాన్న.

" నేను పేపర్లో చదివాను"  చెప్పాను. 

ఆ రోడ్డు నుండి చీలి ఎడమ వైపు ఉన్న మా పొలంలోకి  దిగాము వరికోసి  వేశాక రెండో పంటకి   నీళ్ళు అందుతాయో లేదని అపనమ్మకం వల్ల ఏమో ఎవరు మళ్ళీ దాళ్వా సాగు చేయడం లేదు ఆరు తడి పంటలు వేసారు. మా చేనుకి తూర్పు ప్రక్కన   ఉన్నపంట కాలవ దగ్గరికి వచ్చాం. కాలువ ఎండి పోయి ఉంది. 

"ఈ కాలవని దానికి ఆనుకుని ఉన్న మన పొలంలోని ఓ ముప్పై  అడుగుల వెడల్పుకి వచ్చే దారినే కదా వాళ్ళు ఇమ్మని అడుగుతుంది."అడిగాడు నాన్న. 

నేను షాక్ అయ్యాను. "నాన్నా మీకు ఇది ముందే తెలుసా.!?"  అడిగాను. 

"లేదురా! నువ్వు బయలు దేరి వచ్చాక  కోడలు పోన్ చేసి చెప్పింది." చెప్పాడు నాన్న. పీకల దాక భార్య పై కోపం   ముంచుకొచ్చింది.

"నాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏం లేదురా!  పిల్లలకి నగరం నడిబొడ్డు కి స్కూల్  కి  వెళ్ళడానికి గంటల తరబడి బస్ లలో   మగ్గిపోవాల్సి వస్తుంది.  మనం ఈ దారి ఇస్తే మనకి  ఇల్లు ఇస్తారు. బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఈ కాలువ మొత్తాన్ని పూడ్చేసి రోడ్డు వేసేస్తారు. ఈ కాలవ  క్రింద సాగులో ఉన్న పొలాలకి యెంత ఊపిరో నీకు తెలుసు. ఈ కాలవ కింద అందరు ఎకరం, రెండెకరాలు ఉన్న  రైతులే . ఇప్పటీకే వ్యవసాయం గిట్టు బాటు అవక అప్పుల్లో ఉన్నారు. మనం దారి ఇస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు సిండికేట్   అయి వాళ్ళ అవసరాలని తెలుసుకుని పొలాలన్నీ కారు చవకగా కాజేద్దామని   చూస్తారు. ఊరు ఊరు గాకుండా పోతుంది" అని వివరంగా చెప్పాడు నాన్న.

"అయినా ఇక్కడ వచ్చి ఎవరుంటారు రా ఇక్కడ ఏమన్నా కాలేజీలా పాడా? ! ఏదన్నా రోగం, నొప్పి వచ్చినా  హాస్పిటల్ కి  పాతిక మైళ్ళు పరిగెత్తాలి. "

"అది కాదు   నాన్నా! ఏదో ఇళ్ళ నిర్మాణం కి అంటున్నారు.

"లేదురా! ఆమతలబున్నీ నిజం కాదు ఏదో నల్ల డబ్బు ఉన్న వాళ్ళ పన్నాగం ఇది. ఇక్కడ ఇళ్ళ ప్లాటులు ఏసినా  వెర్రి బట్టినట్టు కొనేది పట్నం వాళ్ళే  రా ముందు ముందు పెరగకపోతాయా అని ఆశ. ఇంకొన్ని   ఏళ్ళకి ఇది కూడా   దొరకదని భయం, లేని డిమాండ్   సృష్టించి నోటి మీద లక్షల లెక్క   పెంచేస్తున్నారు. రెండేళ్లనాడు లక్ష రూపాయలు కూడా రేటు పలకని పొలాలు ఈ ఏడాది ఇరవై లక్షలకి కొని ఏం చేస్తారు? పంట గట్టిగా పండినా ఇరవై వేలకి  మించి ఆదాయం రాదు.ఇరవై లక్షల  రేటు అనడమే కానీ ఆరు లక్షలకి  మించి ఎక్కడా   బేరం జరగడం లేదు. అంతా  వ్యాపారుల మాయా జాలం  అని వివరంగా చెప్పాడు నాన్న.

"మనం ఇప్పుడు దారి ఇస్తే కాలవ లేకుండా పోద్ది. ఈ ఊరులో వ్యవసాయం చేసేవాడు ఉండడు .అయిన కాడికి   అమ్ముకుని అప్పులు తీర్చుకుని బాధల నుండి బయట పడతారు, జల్సాలు చేస్తారు".సూక్ష్మంగా అన్నీ పరిశీలించినట్లు  చెప్పాడు నాన్న  నాకు ఆశ్చర్యం వేసింది.  నాన్నది ఏడో  తరగతి చదువు మాత్రమే! అయినా యెంత అవగాహన.!! అందుకే చదువు కన్నా అనుభవం ముఖ్యం అంటారు.   

నేను ఆలోచించసాగాను. "మనం దారి ఇవ్వవద్దు.నాన్నా ! ఎక్కడ   పడితే అక్కడ ఆక్రమించుకుని అక్రమ   నిర్మాణాలు చేపట్టి,నీటి పారుదల వ్యవస్థని, మురుగునీటి వ్యవస్తని నాశనం చేసి చెరువులు ఊళ్ళు, ఊళ్లు చెరువులు అయ్యే  పరిస్తితిని అడ్డుకోవాలి అంటే మనం మన వంతు భాద్యతగా ఉండాలి" అన్నాను నేను. 

"మన  దూరపు బంధువు నాకు బాబాయి కొడుకు రవి నీకు  బాబాయ్ అవుతాడు   వాడు  తెలుసు కదా..  ..పొలాలకి రేట్లు పెరిగినాయని  ధీమా వచ్చి వడ్డీలకి తెచ్చి  మరీ వ్యాపారం చేసాడు. అటు వ్యాపారం కలసి రాలేదు. ఇప్పుడు లక్షలకి లక్షలు రేటు పలుకుతుందని అనుకున్నపొలం కొనే నాధుడే లేడు. కొనుక్కునే  వాడు ఆరు లక్షలు అంటాడు. అమ్ముకునేవాడు ఇరవయి లక్షలు ఉంది..అంతకన్నా తక్కువ  అయితే ఇవ్వనని భీష్మించుకుని కూర్చుని ఆఖరికి అప్పుల వాళ్ళ  బాధలు పడలేక పురుగు మందు తాగి చచ్చిపోయాడు. ఉన్న పొలం అంతా  అప్పులవాళ్ళు ఎగదన్నుకుపోయారు. వాడి పెళ్ళాం బిడ్డలు రోడ్డున పడ్డారు" నాన్న బాధగా చెప్పాడు.      

అలా వ్యవసాయం ,ఇబ్బందులు చెప్పుకుంటూ ఇంటికి  వచ్చాం.

ఆ రాత్రికి ఆలోచిస్తూ ఉన్నాను.

అర్ధరాత్రి లేచి నాన్నని లేపి మరీ చెప్పాను, నాన్నా! మనం  దారి ఇవ్వం. మా పది ఎకరాలు పొలం మొత్తం ఎకరం ఇరవయ్యి లక్షల చొప్పున అయితేనే  ఇస్తాం అని చెపుదాం.అన్నాను.

వాళ్ళు ఖచ్చితంగా  వద్దని అంటారు రా,ఎందుంటే మనం దారి ఇస్తే వాళ్ళు కొనే పొలం రేటు ఎకరం ఆరు లక్షలు. మన పొలం  కొనే రేటు ఇరవై లక్షలు  పెట్టాలి గనుక    లాభాలు ఉండవు కాబట్టి ఎట్టి  పరిస్థితుల్లోను  కొనరు అన్నాడు నాన్న .

అదే  కదా ! మనకి   కావాల్సింది. ఇక  వ్యాపారులెవరు మన పొలాలకేసి  కన్నెత్తి చూడరు  అని చెప్పాను.

నాన్న తలపంకించాడు . 

తెల్లవారి నాలుగు గంటలకే నా సెల్ పోనే మోగింది. నా భార్య నుండి పోన్. నాన్న  పొలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడా లేదా అన్నది తెలుసుకోవాలని ఆత్రం. 

"నీకొక శుభవార్త నాన్న  దారి మాత్రమే  ఎందుకు? మన పది ఎకరాలు పొలం అమ్మేసుకో అని అన్నారు.   . ఎకరం ఇరవై లక్షలు రేటు వస్తుంది. మనకి   రెండు కోట్లు   వస్తాయి చెప్పాను  ఆశ గా ఊరిస్తూ..

"అవునా మామయ్యా గారు ఒప్పుకున్నారా? మై గుడ్నెస్   చాలా హేపీ అండి." అంది.

ఒక   మాట నువ్వు ఏమనుకోనంటేనే .!? .అడిగాను. "చెప్పండి "అంది భార్యా మణి

"మరి నాన్న పొలం అమ్మేశాక ఎలా ! ఆయన  ఎక్కడ  ఉంటారు? " అడిగాను .

 "అయ్యో ! అదేం మాటండీ, ఆయనకి మనం కాక  ఇంకా ఎవరున్నారు. మనతోనే ఉంటారు.ఇంటికి పెద్దదిక్కు .పిల్లలు కూడా ఆయనపై దిగులు పెట్టుకున్నారు. 

ఆయన రానన్నా సరే బలవంతంగానైనా తీసుకుని రండి" చెప్పింది సంతోషంగా రెండు కోట్లు వస్తున్నాయి అనే ఆనందంలో.

అలాగే మరొక   పోన్ చేసాను. మేము మీకు దారి ఇవ్వదల్చుకోలేదు. పొలం మొత్తంగా అయితేనే  అమ్మదలచాము. ఎకరం  ఇరవై లక్షల ఖరీదు  లెక్కన అయితేనే   ఇస్తామని చెప్పాను. వాళ్ళు అంత ఎక్కువైతే వద్దని చెప్పేశారు నాకు.  ఇప్పుడు ఎంతో .హాయిగా ఉంది. నా పొలం జోలికి ఇప్పట్లో ఎవరూ రారు.  

నిజానికి ఆ పొలం అమ్మడం నాకేమాత్రం ఇష్టం లేదు.  నా భార్య మాటల్లో నేనెప్పుడు ఓ..సెంటిమెంటల్ పూల్ ని. కానీ నా ఊరు, నా వాళ్ళ విషయంలో నేనెప్పుడు సెంటిమెంటల్ ఫూల్ నే నని నా భార్య కి అర్ధంయ్యేదాక ఓర్చుకోక తప్పదు కూడా. 

అలాగే నా భార్య పరిస్తితి ఇప్పుడు  కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది.  ఇప్పుడామె  నాన్నని కాదని అనడానికి వీలులేదు . 

అలా నేను అనుకున్న రెండు పనులు అలా విజయవంతంగా నెరవేరాయి. 

నాన్నా,నేను కలసి పందిరి మంచం వేసుకుని పట్నం బయలుదేరాం.  మా బొగ్గుల పొయ్యిని, ఊదుడు  గొట్టాన్ని  చేతిలోకి తీసుకున్నాను.  నా కొడుకు రిషి కి వాటిని  అపురూపంగా చూపాలని. 

చిరు చీకట్లు ముసురు కుంటున్నాయి.  అక్కడ చిరు కాంతులతో నా ఊరు  పల్లె ఆనవాలు మిగులుస్తున్నట్లు ఉంది.

"అవును, నా తరం వరకయినా   నా పల్లె ఆనవాలుని  కాపాడాలని కంకణం  కట్టుకున్నాను.

కౌముదిలో 2012 మే మాసంలో వచ్చిన కథ                                          

4 కామెంట్‌లు:

Dantuluri Kishore Varma చెప్పారు...

మీ కథ చాలా బాగుంది. `చాలా` కంటే పెద్దమాట దొరకక అదే ఉపయోగించాను.

అజ్ఞాత చెప్పారు...

భార్య దగ్గర ప్రతివారూ సెంటిమెంటల్ ఫూలే :)

Meraj Fathima చెప్పారు...

vanajaa, story adbhutamgaa undi, manchi message. eppatilaa mee saili chaalaa baagundi.

Krishna చెప్పారు...

chala chala bagundi andi