27, మే 2016, శుక్రవారం

మౌన శతఘ్ని

సినీ గీత రచయితగా జనులందరికి  తెలిసిన "భువన చంద్ర " గారు మంచి రచయిత అని  వెబ్ పత్రికలలో  విరివిగా వస్తున్న వారి రచనలు, ప్రింట్ మీడియాలో వచ్చిన కథల ద్వారా తెలుస్తుంది.   నది మాసపత్రిక జన్మదిన ప్రత్యేక కథా సంచిక లో వచ్చిన "భువన చంద్ర" గారి  "మౌనం " కథని ఇటీవలే చదివాను. చదివిన తర్వాత మనసుకి ఉక్కపోసినట్లైంది. ఆ ఉక్కపోత నుండి బయటపడాలంటే స్పందననే  శీతలపవన పరిమళాలని వెదజల్లడం తప్ప వేరే మార్గం లేదనిపించింది.

"మౌనం" కథ మౌన శతఘ్ని లా పేలింది.  కథ సాధారణమైన కథే కదా అనిపించే అసాధారణమైన కథ. " దేవుడు గారు కాసేపు  నువ్వూ ఇక్కడికొచ్చి పడుకోరాదు. ఒక్క సారైనా నామాట విను ఇలాంటి చోటు నీకు దొరకనే దొరకదు. చావుకి  పుటక్కి అతీతమైన చోటు అది అక్కడికొచ్చి నిద్రపోకూడడూ అని కోరుకుంటాడు. మళ్ళీ అంతలోనే ఈ మనుషులే దేవుడు  ఎప్పుడు నిద్ర పోవాలో నిర్ణయించిన  సమయాలు  గుర్తుకు తెచ్చుకుంటాడు.
మానవుడు వ్యక్తే కానీ వ్యక్తి స్వేచ్చ లేనివాడు ఆత్మ స్వేచ్చ లేనివాడు . దేవుడికి కూడా స్వేచ్చ ఇవ్వనివాడు " అని నిర్మొహమాటంగా మానవరీతిని గర్హిస్తారు.

మనిషి గర్భస్థ శిశువుగా ఉన్నపుడు నుండే ఎందరి  ఆశలో మోపబడినవాడు. నా వంశాంకురం, మా ఇంటి మహాలక్ష్మి అంటూనే పెద్దవారి ఆకాంక్షలని ఆశలని మోసేవాడు. గోరుముద్దలు తింటూ చందమామ వస్తాడని రెక్కల గుర్రం పై ఎగిరిపోవాలని ఆశగా ఎదురుచూసిన వాడు. పెద్దలు చెప్పిన అబద్దాలని మురుగుపాల రుచితో ఆస్వాదించి తర్వాత అబద్దాలని అర్ధమై అసహ్యించుకున్నవాడు. తన వారి ఆశలని తిని తాగి శ్వాసించి విశ్వసించి విసర్జించి మళ్ళీ కొత్త ఆశలతో కొత్త రోజుని ప్రారంభించేవాడు.  తన పుట్టుక,  కులం ,మతం, చదువు , ఉద్యోగం,వివాహం అన్నీ ఇతర ఆశల మేరకు మోస్తున్నమనిషి గురించి మదనపడేవాడు. ఆగి ఆగి కథ చదువుకుంటూ మనం మధనపడే కథ ఇది . కథలో ఎవరికీ వారికి  ఎన్నో రుజువులు దొరుకుతాయి.  ఈ కథలో మనిషి తనవారందరిచేత నియంత్రించబడిన మనిషి. 

అడుగడుగునా తఃల్లితండ్రి తోడ బుట్టినవారు  భాగస్వామ్యి  నియంత్రణ పిల్లల గొంతెమ్మ కోరికలు అవి తీరక పొతే వచ్చే అసంతృప్తుల సెగల ధాటికి కుళ్ళి కునారిల్లే మనిషి  యొక్క మౌనపు ముసుగుని బట్టబయలు చేసిన కథ ఇది. ఈ కథ చదివి ఉల్కి పడ్డాను. అలా ఉల్కి పడకపోతే మన దగ్గర  మనుషుల అనవసర మౌనం ఏమిటో మనకి అర్ధం కానట్టే !  మనసు సంగతి బహిర్గతం కాని ఎన్నో ఊసులు అభిప్రాయాలు అన్నీ గొంతు క్రిందే అణిచి వేయబడతాయి. తల్లిదండ్రుల ఆశలని భార్య ఆకాంక్షలని, బిడ్డల మనసెరిగి కోరికలని తీర్చలేని అసమర్ధ మానవుడి మౌనం ఇది. శిలలా మారిన మనిషి కథ ఇది నువ్వు నేను ఇద్దరం శిలలమే లేదా బండరాళ్ళమే పోనీ గులకరాళ్ళం అంటూ పాఠక  నిశ్చల మానస సరోవరంలో ఒక గులకరాయిలా పడింది . ప్రతి ప్రశ్న ఒక గులకరాయి. ఆలోచనా తరంగాలు వలయాలు వలయాలుగా విస్తరిస్తున్నాయి. ఆ మౌనం  అక్షరాలలో భగ్నమైన కథ ఇది.    చిన్నప్పుడు తల్లి పాడిన చందమామ రావే పాటని గుర్తుకు తెచ్చుకుంటూ  ఎవరైనా అలాంటి  పాటే పాడుతూ నిద్రపుచ్చమని కోరుకుంటూ   సమాధిలో నిద్రపోవడానికి త్వరపడి పోయే పాత్ర.

ఈ కథ ముగిసిన తర్వాత అలా అచేతనంగా ఉండిపోయాను. నాకు జన్మ నిచ్చిన వారిని, నా రక్తం పంచుకు పుట్టిన వారిని, జీవితాన్ని పంచుకున్న వాడిని, కడుపునపుట్టిన బిడ్డని అందరిని తలుచుకున్నాను. వారితో నాకున్న సంబంధ బాంధవ్యాలని సమీక్షించుకున్నాను.   ఆత్మ విమర్శ చేసుకున్నాను.మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే, ఆశా నిఘాతాలే అని అర్ధమైపోయింది. అర్ధంకాని దుఖమేదో తిష్టవేసింది. ఒకటి మాత్రం నిజమనిపించింది.  . తమ ఆజ్ఞాలకి కట్టుబడి ఉండాలని ప్రేమ పేరుతొ ఆదేశించిన ప్రతిసారి మనిషి నియంత్రించబడినట్టే! అలా ఆజ్ఞాపించినవాళ్ళు ఎవరైనా కావచ్చు. ప్రతి నియంత్రణ ఉరి లాంటిదే. నియంత్రణల మధ్యే మనిషి బ్రతుకు ముగిసిపోతుంది.
.
"ఖలీల్ జిబ్రాన్".ఇలా.. అన్నారని ఎక్కడో.. చదివాను."పిల్లలు.. ప్రకృతి ప్రసాదించిన వరాలు.నరజాతి భవిష్యత్తుకు ప్రతీకలు. పిల్లలు మననుంచే వచ్చారు..కానీ వాళ్ళు మనకు మాత్రమే.. సంబంధించిన ఆస్తులు కాదు. మన వ్యక్తిగత ఆకాంక్షల తోను,బలహీనతలతోను పిల్లల  మీద రుద్ది వాళ్ళ జీవితాలను నరకప్రాయం చేయడం అమానుషం. పిల్లలలో.. శక్తి -సామర్ద్యాలువికసించేలా  ..చేయడం, వ్యక్తిత్వం రూపొందేలా..శాయశక్తులా కృషి చేయడం,ఎదిగాక ప్రేమించే స్నేహితులుగా..వారికి ఆత్మీయతని పంచడం మన ధర్మం. " అని.  కానీ మనం మాత్రం అస్సలలా  ఉండలేము . మన వారిని  మనం చేరుకోలేని లక్ష్యానికి చేరే  బాణం గా మార్చే  ధనుస్సులం మనం.


మానవజీవితానికి నైతిక విలువలు ఉత్తమ మానవీయ విలువలు నేర్పడానికి మత గ్రంధాల అవసరాన్ని మనం త్రోసి పుచ్చలేం కానీ   మానవ వారసులని లోకానికి అందించే క్రమంలోనూ  వారి అభివృద్ధిని కాంక్షించడంలోనూ పిల్లలపై  ఆధిపత్యం వహిస్తున్నామేమోనని అనిపించక మానదు. అలాగే భార్య /భర్త కూడా వ్యక్తి స్వేచ్చని హరించి మన మంచి కోసమేగా చెపుతుంది అని తీర్మానించేస్తారు. ఈ కథలో అన్ని పాత్రలున్నాయి. మనిషి మౌన మరణానికి  అందరూ కారకులే !

తనకి కావాల్సింది ఏమిటో తెలిసిన వాడు చొరవగా తీసుకోగల్గినవాడు జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఈ కథలో నాయకుడు  అలాంటి చొరవ చేయలేనివాడు, పిరికివాడు క్షణం క్షణం భయపడుతూ,బాధపడుతూ ,నిసృహతో కాలం వెళ్ళదీస్తాడు తప్ప ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేయడు పాపపుణ్యాల బేరీజులో తనమునకలై ఉంటాడు కాబట్టి. జీవితమంటే జీవితాన్ని ప్రేమించడమే అని తెలియక దశాబ్దాలుగా మౌనం వహించినవాడు. బంధాలన్నీ హింసే అన్న సత్యం ఎరిగినవాడు.  మనసు నిండా  కాలం వేసిన చేదు  గురుతులతో కాలసర్పం కాటుకై ఎదురుచూస్తుండటంతో కథ ముగుస్తుంది .  పిల్లలు మన నుంచి వచ్చిన వాళ్ళే కాని వాళ్ళు ప్రవర్తన తల్లిదండ్రులని అమితంగా బాధిస్తుంది. కృతజ్ఞత లేని పిల్లలు నాగుబాము లాంటి వారంట ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకువచ్చింది. మనం మరిచిన బాధ్యతలేమైనా ఉంటే ఆ దిశగా కార్యోన్ముఖులని చేస్తుంది.

మిగిలిన జీవితంలో నేను చేయాల్సిన పనేమిటో నాకు స్పష్టంగా బోధపర్చిన కథ ఇది. చీకటిని చూసి చూసి నొప్పి పుట్టిన కళ్ళకి వెలుతురు నిచ్చిన కథ ఇది .

ఈ కథ చదివిన ఎవరికైనా ఇలాంటి సృహ కలగాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ ... ఇలాంటి కథలు మరెన్నో వ్రాయాలని కోరుకుంటూ ...

భువనచంద్ర గారికి అభినందనలతో ...
మౌనం    కథ ని ఈ లింక్ లో చదవండి .

కామెంట్‌లు లేవు: