4, మార్చి 2013, సోమవారం

జీవితేచ్చ



                                    అమ్మాయి గారు ..అమ్మాయి గారు  రండమ్మా నెత్తి మీద తట్ట బరువుగా వుంది దించడానికి ఓ చెయ్యి వేయాలి అంటూ  పిలుస్తుంది ముసలి అవ్వ.

మంచి పుస్తకం చదువుకుంటూ  వుండగా  యింతలోనే  యీ ముసలమ్మ వచ్చి   చదువుకోనీయకుండా  చేసినందుకు  వచ్చిన చిరాకును అణుచుకుంటూ బయటకి వచ్చింది పద్మ.

అబ్బా మళ్ళీ వచ్చావా, వద్దు అంటే యిప్పుడు వూరుకోవు కదా 

మంచి ఆహారం తల్లీ! రోగం,రొస్టు రాకుండా వుండాలంటే  యివే తినాలి అంటూ నిండు  గంపలో నుండి నాలుగు మొక్క జొన్న పొత్తులు తీసి పద్మ  చేతికి ఇస్తుంది.

 నిజమే అనుకో,   అవి వుడకబెట్టుకోడానికి బద్ధకం యెక్కువ.మొన్న యిచ్చి వెళ్ళిన కండెలే అలాగే వున్నాయి అంటూ .. ముసలి అవ్వ యిచ్చిన మొక్కజొ న్నపొ త్తులు తీసుకుంది. వద్దంటే  వూరుకోదు. మీరు బోణీ చేస్తే మంచిదమ్మా  పది నిమిషాల్లో తట్ట దులుపుకుని వెళ్ళిపోతాను అంటూ కాళ్ళకి బంధం వేస్తుంది. ఆ మాట అన్నాక తీసుకోక చస్తానా  అనుకుని...  సర్లే యివ్వు అని ప్రక్కన లక్ష్మి గారిని  కూడా పిలువు అంది .

 ఆమె ప్రక్క వాటా ముందుకు వెళ్లి. రమేష్ గారు..ఓ రమేష్ గారు రా తల్లీ  లేత కంకులు తెచ్చాను అంటుంది. ఆయన చచ్చిపోయి నాలుగేళ్ళు  అవుతుంటే  రమేష్ గారు అని పిలుస్తావే, నీ పిలుపుకి పైకి వెళ్ళిన ఆయన తిరిగి వస్తాడా.. అంటూ బయటకి వస్తారు లక్ష్మి గారు.

కోపం వద్దమ్మా, ఆయన మఖాను భావుడు ఆ మంచితనం వల్లే  నిన్ను పిలిచి యిచ్చి వెళ్ళా లనిపిస్తూ వుంటుంది.   అని చెపుతుంది. ఎప్పుడో ఆయన చేసిన సహాయాన్ని తలచుకుంటూ.

 ముసలమ్మా, ఆయన వొక్కడే  మంచి మనిషి కాదులే యిక్కడ అందరూ మంచి వాళ్ళే లే అంటూ గంపలో చేయి పెట్టి లేత పొత్తులని జాగ్రత్తగా యేరుకుని  వొక్కో పొత్తుని పైరేకులు లాగి గింజలు నిండుగా  వున్నాయో లేవో చూసుకుంటారు.

 పద్మ  అలాంటి దృశ్యాన్ని వో అయిదేళ్ళకి  పైగా చూస్తుంటుంది  కాబట్టి  ఆశ్చర్యం లేదు. "ఇదిగో యిదులో సగం కూడా గింజలు లేవు వొట్టిబొండులే ! నాకు అంతా నష్టమే! యింకోకటి యివ్వు అంటూ.. గంపలో వున్న కండె లన్నిటిలో సగానికి పైగా తీసి చూసుకుంటూ వుంటారు.

అబ్బ.. ఈవిడో జిడ్డు మనిషి  ఆమెకి యేది నచ్చదు  అనేకన్నా మనసుకి సంతృప్తి వుండదని అనుకుంటార౦రందరూ. ఇళ్ళ దగ్గర తిరిగి అమ్ముకునే చిల్లర వ్యాపారుల పట్ల చులక భావమే కాదు కొనే  వస్తువు  విలువలో ప్రతి పైసాకి న్యాయం చేకూర్చుకోవాలనుకుంటుంది  ఇలాంటి వాళ్ళే మాల్స్ లోకి వెళ్లి అక్కడ రంగుల ప్యాకింగ్ వలలో చిక్కుకుని పర్స్ లు ఖాళీ చేసుకు వచ్చి తర్వాత కూర్చుని లెక్క చూసుకుని గుక్క పట్టి యేడుస్తుంటారు అనుకుంది పద్మ  మనసులో

ప్రతి రోజూ యిట్టా చేస్తే కష్టం తల్లీ.ఏదో రమేష్ గారు మంచాడు అని యిచ్చిపోతా వుంటాను అంటూ..చెపుతూనే నా వైపు తిరిగి పైన వాళ్ళందరిని కేకేయి తల్లీ.. నేను తొందరగా పోవాలి..పిచ్చిది వొకటే ఉంది..అసలే కొత్త బొమ్మ జనాలు యెక్కువ వుండారు అంటుంది

పద్మ  గొంతెత్తి..గట్టిగా రమణా, లక్ష్మీ ,వాణి గారు, అమృత గారు,పాపక్క అంటూ మా పై భాగాల లో  ఉన్న వారిని, ప్రక్క భవనంలో నివాసముంటున్న అందరిని పిలుస్తుంది .

ఇష్టమైన వాళ్ళందరూ పద్మని మొక్కజొన్న పొత్తులు తీసుకుని వుంచమని చెపుతారు. కావాలని చెప్పిన వాళ్ళందరికీ తీసుకుని డబ్బులు యిచ్చేసి పంపుతుంది . తర్వాత  వీలున్నప్పుడు ఒక్కొక్కరే వచ్చి వాళ్ళకి తీసి వుంచిన పొత్తులను పట్టుకు వెళతారు. ఆ ముసలి అవ్వ అన్నటే  ఆ  యింటి వద్దనే తన గంప అంతా ఖాళీ అయిపోతుంది.

ఈ ముసలి అవ్వ..చాలా గట్టిది మనం యిక్కడ తీసుకుంటే..పచ్చి పొత్తులు పది రూపాయలకి  నాలుగు యిస్తుంది.మనం ఆమె దగ్గరికి వెళితే నిప్పుల మీద కాల్చినవి ఒక్కోటి పది రూపాయలు అమ్ముతుంది అంది. . పద్మ .

నిజానికి ప్రతి వ్యాపారస్తుడు చేసే పనే అది. తన దగ్గరికి వచ్చిన కొనుగోలు దారుడి పై అధిక బరువు వేసి లాభం గుంజుకోవాలని చూస్తుంటాడు. కొనుగోలు దారుడు యెక్కడ తక్కువకి లభ్యమవుతుందో తెలిసి కూడా తనకి అవసరమైనప్పుడు తప్పనిసరిగా యెక్కువ పెట్టి కొనుక్కుకుని  తీరతాడు..

పద్మ వాళ్ళ  యింటి ప్రక్కనే రెండు సినిమా హాళ్ళు.ఎప్పుడు కొత్త సినిమాల ప్రదర్శనలో హాళ్ళు కిట కిట లాడతాయి. హాలుకి ముందు భాగంలో మెయిన్ రోడ్ కి అవతలి ప్రక్క బస్సు స్టాప్ ప్రక్కనే  వున్న చెట్టు క్రింద యీ ముసలి అవ్వ నిప్పుల కుంపటి పెట్టుకుని మొక్క జొన్న పొత్తులని కాల్చి అమ్ముకుంటూ ఉంటుంది. ఆమెకి సాయంగా ఆమె  కూతురు . ఆ కూతురు కాస్త అమాయకంగా ఉంటుంది.సినిమాకి వచ్చే జనం తక్కువ అయినప్పుడూ తన బేరం బాగా సాగనప్పుడూ వున్న సరుకు అంతటిని గబా గబా గంప కెత్తుకుని ఆ  కాలనీలో తిరిగి అమ్ముకుని వెళుతూ ఉంటుంది. ఆ ముసలి అవ్వకి దగ్గర దగ్గర డెబ్బయ్యి యేళ్ళు వుంటాయేమో, కాస్త పొట్టిగా, ఓ మాదిరి లావుగా వున్నా చక చకా నడుస్తూ అమ్ముకుంటూ వుంటుంది.  పద్మ కి ఆమెకి మించిన జీవన స్ఫూర్తి  ఎవరిలో కనబడలేదు.

కొన్నాళ్ళ క్రితం ఈ ముసలి అవ్వ చాలా కాలం రావడం మానేసింది.నాలుగైదు నెలలు తర్వాత   యింటి గేటు ముందు నిలబడి..పద్మని  పిలుస్తూ వుంది . పద్మ  బయటకి వచ్చి . చూస్తే కళ్ళకి నల్ల కళ్ళద్దాలు వేసుకుని కనబడింది. ఈ మధ్య అసలు కనబడటం లేదు యె౦దుకని అవ్వా..అని అడిగింది..

ఎక్కడ రాను బిడ్డా !.. కంటికి శుక్లాల ఆపరేషన్  చేయించుకున్నాను. పొయ్యి దగ్గరకి వెళ్ళవద్దు,బరువు నెత్తికి యెత్తవద్దు అన్నారు డాక్టర్ గారు. అందుకే రావడంలేదు.అంది.

మరి బేరం  చేయడం లేదు కదా ..  నువ్వు క్రూచునే చోట యింకొకరు బండి పెట్టేసారు.ఇక అక్కడ నీకు బేరం యే౦ సాగుతుంది యిల్లు యెట్టా గడుస్తుంది? మీ అమ్మాయి వుంది కదా.. ఆమ్మాయిని పెట్టుకుని కూర్చోక పోయావా? అడిగింది పద్మ .

"అయ్యో! ఆ పిల్ల మంచిదయితే నాకు యీ కష్టం యె౦దుకు? చెప్పిన మాట వినదు. హోటల్ కాడ పని చేసేయడానికి కుదిరింది. ఆళ్ళు  ఈళ్లు తిన్న ప్లేటులు,తాగిన గ్లాసులు కడుక్కునే ఖర్మ నీకెందుకే..నాలుగు కండెలు కాల్చుకుంటే రోజు వెళ్లి పోద్ది అంటే వూరుకుంటుందా..దానికి యేది తోస్తే అదే చేసిద్ది. యినదమ్మా..అందుకే నాకు యీ బాధ" అంది.

ఏమన్నా డబ్బులు కావాల్నా..? ఓ..వంద రూపాయలు పట్టుకుని  వెళ్ళు.లే!.తర్వాత బేరం చేసేటప్పుడు అప్పు తీర్చేద్దువు  అని చెప్పి  అంత కన్నా ఎక్కువ ఇచ్చినా తిరిగి యిస్తుందో..యివ్వందో.. అన్న అనుమానం కల్గి యింకా యెక్కువ తీసుకో అని అనలేక పోయింది..

ఓ..వంద రూపాయలు డబ్బులు, కాస్త పచ్చడి,ఓ రెండు అరటి పండ్లు యిచ్చి రేపు మీ అమ్మాయిని రమ్మను. పాత చీరలు అన్ని ప్రక్కన పెట్టి వుంచాను అంది.
 అట్టాగే తల్లీ..యిలా నాలుగు యిళ్ళకి వెళ్లి నా పరిస్తితి చెప్పి నాలుగు డబ్బులు తెచ్చుకుని ఓ..రెండు నెలలు గడుపుకోవాలి..అంది

ఇంకా యీ అమ్మాయి తప్ప నీకు  పిల్లలు యెవరు లేరా ? పద్మ ప్రశ్న .

 "ఇంకా యిద్దరు కూతుళ్ళు వున్నారు. పిల్లలు చిన్నప్పుడే మా ఆయన చచ్చి పోయాడు.తాళి తీసి పడేసి గంప నెత్తికి ఎత్తుకున్నాను. కూరగాయలు అమ్మాను, వుప్పు చింతపండు అమ్మాను. ఆఖరికి ముప్పయి ఏళ్ల  నుండి యిలా మొక్క జొన్న కండెలు అమ్ముకుంటూ వుండాను అంది.

ఏంటి? ముప్పై యేళ్ల  నుండా అంది పద్మ  ఆశ్చర్యంగా . మరి యేమనుకున్నావ్ బిడ్డా, భూమి పుట్టినప్పటి నుండి యిక్కడిక్కడే తిరుగుతున్నాను అంది.

అప్పుడు దాక వింటూ వూరుకున్న పద్మ  అత్త గారు..అవును..నా చిన్నప్పుడు నుండి చూస్తూనే వున్నా, ఇలా తిరిగి అమ్ముకుంటూ వుంటుంది అంది. పద్మ  అత్తా గారికే తెలుసు అంటే ఈ ముసలి అవ్వకి ఎనబై ఏళ్ల పైమాటే అనుకుని  "మొత్తానికి మహా గట్టిదానివే "అంది. ఆ మాటలకి సంతోషంగా నవ్వుకుంటూ .

"ఏం  చేయను తల్లి ..బతికే దారి యెతుక్కున్నాను.  ముగ్గురు ఆడపిల్లలు.  ఈడు వచ్చిన ఆడపిల్లలని యింట్లో  పెట్టుకుని   యే౦ కాపాడుకుంటాం. చదువులు చదివిచ్చే వోపిక లేక చిన్నతనం లోనే పెళ్ళిళ్ళు చేసేసాను.చిన్నతనంలో కాపరాలు చేసుకోవడం చేతకాక  యిద్దరూ బిడ్డలని యేసుకుని నా కాడికే వచ్చి పడ్డారు.ఇద్దరికీ చెరో మగ పిల్లాడు వున్నారు. వాళ్ళని నేనే పెంచుకుంటూ.. మళ్ళీ ఆ కూతుళ్ళకి పెళ్లి చేసాను.మనుమలిద్దరిని యె౦తో కష్టపడి పెంచాను. చదువులు అబ్బలేదు కాని యిద్దరూ టాపీ మేస్త్రీలు అయ్యారు.  వాళ్ళకి పెళ్లిళ్ళు  చేసాను బందరు కాలువ కట్ట మీదే గట్టి యిళ్ళే  కట్టుకున్నారు. వాళ్ళకి బిడ్డలు. ఇప్పుడు పెద్ద మనుమడి కూతురు..నూజివీడులో ఇంజినీరు చదువు చదువు తా వుంది. ఆ అమ్మి కి బస్ పీజు కట్టాలి.అసలు ఆళ్ళ నాయన అంత డబ్బులు కట్టి నేను చదివిన్చలేను అన్నాడు. చదువు మూడో నేత్రం రా.. వెర్రి ముండా  కొడుకా. చదువు సంధ్యలు లేకపోబట్టీ కదా మనమందరం యిట్టా వుండాం . మీ పిల్లకాయాలని అయినా చదివీయకపోతే యెట్టారా అని ఆడిని నాలుగు కూకలేసి నువ్వు చదివీయకపోతే పోనే నేను చదివిచ్చుకుంటాను బిడ్డని అని చెప్పాను. ఆ అమ్మికి పీజులు,పుస్తకాలు,యీడ నుండి ఆడకి తీసుకు వెళ్ళే బస్ పీజులు అన్నీ నేనే కడతాను అని చెప్పింది.

పద్మ ఆశ్చర్యంగా చూసింది

ఇంకా నువ్వెందుకు కష్టపడటం మేము అందరం నీకొక ముద్దా పెట్టలేమా, యింట్లో పడి  వుండు అంటారు మనవళ్ళు.  మరి యీ పిచ్చిదాన్ని యెవరు చూస్తారు.. తల్లీ! ఈ పిల్ల నా భాద్యత కాదా, కాలు చేయి బాగా వున్నన్నాళ్ళు కష్టపడాలి.కాసిని డబ్బులు పోగేసి.. ఏయే అనాధ శరణాలయం కి యిస్తేనో  కదా    నేను చచ్చినాక యీ పిల్ల దాన్ని చూస్తారు అని చెప్పుకొచ్చింది.

  ఏ చదువులు  నేర్పని  గొప్ప  జీవిత ఆర్ధిక సూత్రం, మనిషి తత్త్వం

వింటున్న పద్మకి  తల తిరిగిపోయింది.  కన్న బిడ్డలని పెంచడానికే నానా తంటాలు పడుతూ.. జీవితమంతా వీళ్ళ  కోసమే అరగదీసుకుంటున్నాను  అనుకునే తల్లి దండ్రులని చూసే కాలమిది.ఒక్క బిడ్డని పెంచడానికే నానా అవస్థలు పడుతున్న నీరస,భీరువ తరం యిది. ఒంటి చేత్తో తన పిల్లలని, మనుమలని, ముది మనుమరాళ్ళ గురించి కూడా శ్రమిస్తూ.. వున్న ఆ ముసలి అవ్వ అంటే పద్మకి  గౌరవం ఏర్పడింది.

 పద్మ తన గురించి తానూ ఆలోచించుకోవడం మొదలెట్టింది..

చేసే పని తక్కువ, అలసట ఎక్కువ

జస్ట్ నలబై యేళ్ళ కే  జీవితం అంటే యింత నిర్లిప్తత యె౦దుకు?  రోజు వొకేలా జీవితం.వండటం,పెట్టడం,యేదో తిన్నాను అనిపించేలా  తినడం .అంతే!

తన ఫ్రెండ్ వొకరు అంటూ వుంటారు. మనం చేసే ప్రతి పనిని యిష్టంగా చేయలేకపోయినా కనీసం తినేటప్పుడైనా  యిష్టంగా, ప్రియంగా తినడం  నేర్చుకోవాలి. అప్పుడే తిన్న ఆహారానికి విలువ వస్తుంది. మనిషికి ఆరోగ్యం వస్తుంది అని. ఎప్పుడూ యేదో ఒక అనారోగ్యం అనేకన్నా అనారోగ్యంగా వున్నానని భావించడమే తనలో వున్న నీరసానికి  కారణమేమో.

అమ్మయ్య, యెలాగోలా నా భాద్యత తీరింది. పిల్లలని పెంచాను. వాళ్ళు మంచి విద్యావంతులై వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడగల్గి వున్నారు. ఉన్నవి చేజార్చుకున్నందుకు వుక్రోషం మినహా  మళ్ళీ క్రొత్తగా సంపాదించుకోవాలన్న తాపత్రయం లేదు. "చస్తూ యేమన్నా కట్టుకు పోతామా, ఒకరిని మోసం చేయకుండా, ధర్మంగా సంపాదించుకుని అవి చాలక పొతే వున్నవి అమ్ముకుని యెలాగోలా బిడ్డలని పెంచుకున్నాం. ఈ కాలంలో  యె౦త కష్టపడ్డా  నిత్యావసరాలే తీరడం లేదు. ఇక ఆస్తులు కూడా బెట్టాలి అంటే అవినీతి మార్గంలో వెళ్ళాలి. అది నాకు అసలు చేతకాని పని అననుకుంటూ వుండేది  పద్మ .

అలాగే యేదో వున్నదానితో కాలక్షేపం చేస్తూ కృష్ణ రామా అనుకుంటూ కాలం గడిపేయడమే అనుకుందామా..  అంటే అందుకు మనసు ఒప్పుకోదు.  ఏదో చేయాలని ఆరాటం. కాలు బయటకి కదిపి యేమి చేయలేని అసక్తత. ఏ పని చేయాలన్నా అనుమతి కావాలి. మనసులో వున్న మాటలు చెపితే..  ఒకోసారి మృదువుగా యిప్పుడు అవన్నీ యె౦దుకు? నేను సంపాదిస్తున్నాను.పిల్లలు సంపాదిస్తున్నారు.ఇక యిప్పుడు నువ్వు చేయాలా హాయిగా రెస్ట్ తీసుకోక  అని ఒకోసారి, మళ్ళీ యింకోసారి అడిగితే   ఆ చేసావులే ! పెట్టావులే! అవన్నీ చేసేముందు యింట్లో వంట పనులు, యింటి పనులు చేసి అప్పుడు ఖాళీ వుంటే  బయట వుద్యోగం చేద్దువు గాని అనే చెళ్ళు మనే  మాటలు శూలాల్లా గుచ్చుకునేయి. 

 కేవలం యింటి పని వంట పని మాత్రమే చేస్తూ వుండాల్సిందేనా  అనుకుని నిరాశ చెందింది

తన కోసం తను బ్రతికిన క్షణాలు యేవి తనకి మిగిలేలా వుంచని కుటుంబం  పట్ల జీవితం పట్ల వైరాగ్యం కల్గింది పద్మకి.

ఎక్కడ పని అక్కడే ! వంట ఇంట్లో శుభ్రం చేయని గిన్నెలు, బారెడు  పొద్దెక్కినా శుభ్రం చేయని ఇల్లు, కుర్చీలో లుంగలు చుట్టి విసిరివేయబడ్డ వుతికిన బట్టలు తనలో పెరిగిపోతున్న బద్ధకానికి  గుర్తులు మాత్రమే  కాదు. జీవించడం పట్ల వున్న అనాసక్త కి కారణం కూడానేమో!

ఎంతసేపని పుస్తకాలు చదువుతూ,టీ .వీ చూస్తూ, కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకు బలవంతంగా యీడుస్తూ గడపడం? తనకి శరీరానికి  అనారోగ్యం కాదు.అది మనసుకే. మనసుకి వున్న అనారోగ్యం వదిలితే తప్ప తనలో వుత్సాహం రాదు అనుకుంది.

 విధి వంచించి భర్తని దూరం చేసినా జీవిత కాలమంతా వొంటి చేత్తో కష్టపడుతూ.. ఎనబై యేళ్ళ ముదుసలి కూడా అంత  ఆత్మ విశ్వాసంగా  బ్రతకడం గురించి చెప్పినప్పుడు చదువుకుని తెలివితేటలూ కల్గిన తను ఖాళీగా కూర్చోవడమంత  సిగ్గు చేటు యింకోటి లేదనిపించింది. అందరూ డబ్బు కోసం,అవసరాల కోసం పని చేయాలన్న రూల్ యేమి లేదు.. అభిరుచి మేరకు పనులు చేయాలి. చేసే పని మనసుకు సంతృప్తి కల్గించాలి. అదే మనిషికి,మనసుకు ఆరోగ్యం కూడా అనుకుని వేసుకున్న ముసుగు లో నుండి బయటకి వచ్చి శ్రమించడానికి సిద్దపడింది 

నెమ్మదిగా తనలో నిదురించిన శక్తిని మేలుకొలిపింది.కుట్టు మిషన్ ని దుమ్ము దులిపింది. వరండాలోకి మిషన్ జేర్చింది. కుట్టు పని చేయడం మొదలెట్టింది. నెమ్మదిగా ఆమె చుట్టూ నలుగురు చేరడం    మొదలెట్టారు కుట్టుపనికి వున్న డిమాండ్ దృష్ట్య ఆ యింటిగుమ్మం లోకి  రాక పోకలు యెక్కువైనాయి. తనలా వుబుసు పోక కూర్చున్న ఇంకో యిద్దరినీ చేర్చుకుంది. అక్కడొక టైలరింగ్  మరియు ఎంబ్రాయిడరీ షాప్ వెలిసింది. తనలో ఉన్న సృజనాత్మకత కలగలిపి అక్కడ రంగుల హరివిల్లు ప్రత్యక్షమైంది.

 తన స్వయంసంపాదన మొదలయ్యాక తనలో  జీవకళ  నిండుకుంది. ఒకరిపై ఆధార పడకుండా   బ్రతికే బ్రతుకులో స్వేచ్చ వుంది. స్వాతంత్ర్యం వుంది . అన్నిటికన్నా ముఖ్యంగా జీవితేచ్చ వుంది. ఆ జీవితేచ్చ లేకుండా కాకిలా కలకాలం బ్రతికి యే౦  ప్రయోజనం అని కూడా అనుకుంది   బ్రతికినన్ని నాళ్ళు కాలేకపోయినా కొన్నాళ్ళైనా జీవితాన్ని  జీవించడం ముఖ్యం అనుకుంది.పద్మ.

ఇంటిల్లపాది తమకి తగని పని, పరువు తక్కువ పని చేస్తున్నావని మానేయమని వొత్తిడి పెట్టారు. అయినా వెనుకడుగు వేయలేదు.

ఈ పద్మ కి యేమొచ్చింది? పిల్లలు బాగా సంపాదించడం మొదలెట్టాక  ఈమెకి ఆశ మొదలయినట్టు ఉంది. వెళ్ళిన వాళ్ళతో అయిదు నిమిషాలు కూడా మాట్లాడలేనంత తీరిక లేకుండా సంపాదన యావలో పడింది అనే మాటలు వినబడుతున్నా విననట్లు నటించింది. 

తన కుటుంబం కోసం యిన్నాళ్ళు శ్రమించింది. ఇకమీదట యితరులకు  కొంచెమైనా సాయం చేయడం కోసం కష్టపడాలి అని ఆమె తీసుకున్న దృఢ సంకల్పం ముందు యింట్లో  వారి వ్యతిరేకత, పదుగురి మాటలు గాలిలో కలసిపోయాయి. 

శ్రమించడంలో యెంత  అర్ధం వుంది. శ్రమ సంపదని సృష్టిస్తుంది.ఆ సంపదని తన కోసం,తనవారికోసం   మాత్రమే కాకుండా  యితరుల కోసం కూడా వుపయోగించడం  అనే ఆలోచనలో వుత్సాహం వస్తుంది.

పరోపకార్థం ఇదం శరీరం అంటారు. మనిషిగా తోటి మనుషులకి చిన్న మెత్తు  సాయం అయినా చేయగలగడం సంతృప్తిని యిస్తుంది. ఆత్మ సంతృప్తి అనేది మత్తు మందు లాంటిది దానికోసం కొన్ని కొన్నిటిని పట్టించుకోవాల్సిన పనిలేదని అనుకుంది.

 పద్మ తనలో నూతన ఉత్సాహం మేల్కొలిపి జీవితేచ్చని  కలిగించిన   ముసలి అవ్వకి  యెప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే వుంటుంది. .
                     __________________________0_____________________

3 కామెంట్‌లు:

Dantuluri Kishore Varma చెప్పారు...

శ్రమించి సంపాదించడం వలన వచ్చే ఆత్మవిశ్వాసం గురించి అద్భుతంగా చెప్పారు. కథ కొంచం పెద్దది అయ్యింది కానీ, పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి ఆ నిడివి ఉండాలేమో!

Unknown చెప్పారు...

a very good post vanaja garu

గోదారి సుధీర చెప్పారు...

Nice story Vanaja garu...book gas yeppudu choodagalam?