30, ఏప్రిల్ 2012, సోమవారం

అంటరానితనం - ఒంటరితనం

మనుషుల్లో అంతరాలని పెంచే కుల భావన ..నానాటికి మితిమీరిపోతుందని  అనిపిస్తుంది.
ఇవాళ సమాజంలో కులం పేరుతొ.. తిట్టుకోవడం తరచూ కనబడుతుంది. అన్ని కులాలను తిట్టుకోవడం అంత పట్టింపు కాదేమోకాని ..కొన్ని కులాల పేర్లు ఉదహరించి కించపరిచే రీతిని నిరోదించేందుకు..కొన్ని చట్టాలు కూడా ఏర్పడ్డాయి

Prevention of attrocities act 1989

ఆ చట్టం రావడం వలన ఎస్ టి / ఎస్.సి వారి పై, దూషణ అవమాన కర వ్యాఖ్యలు తగ్గుతాయని ఆశించడం జరిగి ఉంటుంది. .కొన్ని చట్టాలు ఏర్పాటు చేసినప్పుడు..కొన్ని కేసులలో పారదర్శకత లోపించి.. అన్యాయంగా శిక్ష నెదుర్కుంటూ ఉన్నారు. ఒకవిధంగా కొన్ని కులాల వారితో మాట్లాడక పోవడమే మంచిదనిపించేలా ఉంది. atrocity కేసులు పరిష్కరించేందుకు  ప్రత్యేక కోర్ట్లు కూడా ఏర్పాటు కాబడ్డాయి అంటే.. ఎంతగా కులపరంగా అవమానం జరుగుతుందో కదా అననిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి ఆరోపణలతో నమోదు కాబడ్డ కేసులు అన్నీ  నిజాలు కావన్నదానికి నిదర్శనంగా ..
ఈ మధ్యనే .. అంటే ఓ..మూడు నెలల క్రితం జరిగిన యదార్ధ సంఘటన..ఒకటి.
విజయ్ అనే ఒక యువకుడు అగ్ర కులానికి  చెందినవాడు. అతను వారి ఇంటికి సమీపంలో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అంతలో.. బుల్ హారన్ మ్రోగించుకుంటూ..ఓ..మోటార్ వెహికల్ పై (బుల్లెట్)ముగ్గురు కలసి వెళుతూ వారి ఇంటి సమీపంలోకి వెళ్ళినప్పుడు పదే పదే హారన్ మ్రోగిస్తూ మితిమీరిన వేగంతో వెళ్ళారు. విజయ్ కి ఆ ముగ్గురు పరిచయమే!వారు ఓ..వాడకి చెందిన పిల్లలు.(తప్పని సరి అయి ఉదహరించాల్సి వస్తుంది) వారు పని గట్టుకుని చేసే విపరీతమైన శబ్దం వల్ల..ఇంట్లో అనారోగ్యం గా ఉండి పడుకున్న విజయ్ తాత గారికి చాలా విసుగు కల్గుతుంది అనే ఉద్దేశ్యం తో.. "మీరు ఇటువైపు రాకండి. ఏమిటి ఆ మోత? అని కోపంగా అన్నాడు.
వెంటనే.. ఆ ముగ్గురు ..వారు వెళుతున్న బైక్ ని సడన్గా ఆపి వెనక్కి తిరిగి వచ్చి విజయ్ తో వాదనకి దిగారు. ఏం..రోడ్డు ఏమన్నా మీ బాబుదా!? నీకేనా బుల్లెట్ లు ఉండేది.మా దగ్గర డబ్బుంది.మేము కొనుక్కుని తిరుగుతాము. ఇక్కడ తిరగవద్దని చెప్పడానికి నీకేమైనా అధికారం ఉందా అని .. అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే.. దానికి వాదనగా అన్నట్టు  ఇతను మీరసలు ఈ ఊర్లోకి రావద్దు. మీ హరిజనవాడకి వేరే దారి ఉంది..అటువైపు వెళ్ళండి ..అని అన్నాడు విజయ్. ఇక అక్కడ మాట మాట పెరిగి..అమ్మలు,అక్కలని, ఆలిని  ఇష్టం వచ్చినంతసేపు ఆరేసి..ఇరువైపులవారు కొట్టుకునే అంత స్థాయికి వెళ్ళిందీ  విషయం.

నలుగురొవచ్చి విడదీసాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
బైక్ పై తిరిగిన ముగ్గురు వ్యక్తులు  అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. "విజయ్ అనే వ్యక్తి..మమ్మల్ని కులం పేరున దూషించాడు.ఆ రోడ్డు పైన సంచరించ వద్దని ఆర్డర్ లు వేసాడు. వాళ్ళ కులం వారి సపోర్ట్ తో మమ్మల్ని అవమానించి మా ఇంటివాళ్ళని కూడా అవమానంగా మాట్లాడారు" అని రిపోర్ట్ ఇచ్చారు.
అంతే.. అర్ధరాత్రి సమయంలో.. నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ తో పోలీసులు విజయ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అది గమనించినతను..వేరే దారిన బయటపడి..తప్పించుకున్నాడు. అతనెళ్ళి ..మూడు రోజులు ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉంటే..కేస్ లేకుండా చేయడానికి ..రాజీ మార్గాలు మొదలై.. కేస్ విత్ డ్రా..చేసుకోవడానికి దాదాపు మూడు లక్షలు రూపాయలు డిమాండ్ చేసారని ..తెలిసిన వారి ద్వారా బోగట్టా. ఆ రాజీ ప్రక్రియలు జరిగింది..సాక్షాత్ ఊరి మాజీ ప్రెసిడెంట్ సమక్షంలో .
బేరసారాలు కుదరక ..విజయ్ రహస్యంగా వెళ్లి పోలీసు స్టేషన్లో కాకుండా కోర్టులో లొంగిపోయాడు.
ఇక్కడ జరిగినదానికి చట్టం తన పని తానూ చేయడానికి మధ్య ఆర్ధిక లావాదేవీలా అవసరం ఏం వచ్చింది? నిజంగా కుల దూషణ వల్ల అవమానం, మానసిక హింస అనుభవిస్తే.. వారు శిక్ష పడాలని కోరుకోవాలి. అలా కాకుండా డబ్బు డిమాండ్ చేసి అడిగినంత ఇవ్వనందువల్ల కేస్ నడచి తమని తిట్టిన వ్యక్తికి శిక్ష పడాలనుకోవడంలో  ఏ మాత్రమైనా  పారదర్శకత  కనబడుతుందా!?
యెంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి ..ఇష్టం వచ్చినట్లు తిట్టవచ్చా? అప్పుడు అవమానం అనిపించదా!?
అసలు కులం పేర తిట్టారో లేదో.. అన్న నిరూపణ కూడా లేకుండా ఒక కంప్లైంట్ ఆధారంగా.. వ్యక్తులని శిక్షించాలని అనుకోవడం కూడా సబబేనా!?
ఈ చట్టాన్ని  అడ్డు పెట్టుకుని అగ్ర కులస్తులని పని గట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఉన్నట్లు తోస్తుంది.
అగ్ర కులాల వారు అహంకారంగా ప్రవర్తిస్తూ , తిడుతూ వివక్ష చూపించే కాలం మారింది. ఇప్పుడు అందరూ సమానంగానే ఉంటున్నారు. ఉండాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు.   కొన్ని చోట్ల  కొంత వివక్ష ఉండవచ్చు కూడా ! కాదనడం లేదు
కానీ చట్టం అండ ఉంది కదా ... అని అన్యాయంగా కేసులని మోపి.. వేధించడం కూడా బాధాకరమే కదా!
వ్యక్తిగతముగా కోప,ద్వేషాలు ఉంటే.. ఆ వ్యక్తి వరకే పరిమితం చేసుకుని ప్రదర్శించుకోవాలి. వారి వారి అభిప్రాయాలకి పరిమితం చేసుకోవాలి. కుటుంబంలోని స్త్రీలనందరిని  తిట్టే సంస్కారం,కులం పేర తిట్టే సంస్కారం ..మరి వారికి ఉండవచ్చా!?
అవమానం అన్నాక, హింస అన్నాక అందరికి ఉంటుంది కదా! కులం పేరు ఎత్తకుండా.. అభిప్రాయ బేధాలు వస్తే..వివరణతో చర్చించుకోవడం జరగాలి కాని..కులం పేరు ఎందుకు ? అన్యాయంగా కేసులు  పెట్టుకోవడం ఎందుకు ..అనిపించింది నాకు.
విజయ్ .. పదిహేను రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి వచ్చి విచారణ కోసం ఎన్నోసార్లు  కోర్ట్లు చుట్టూ తిరుగుతూ ఉంటే.. అగ్రకులలవారికి భయం పట్టుకుంది.
కొంత మందిని చూస్తే..గాలి సోక నంత దూరంగా మెలగాలిసి వస్తుందేమో! అంటున్నారు కూడా!
ఇది ఒక అంటరానితనమే కదా! కాకపొతే.. ఇక్కడ ఇప్పుడు అగ్రవర్ణ వాడలకి..అనాలేమో!
(కుల వివక్ష,మత వివక్ష ,లింగ వివక్ష లేని సమసమాజం అన్నది సుదూర తీరం గానే తోస్తుంది.. అంటరానితనం - ఒంటరితనం అనాదిగా ఈ జాతికి అదే మూలధనం ..!? అన్న బాధతో..ఈ పోస్ట్.)

29, ఏప్రిల్ 2012, ఆదివారం

మహిళ ల "పవర్" వృధాయే..నా!?


మహిళ లకి చట్ట సభలలో..౩౩ % రిజర్వేషన్ లభించాలని బిల్లు ప్రవేశపెట్టి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఆ బిల్లుకి ఆమోదం ఎప్పుడు కల్గుతుందో చెప్పలేం కానీ ..స్థానిక సంస్థలలో ప్రజా ప్రతినిధులుగా మహిళలకి లభించిన అవకాశం పుణ్యమా అని ..చాలా మంది స్త్రీలు.. గృహ సామ్రాజ్యాన్ని దాటి గ్రామ సామ్రాజ్యం లోకి అడుగిడి వారి పరిధిని కాస్త పెంచుకునే అవకాశం కల్గినందుకు సంతోషించాలి.

అలా రిజర్వేషన్ పుణ్యమా అని లభించిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం మహిళలకి కట్టి మీద సాము లాటిది. ఎందుకంటె..రిజర్వేషన్ ప్రాతి పాదిక పైన లభించే స్థానాల్లో మహిళలు పోటీ చేయడం జరిగినప్పుడు..అనేక ఇబ్బందులు ఉన్నాయి . ముఖ్యంగా మహిళలకి తగిన చదువు లేకపోవడం ,రెండు రాజకీయ అవగాహన లేకపోవడం,అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు గడప దాటాక పోవడం వల్ల ప్రపంచ జ్ఞానం లేక.. వారికి లభించిన అవకాశం మేర..వారు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేయడం దగ్గర నుండి,ఎన్నికల ప్రచారం,గెలుపు ఓటమిల అవకాశాలు గురించి తెలుసుకునే వరకు ప్రతి విషయం అంతవరకు గ్రామంలో మాజీ ప్రతినిధుల చేతుల్లోకి,ముఖ్యమైన నాయకుల చేలలోకి వెళ్ళిపోతుంది.

అసలు సిసలైన ప్రజా ప్రతినిధులు అయిన వీరే డమ్మీ ప్రతినిధులుగా మిగిలిపోతారు. మహిళా ప్రజా ప్రతినిధుల పవర్ ని తమ చేతుల్లోకి తీసుకుని.. మెన్ పవర్ లేదా మనీ పవర్ అధికారం చెలాయిస్తారు. వీరు.. మాత్రం ఓ..ఆటోగ్రాఫ్ ఇచ్చిన రీతిలో లేదా అంతకన్నాహీనంగా చెప్పాలంటే నిశాని గానో మిగిలిపోతారు.

ఓ..అయిదేళ్ళ కాల పరిమితిలో వీరికి తృణమో,ఫలమో ముట్టజెప్పి.. రాజకీయ నాయకుల హవా యధాతధంగా కొనసాగుతూ ఉంటుంది. ఇది గ్రామ స్వరాజ్యం. మహిళ లకి లభించిన పవర్.

మా మండలంలో మండల ప్రజా పరిషత్ స్థాయిలో ఎమ్.పి.టి.సి లు ,సర్పంచ్లు గాను మా మండలంలో ఎక్కువ మంది మహిళలకి అవకాశం లభించాయి.

మా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పదవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. విపరీతమైన స్టేజ్ ఫియర్. ప్రత్యర్ధి వర్గం లో ఉన్న జిల్లా స్థాయి నాయకురాలు ని ఓడించే ప్రక్రియలో..ఈమెకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అవకాశం లభించింది. ఆమె భర్త.. ఓ..ప్రముఖ రాజకీయ నాయకుడి అనునూయుడు.

ఇక ఏడు గ్రామాల లోను వీరి హవాకి తిరుగులేదు. ఆమె మాత్రం రోజు ఒక సరి క్రొత్త చీర కట్టుకుని..మీటింగ్ లకి హాజరై..రెండు ముక్కలు గడ గడ వణుకుతూ..మాట్లాడి వచ్చేసేది.
ఆమెకి ప్రతి రోజు మీటింగ్ ఏమో కానీ..నాకు మాత్రం మా మండలం గురించిన ప్రతి చిన్న విషయంలోనూ..పూర్తి అవగాహన వచ్చేసింది.
ప్రతి రోజు టంచనుగా వనజ గారు..మీటింగ్ ఉంది అని చెప్పి . దీని గురించి క్లియర్గా చెప్పరా.. మీటింగ్ లో ఏం మాట్లాడాలో అన్నది స్క్రిప్ట్ వ్రాసి ఇవ్వరా అని వచ్చేది. ఆమె భర్తకి పెద్దగా ఏమి తెలియదు. కానీ వెనుక ఉన్న రాజకీయ వర్గం మాత్రం..రాష్ట్రంలో నే బెజవాడ అంటే టక్కున గుర్తుకు వచ్చే నాయకుడు. నేను అయితే..రోజూ.. నాకు ఈ శిక్ష ఏమిటి భగవంతుడా ! అనుకుని విరక్తి చెందే దాన్ని. పోనీ..నావల్ల కాదండీ అని చేపుదామంటే నోరు వచ్చేది కాదు. ఆమె దిగులు ముఖం చూసి జాలితో సరే అనేదాన్ని. అలా అయిదు ఏళ్ళు..ఆమెకి వెనుక ఉండి ఆమెని అలా ముందుకు నెట్టే దానిని.

ఒక రోజు మీ ప్రజా ప్రతినిధులు అని చెబుతున్నాను. ప్రజా ప్రతినిధులు అంటే ఏమిటి అని అడిగారు ఆవిడ.నేను స్టన్ అయిపోయాను.మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గా ఆమె ఉన్నప్పుడు ఇసుక సీనరీల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆమె మాత్రం నామ్ కే వాస్తే! ఆ పవర్ కి విలువ వచ్చింది ఎక్కడ ..ఆమెకి ఇచ్చింది ఎక్కడ అనిపించింది నాకు.

ఇక మా వూరి సర్పంచ్..మహిళా మణి . నాకు బాగానే పరిచయం. అక్కా అంటూ గౌరవంగా మాట్లాడుతుంది ఆప్యాయంగా మాట్లాడుకుంటాము. ఆమెకి పెద్దగా గ్రామ పరిపాలన గురించి వారికి ఉన్న అధికారుల గురించి పెద్దగా అవగాహనలేదు.నేను మాత్రం అప్పుడప్పుడు దోమల సమస్య గురించి,మురుగు నీటి సమస్య గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా..తన కి ఉన్న పేస్ వాల్యూ గురించి.. తన పవర్ గురించి చెప్పి భాదపడి పోతూ ఉండేది. గత ఏడాది పంచాయితీ పాలక వర్గ పాలన ముగిసి.. అసలు పవర్ చెలాయించే..వారి కబంధ హస్తాల నుండి బయట పడి..ఇప్పుడు రైతు బజార్ అనబడే కూరగాయల షాప్ నిర్వహించుకుంటుంది.

మొన్ననే కూరగాయలు కొనుక్కోడానికి వెళ్లి నప్పుడు.. గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గడం వల్ల మంచి నీళ్ళ సరపరాలో తలెత్తే సమస్య గురించి మాట్లాడితే.. వాటి గురించి ఎవరికి పడుతుంది. రెండు పార్టీల నాయకులకి మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి అని నిజం చెప్పుకొచ్చారు ఆవిడ. పచ్చదనం పరిశుబ్రత , ఇంకుడు గుంటలు,వాటర్ రీసోర్సెస్, వాల్టా చట్టం,విద్యా కమిటీలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటే.. చాలా మంది కూరలు కొనుక్కోడానికి వచ్చిన పురుషులు..మా సంభాషణ వింటున్నారు.

మహిళలకి గ్రామ సమస్యలపై అవగాహన ఉంటుంది,నిజమైన అధికారం వాళ్ళు ఉపయోగించి గ్రామ అభివృద్దికి పాటు పడే అవకాశాలని ధనవంతులు,బలవంతులు లాక్కుంటుంటే.. ఇక మహిళ రిజర్వేషన్ వల్ల ఒరిగే లాభం ఏమిటో.. అందరు ఆలోచించాలి అని అనేసి వచ్చేసాను. అక్కా..అనవసరంగా మీరు ఇప్పుడు అందరి దృష్టిలో పడతారు..వదిలేయండి అని మా మాజీ గ్రామ సర్పంచ్ వారించ బోయింది. నాకు దైర్యం ఎక్కువే లెండి. ఎవరు ఏమి అనుకున్నా లెక్క చేయను.

ఇక మా మండలం లోనే ఒక గ్రామ సర్పంచ్ మహిళా మణి.
ఆ గ్రామం ఆంద్ర ప్రదేశ్ లోనే..ఇంటి పన్నుల ద్వారా లభించే ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న గ్రామం. ఆమె కట్నం ఎక్కువ తేలేదు అని కోడలిని నానా రకాలుగా హింస కి గురి చేసారని వార్తలలోకి ఎక్కారు. నిజం పై వాడికి ఎరుక. ఆదర్శాలు అందరు చెబుతారు. అంబేద్కర్ జయంతి రోజు ఆదర్శంగా మీటింగ్ చెప్పి ..వేదిక దిగి వచ్చాక .. అవహేళన చేసే వారిని చూసాను.

ఇవండీ... నేను చూసిన మహిళా ప్రజా ప్రతినిధుల అవకాశాలు,అధికారాలు,దుర్వినియోగాలు, మర బొమ్మతనాలు..అలంకార ప్రాయమైన పదవులు. ఎవరిని ఉద్దరించడానికి అనుకుంటాను.

మాకు బాగా దగ్గర అయిన వాళ్ళు ఈ సారి నువ్వు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదూ అని మునగ చెట్టు ఎక్కిస్తారు. ఆ రొచ్చు నాకుఎందుకు అని అనలేను కానీ.. అవకాశం దొరికితే రిజర్వేషన్ కేటగిరీలో..అవకాశం లభిస్తే..పోటీ చేయడానికి నేను రెడీ. కానీ..ఎన్నికల సమయంలో కాన్వాస్ చేసుకుంటూ నా వెంట నలుగురు వస్తున్నా వారికి కాఫీ,టీలు,కూల్ డ్రింక్స్ కూడా ఇప్పించ లేనే !? నిధులు సమకూర్చడం ఎలాగబ్బా! అన్నాను అనుకోండి.
నువ్వు ఊ.. అంటే.. ప్రధాన పార్టీలు అవే చూసుకుంటాయి. నువ్వు..అప్పుడప్పుడు..ఆటో గ్రాఫ్ లు ఇవ్వడమే..అని నాకు వరుసకు తమ్ముడు అయ్యే ఒక యువనేత నాకు అభయం ఇచ్చేసాడు.
ఏమిటో నండీ.. అదంతా సాద్యమేనంటారా!? ఎందుకంటె..ఇదంతా వింటున్న మా అత్తగారు ..ఈ రాజకీయాలు మా ఇంటా-వంటా లేవు అని అల్టిమేట్ చేసేసారు. అవకాశాలు దొరకడం లేదని నానా యాగి చేస్తుంటే.. అవకాశం ఉన్నప్పుడు.. ప్రయత్నం చేస్తే తప్పు ఏమిటి? మా తమ్ముడు యువనేత ఆర్గ్యూ..

నిజంగా ఇప్పుడు రాజకీయాలు ఉన్న నీచ స్థితిలో..మహిళలు నెగ్గుకు రాగలరా? నిబద్దత,సేవాధర్మం ఉన్నవాళ్ళు కూడా వెనుకంజ వేయవలసిన భ్రష్టు రాజకీయాలను ప్రక్షాళనం చేసుకుని గ్రామ,మండల రాజకీయాలను ప్రభావితం చేసుకునే శక్తి కాని,యుక్తి కానీ మహిళలకి ఉన్నాయంటారా!? గ్రామ అభివృద్ధి చేసుకోగల స్థాయి అయినా మహిళలకి ఉందంటారా!? వీది వీధి కి ఉన్నమద్యం షాప్ లని మూసి వేయించ గల్గితే.. మొట్ట మొదటి విజయం సాధించి నట్లే నని..నా వంద శాతం నమ్మకం. అలాగే.. సర్పంచ్ పదవి కోసం ..ఓ..అర కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా.. ఓ.. పది లక్షలు అయినా ఖర్చు పెట్టగలిగి .. గెలుపు లభిస్తే..అదే పండుగ అనుకుంటాను.

వీధి చివర మద్యం షాప్ తీసేయమని చేసే ధర్నా కార్య క్రమంలోను కూడా పాల్గొనలేని హై క్లాస్స్ కుటుంబ స్త్రీని. మరియు పది లక్షలు ఖర్చు పెడితేనే గెలవగలను అని నమ్మకం లేని దాన్ని . నాకు ఎందుకండి ఈ.. ప్రజా ప్రతినిధుల ఎన్నికలు గురించి మాట్లాడటం అని ఉదాసీనంగా కూడా ఉండ లేను కాబట్టే ..ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. .

ఈ వ్యవస్థ మార్చడం ఎవరి తరం కాదా!? మహిళా రాజకీయాలని ప్రభావితం చేసే మహిళా మణి పూసలు ఎక్కడ? ఎవరు మహిళ లకి రోల్ మోడల్స్!? ఎందుకు ఈ బిల్లులు ,పోరాటాలు? ఈ పవర్ లు అనీ వృధా యేనా!?

ఒక పోస్ట్ కి కావాల్సిన సబ్జక్ట్ దొరికింది అన్న ఆనందం,మరి కొన్ని హిట్లు.. కొద్దిగా కామెంట్ లు కోసం మాత్రం కాదు.
చదువుతున్న దేశ విదేశాల లోని కొంత మంది కైనా ఆలోచన కలిగించాలని ఈ చిరు ప్రయత్నం.

అవకాశం లభిస్తే.. నేను గ్రామ స్థాయి లోనే ప్రజా ప్రతినిధిగా పోటీ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఈ మిత్రులందరూ.. నా గెలుపుకి ఒట్టి నోటి మాట తోనే ప్రచారం చేయాలండి. మర్చి పోవద్దు. మీ తోటి బ్లాగర్ కి ఆ మాత్రం సాయం చేయరా చెప్పండి!? :)) ఇంత సేపు నా పైత్యం విన్నందుకు ఐ మీన్ చదివినందుకు ధన్యవాదములు.

(లో లోపల ఏదో చేయాలి అన్న ఆకాంక్ష తో.. వెలువరించిన ఈ మాటలు)

28, ఏప్రిల్ 2012, శనివారం

దానికి ఓ..లెక్క ఉంది "లెక్కల కథ"

అసలు మనుషులంటే లెక్క లేకుండా పోతుంది.. అంటారు కాస్త పెద్దరికం కొని తెచ్చుకుని.
ఈ ఇంట్లో నా మాటకి లెక్క లేదు..అంటుంది..ఓ..ఇల్లాలు ముక్కు చీదుకుంటూ,కొంగుతో కళ్ళు వత్తు కుంటూ ..
రోడ్డు  ఎక్కామా !? అది వన్ వే అయితే ఏమిటీ .. కాకపొతే ఏమిటీ ...ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు లెక్క ఉందా వాళ్లకి అంటాం .. సవ్యంగా నడవని వారిని, ఇతరుల మాటలని లక్ష్య పెట్టని వారిని.

అసలు లెక్క లేకుండా ఉండటం ఉండదేమో! మనిషన్నాక సంతానంలో ఎన్నో వాడో.. లెక్క కావాలి. కాస్త లెక్కలలోనే అటు ఇటుగా ఉండవచ్చునేమో కానీ లెక్క మాత్రం ఉంటుంది కదా!
మనుషులకి మీరున్నారని అనడానికి ..జనాభా లెక్కింపు, పశు సంపద లెక్కింపు,వాహనాలు లెక్కింపు,పులులు లెక్కింపు.. అన్నీ లెక్కలోనివి. ఓహ్ ఎన్ని లెక్కలు. !!

అలాటి లెక్కలు వేసుకునే వాళ్ళ గురించి ఓ..మాట.

లెక్కలేదని దిగులు పడకుండా మనని సజీవంగా ఉన్నామని గుర్తించ దానికి ఏమో.. సంవత్సరానికి నాలుగైది సార్లు జనాభా లెక్కలు వేయడానికి వస్తారు.
ఈ రోజు.. ఉదయాన్నే జనాభా లెక్కలు వాళ్ళమీ అని ఓ..ఇద్దరు స్త్రీ మూర్తులు ..వచ్చారు.అప్పుడు నేను పూజలో ఉన్నాను. మా వర్కర్ అమ్మాయితో..ఒక్క అయిదు నిమిషాలలో వస్తాను. ఈ లోపు.. ప్రక్కన వివరాలు రాసుకుని రండమ్మా ..అని చెప్పమని చెప్పాను.
ఈ అమ్మాయి వెళ్లి మేడం పూజ చేసుకుంటున్నారు. అంతలోకి ప్రక్కన వ్రాసుకోమని చెప్పారు అని చెప్పింది.
అందులో ఒకామె  మేము ఇంటి దగ్గ్గర పూజలు చేసుకునే  వచ్చాము అన్నీ చేసుకుని వచ్చాము తొందరగా రమ్మని చెప్పమ్మా.. అంది.
అంతటితో..ఆగకుండా.. మేము ఏదో భిక్ష గాళ్ళని చూసినట్లు చూస్తారు.అప్పుడు రండి..ఇప్పుడు రండి అని చెపుతారు..అంది నొచ్చుకున్నట్లు.
నాకు కోపం వచ్చేసింది. నేను చెప్పినది ఏమిటి? ఆమె మాట్లాడుతుంది ఏమిటీ..అనుకుని.. మా వివరాలు వ్రాయవలసిన అవసరం లేదు మీరు వెళ్ళిపొండి..అని చెప్పాను. కోపం ఆంతా నడకలో చూపిస్తూ. ప్రక్కకి వెళ్ళారు.
నాకు మరు క్షణంలోనే..అయ్యో..అనిపించింది. వాళ్ళు అన్నది నిజమే కదా..! వాళ్ళ ఇంటి పనులు అన్నీ చూసుకునే కదా వారి విధులు నిర్వర్తించడానికి బయలు దేరి వచ్చి ఉంటారు. అసలే ఎండల కాలం.. వాళ్ళకి కొంచెం సహకరిస్తే సరిపోయేది.అనవసరంగా మనసు నొప్పించి ఉంటాననే  ..ఆ ఆలోచనలతోనే పూజ మీద మనసు లగ్నం కాక ..ముగించుకుని వచ్చేసాను. ఆ జనభా లెక్కలు వ్రాసుకునే వారు అక్కడ ఇంకొకరి వివరాలు వ్రాసుకుని ప్రక్కన వారి వివరాలు కోసం తొందర పెడుతున్నారు..ఆ ఇంటి ఆవిడ బాత్ రూం లో ఉన్నారు. కొంచెం ఆగమని చెప్పింది. అక్కడా  ఆమె అలాగే మాట్లాడింది. నేను చూస్తూ ఊరుకున్నాను. మరి కొంత సేపటికి మరి ఇద్దరు వచ్చారు. జనాబా లెక్కలు అన్నారు. సరే కూర్చుని రాసుకోండి అని చెప్పాను. మా ఇంట్లో వారి వివరాలు వ్రాసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ అడిగారు. అవి కూడా అవసరమా అని అడిగాను. అవసరమే అని చెప్పారు. వీళ్ళకి పోన్ నంబర్  అవసరం ఏముంటుంది?   ఎందుకబ్బా.. అని మనసులో అనుకుని ఓహో.. పోన్ ఉందా లేదా అన్నదానిని బట్టి ఆర్ధిక పరిస్థితి ని లెక్కవేస్తారు గాబోల్సు అనుకున్నాను. తర్వాత కులం గురించి అడిగారు. నాకు కొంచెం తిక్క గా తోచి..ఈ సారి జాతీయత,మతం.కులం విషయాలు మూడు కలిపి ఒకే సారి చెప్పేసాను. మీకు పంచదార కార్డ్ ఉందా అని అడిగారు. నాకు నవ్వు వచ్చింది. తల ఊపాను..ఉంది అన్నట్లు.
వైట్ కార్డ్ అని అడిగారు ప్రశ్నార్ధకంగా.. చూస్తూనే!
నవ్వాపుకుంటూ పింక్ కార్డ్ ఉంది. ఇదే గ్రామ పంచాయితీ లో పద్నాలుగు ఏళ్ళ నుండి పింక్ కార్డ్ ఉంది అని చెప్పాను.
ఎందుకంటే .. మూడు అంతస్తుల భవనానికి యజమాని అయి ఉండి, పది ఎకరాలు పొలం ఉన్న ప్రక్కింటి వారు వైట్ కార్డ్ హోల్డర్. . ఆరోగ్య శ్రీ పధకం క్రింద నెల రోజులు పాటు ఓ..ప్రముఖ వైద్య శాలలో వైద్య సేవలు పొంది..అతి పేదవారిగా చెలామణి అయిపోతూ .. ఇప్పుడు కూడా ఒక రూపాయికి కిలో బియ్యం చొప్పున తెచ్చుకుంటున్న వారిని చూస్తే.. నాకు ప్రభుత్వ గుడ్డితనం మీద విపరీతమైన ద్వేషం కల్గుతుంది. అనర్హులై  ఉండి వేరొక అర్హులైన ప్రజలకి చెందవలసిన పధకాల ఫలితాలను అందుకుని ప్రభుత్వాన్ని మోసగించే వారిని చూస్తే వెగటు కల్గుతుంది.

అందుకు కారణం ..చిత్త శుద్ధి లేని గ్రామ పరిపాలనా అధికార గణం..అయిదు వందల రూపాయలు లంచం తీసుకుని వైట్ కార్డ్ పొందేందుకు అర్హులుగా వ్రాసి పడేస్తారు. ఇందిరా గృహ పధకం,వితంతు పెన్షన్లు..ఇలా అన్ని పథకాలలోను.. ప్రజా ప్రతినిధుల హవాతో..వారి వారి అనునూయులకి ఫలితాలు దక్కే విధంగా యధాశక్తి ప్రయత్నం చేస్తారు.
ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ..

జనాభా లెక్కలు వ్రాసుకునే వారు..మేడ మీద భాగాల వివారాల కోసం నన్నడిగారు.
పైకి వెళ్లి వ్రాసుకోమని చెప్పాను. మేము వెళ్ళ లేము కాస్త అందరి పేర్లు మీరు చెప్పేయండి..అని అడిగారు. అలా చెప్పటం భావ్యం కాదు.ఎవరి వివరాలు వాళ్ళే చెప్పాలి కదా .. అయినా అందరి వివరాలు నాకు తెలియదన్నాను. కొత్తగా వచ్చారా మేడం అని అడిగిడి ఒకావిడ..
లేదు.. చాలా కాలం గా ఇక్కడే ఉంటున్నాము. అయినా సంవత్సరానికి ఇలా జనాభా లెక్కలు అంటూ నాలుగైదు ఇదు సార్లు వస్తారు.. ఇలా లెక్కలు వేసుకుని ఏమి చేస్తారు..అని అడిగాను. మా డ్యూటీ ఇంతవరకే నండీ అని చెప్పి నేను అడిగినదానికి వివరాలు చెప్పకుండానే..

ప్రక్క ఇంటికి వెళ్ళారు.ఆమె టీచర్ గా వర్క్ చేస్తున్నారు. జనాభా లెక్కలు అనగానే .. ఆమె మీ ఐడెంటి కార్డ్ చూపండి అని అడిగారు. వాళ్ళు మేము ఐడెంటి కార్డ్ మర్చిపోయి వచ్చామని చెప్పారు. ఆ టీచర్ నిర్మొహమాటంగా కార్డ్ చూపిస్తేనే మా వివరాలు చెపుతాను. రేపు కార్డ్ తీసుకుని రండి అని మొహం పైనే తలుపు వేసేసారు.
వంట ఇంటి ప్రక్క గోడ వద్దకి వచ్చి.. "ఈ లెక్కలన్నీ రాజకీయ పార్టీ వాళ్ళు వేయిస్తున్న లెక్కలండీ!.
కులం,మతం..ఈ ప్రాతిపాదిక పైన వారి వోట్ బ్యాంకు బలాన్నిలెక్కించుకొవడానికి ..ఇలా లెక్కలు వేయిస్తారు.
వీరికి రోజుకి వంద రూపాయల లెక్కన ఇచ్చి వివరాలు సేకరించడానికి ఇలాటి వాళ్ళని పంపుతారు. మూడు నెలల క్రితమే కదా ఆధార్ కార్డ్ కోసం జనాభా లెక్కలు రెండు సార్లు లెక్కించారు. ఇక ఇప్పుడు జనాభా లెక్కలు ఉండవు. ఉంటే మాకు కూడా డ్యూటీలు వేసేవారు " అని చెప్పారు ఆవిడ.
ఆశ్చర్య పోవడం నా వంతు అయింది. ఇవండీ లెక్కలు సంగతి.
దానికి ఓ..లెక్క ఉంది..నాకు కొంచెం తిక్క ఉంది.. అని అనుకోవాలేమో కదా!

ప్రజలు గొర్రెలు మందలు ..అన్నమాట నిజం అనుకోవాలేమో! గొర్రెల మంద లెక్క కూడా అవసరమే కదా!

(పశువుల లెక్క,పులుల లెక్క,గొర్రెల మంద లెక్క ..అని ఉదాహరించినందుకు.. క్షమాపణలు చెప్పుకుంటూ.. నాబోటివాళ్ళ కన్నా  ఆ జంతువులే కాస్త ఎక్కువ చైతన్యంతో ఉన్నాయేమో అనుకుంటూ..)
దానికి ఓ..లెక్క ఉంది."లెక్కల కథ" ఇది.

26, ఏప్రిల్ 2012, గురువారం

ప్రియమైన శత్రువు "వి"



నా ప్రియమైన ...
...............!?

నీకు.. అంటానని అనుకున్నావా?

ఆ లిప్త కాలమైనా నిన్ను ఇబ్బంది పెట్టాననే ఆలోచన అయినా  నేను నీకు కల్గించాలనే నా అంతరంగ భావనని  నువ్వు కనిపెట్ట గలవా !?

అక్షరాల వెంట పరుగులు తీస్తున్న నీ మనః వేగాన్నికాస్తయినా నిరోదించ గలిగాను కదా!

నా నీడ గా నువ్వు ఉన్నావని భ్రమపడి.. నీ ఏడంతస్తుల విజయ భవనం నుండి జారి పడ్డావని మరచి పోయావు.

కలలోను ,మెలుకువలోనూ..ఇద్దరి ని తలపులలో నింపుకునే ఉంటారని అంటూ ఉంటారని నీకును  తెలుసు. 


వారు ఎవరో తెలుసు కదా! ప్రియమైన వారు లేదా అప్రియమైన శత్రువు.

ఇవి రెండు కాని నిన్ను ప్రియమైన శత్రువు అనాలేమో కదా! కనులు మూసుకుని తెరిస్తే నీ రూపమే కనబడుతూ ఉంటుంది. దులిపి దూరం చేద్దామనుకున్నా ..నా ఆవరణం లోనే తిష్ట వేసుకుని కూర్చుని ఉంటావు.

గజనీ మహ్మద్ లా నా ఆలోచనల పై దండ యాత్ర చేసి అలసి పోయి ఉంటావు. మళ్ళీ ఇంకో జన్మకి నన్ను వీడకుండా ఘోరీలా పుట్టి సాదించాలని అనుకుని ఉన్నావు. నా మనసు పైన, ఆలోచనల పై దాడి చేసి.. ఏక కాలం లో గెలవలేనని గ్రహించాక..


మనసుని ఆలోచనని విడదీసి మనసుని గెలిచి ఆలోచనని వదిలేసావు .

ఆలోచన లేని మనసుని గెలుచుకుని అభద్రతా భావంలో నా శత్రువుగా మారి .. నా నీడలా వెంటాడుతూ,వేటాడుతూ..
నన్ను కలవరపెట్టాలనుకున్నావు.

భారతం చెప్పిన "ఏక ఏవ చరే ద్దర్మం" ని మరచి పోయావా? అనుకరించి,సహాయం కోరి నడక సాగించ గలననుకున్నావా?

విభిన్న సమయాలలో..కొన్ని సందర్భాలలో.. అయినా నేను నిన్ను మెచ్చుకుంటాను .

శత్రువు అయినా సమాన స్థాయిలో ఉండాలంటారు కదా.. ! అందుకనేమో ఇలా..  అయినా   మెచ్చుకుంటూ  ఉంటాను. వైరి భావం తో ఉన్న మనమధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. 

.
శత్రువుని మెచ్చుకున్న చోట ఎన్నడైనా ..మరల చెలిమి కుదిరేనా!? పగిలిన మట్టి పాత్ర తిరిగి అతుకుట యెంత అసాధ్యమో.. శత్రువుతో మిత్రుత్వం అంత అసాధ్యం ..అని మరువకు.

ముసుగేసుకుని కపట వేష భూషణ ములతోను .. తెనేలూరించు పలుకుల తోను చేరువ కావలెనని ప్రయత్నిస్తావు.


"మరణంతాని వైరాణి కదా మన శత్రుత్వం"  అది నేను మరచిపోతే..అంతటి దుస్సాహసం వేరొకటి కలదా!

నా బలమేమిటో,బలహీనత ఏమిటో.. నిన్ను నిశితంగా పరీక్షించాక కదా నాకు తెలియునది. 

అందుకే నా నీడగా నువ్వుంటున్నా ..మౌనంగా..ఉపేక్షిస్తున్నాను 

కలసి వచ్చే కాలం వచ్చునో..రానో.. వచ్చునని ఆశయును లేదు..రాదనీ ..నిరాశయను లేదు.

నా ప్రియాతి ప్రియమైన శత్రువా! దేహాన్ని అంటిపెట్టుకున మురికిలా.. రక్తంలో కలసి ఉన్న నీరులా.. తలపులతో..ముడిపడిన వలపులా .. నన్ను నీ కబంద హస్తాలలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. పరిరక్షిస్తున్నావు కదూ..!?

అందుకే నువ్వంటే ..కోపం ఉంది ద్వేషం ఉంది.. ప్రేమా  ఉంది
ఏది ఎక్కువో,ఏది తక్కువో.. తెలియదు.

తెలియనందుకేమో..అయోమయంలో నేను..నా వెంట నీవు..

నువ్వు నా ప్రియమైన శత్రువు వి. శత్రువుగా మిగిలిపోయే ప్రియ బానిస వి.

ఇదంతా నీకు చెప్పాక.. నీ కోపాన్ని  కళ్ళారా చూసాక ..నేను  లోలోపల నవ్వుకుంటూ.. ఇలా అనుకుంటాను.

నా ప్రియమైన ..శత్రువా!...


నీ నయనస్పర్శ తో నన్ను పరామర్శించి వెళ్ళిన తదుపరి ..

నా తనువు నయాగరా జలపాతమే అయింది..స్పర్సో త్సాహం తో..
వెల కట్టలేని వేల టన్నుల కొద్ది నవీన జీవ శక్తిని నింపుతూ.. అని.

25, ఏప్రిల్ 2012, బుధవారం

ఊరు ఎందుకు వెళ్ళాలి!?





వేసవి కాలం వస్తుందంటేనే.. ప్రతి ఇంటికి .. ఓ..కొత్త ఆనందం పుట్టుకొస్తుంది. పదినెలల పుస్తకాల మోతతో .. అక్షర సాగరంలో పరీక్షా నావ నెక్కి ..మునిగామో,తేలామో.. కాస్త ప్రక్కన పెట్టి సేదదీరాలని ఓ..ఒడ్డున పడతారు.. పిల్లలకే పరీక్షలు కాదు. పెద్దవాళ్ళకి అంతకన్నా భయంకరమైన పరీక్ష కదా!

ఇక కొంత మంది పిల్లలకైతే.. చదువుల  నుండి విముక్తే లేదు. సమ్మర్ కోచింగ్ లు.కంప్యూటర్  క్లాసులు.. విధివిధానంగా ఉండనే ఉంటున్నాయి. ఈ యాంత్రిక మైన నగర జీవనం నుండి పిల్లలని కాస్త పల్లె వైపు అడుగులు వేయించి .. వారికి పల్లె లని పరిచయం చేస్తే..చాలా బాగుంటుంది కదా అనుకుంటే అక్కడ ఎవరున్నారు.. ? సందేహం..పుట్టుకొస్తుంది. ఎందుకంటే..మన అనుకున్న అందరూ కూడా పట్నవాసులు గా మారి ఓ..తరం గడచిపోయింది.  మా ఇంటి పిల్లలు ముద్దుమురిపెం గా..  ఎక్కడికి వెళ్ళే వీలు లేని పరిస్థితి. 
అమ్మమ్మ ఉండి   ఉంటె.. వెళ్ళేవాళ్ళం కదా ..అంటారు పైకే! మేమేమో.లోలోపల అనుకుని మూగబోతాం.  ఈ యాంత్రిక జీవనం నుండి కాస్తంత బయట పడి..స్వేచ్చగా,హాయిగా ఉండే చోటుకి వెళ్లాలని మనసు ఉబలాటపడుతుంది. అలా ఉండగల్గే చోటు.. మా వూరు ఒక్కటే! అయితే .. . 

నాకు మా ఊరు వెళ్ళాలంటే భయం . అక్కడంతా.. మొండి గోడలు,నిర్మానుష్య వీధులు..పలకరించే వారు లేక.. టీవీల మోత లో ..ప్రక్కన నడచి వెళ్ళేవారిని  కూడా పట్టించుకోని మైమరపుల మధ్య.. గ్రామీణులు..పట్టణ పోకడల్ని అరువుపుచ్చుకుని..ప్లాస్టిక్ నవ్వులని వెదజల్లడం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది .

 ప్రతి ఇంటి ముందు పశువుల కొట్టం లేకపోయినా.. ఏ  హీరో..హోండా నో..  ఠీవి గా నిలబడి ఉంటుంది. ఉన్న ఒక బస్సు  ఆటో ల తాకిడికి చిత్తు అయిపోయి కొన ఊపిరితో ఉన్నట్టు  ఉండి ఉండక  మొక్కుబడిగా తిరుగుతుంటుంది. పల్లె ముఖ చిత్రం దాదాపుగా ఇదే! ఇంటింటికి సాఫ్ట్ వేర్  ఇంజినీరో.. విదేశి నివాసో..ఉంటున్నారు. ఆత్మీయత .కల్లాకపటం ఎరగని మనుషులని అనుకునే వాళ్ళలోను కాస్తంత బాగానే"గీర" కనబడుతుంటుంది.

ఇప్పుడు మా పిల్లలని తీసుకుని వెళ్లి అక్కడ ఏం పరిచయం చేయగలం.. ? మా జ్ఞాపకాలలో ఇంకా సజీవంగా మిగిలి ఉన్న ఆనందాన్ని వాళ్లకి పరిచయం చేయగలమా!?

వేసవి వచ్చిందంటే.. ఎన్ని అదనపు సోయగాలు..  గుండు మల్లెలు, సన్న జాజుల పరిమళాలు.. ఆరు బయట మంగళగిరి నూలుతో చేసిన నులక అల్లిన మంచాలు పై పడుకుని చల్లగా అప్పుడప్పు తాకే చిరు గాలి తాకిడిలో.. చిరు చెమటల చిత్తడిలో..  వడియాల పులుసులు, కొత్త ఊరగాయ పచ్చళ్ళ రుచి, సాయంత్రం వేళ ఏ పచ్చి పులుసో, పప్పు చారు తోనో వడియాలు నంజుకుని తింటుంటే వచ్చే ఆనందం.. ఏ గార్డెన్ రెస్టారెంట్ లో కూర్చుని తింటుంటే రాదు కదా!  

పచ్చని తోటల్లో ఎగబడి కోసే అనేక రకాల కాయలు,పండ్లు..తాటి ముంజెలు,ఈతకాయలు,సీమతుమ్మ కాయలు, చింత కాయలు,మామిడి కాయలు..పనస కాయలు,ముంత మామిడి కాయలు..,విరగబడి కాసిన మునగ చెట్లు.. ఆలస్యంగా వచ్చే పైరు వేరు సెనగ కాయలు.. ఓహ్.. ఎన్నని చెప్పం? 

అలాగే తిన డానికి పనికి రాని కాయలు.కూడా ఎన్నెన్నో!.ఎర్రటి,నల్లటి కలబోతతో..అందంగా కనబడే గురివింద గింజలు, గచ్చకాయలు..  బూరుగ చెట్లు.. ఎన్ని .. వర్ణాలు... ఎక్కడ వాటి ఆచూకి వెతికి ఇవ్వగలం. ? 

చెరువులు ఎండి పోయి.. బావులు అడుగంటి..  మంచి నీటి బావి మాయం అయి.. మినరల్ వాటర్ ప్లాంట్ లు వెలిసి.. "శివుని శిరం నుండి.. వాటర్ బాటిల్ లో కి ఒదిగిన  గంగమ్మ పరవళ్ళు ని చూసి విచారము  ముంచుకొస్తుంది.

మా వూర్లో ఏ ఇల్లు చూసినా వాస్తు పిచ్చితో.. నామ రూపాలు లేకుండా మారిపోయి..మండువా లోగిళ్ళు,  పెంకుటిల్లు ,తాటాకు ఇల్లులు  స్తానే.. కాంక్రీట్ ఇల్లులు కనబడుతుంటాయి.  కాలికి మట్టి అంటని సిమెంట్  రోడ్లు సాదించిన ప్రగతికి ఆనవాళ్ళు గా దర్శనమిస్తాయి.

పాల సేకరణ  కేంద్రం స్థానం లో.. విజయ డైరీ పార్లర్ కనబడుతుంది. లైబ్రరీ లో  పుస్తకాలు స్థానంలో  రెండు మూడు టీవిలలో..క్రికెట్,సినిమాలో..సాక్షాత్కరిస్తూ ఉంటాయి.. ఉన్న జనాభాలో సగాని కి పైగా ఏబైలు పై బడిన వారు. .యువతంతా.. చదువుల కోసం, మధ్య వయస్కులంతా వ్యాపారం పేరిట విజయవాడ, ఉద్యోగస్తులు వివిధ నగరాలలో.. సెటిల్ అయిపోయి.. పల్లె నిరక్షరాస్యుల ఉనికి తో.. కాలం వెల్లబుచ్చుతుంది. అక్కడికి  మా పిల్లలని తీసుకుని వెళ్లి ఏ ఘనమైన ఆనవాళ్ళని చూపించగలం!?

జనానికే కాదు..ఊరుకి వృద్దాప్యం వచ్చినట్లు ఉంటుంది.. ఏ వృద్దులని కదిలించినా.. ఊరు పొమ్మంటుంది..కాడు రమ్మంటుంది..అని అంటారు. 

పుట్టిన ఊరు అనే మమకారం తప్ప మన అనే అనుకునే సంబందీకులు లేక.. ఒక పూట అయినా ఆత్మీయంగా వడ్డించే వారు లేక.. ముఖమున ఇంత కుంకుమ బొట్టు పెట్టి..రవిక ముక్క పెట్టె ప్రేమ లేకపోయాక.. మా వూరు ఎందుకు వెళ్ళాలి అనిపించడం తప్పు కాదు కదా!

అక్కడ అన్నీ ఉన్నా.. అమ్మ లేని ఆ ఇంట ..నాన్న కూడా  ఉన్నారు.. ఆయనే చేయి కాల్చుకుంటూ..పుట్టిన గడ్డపై..మమకారం చావక.

కన్న తల్లి-జన్మ భూమి ని ఎవరు ఇస్తారు?  ఎన్ని సంపదలు ఉన్నా.. నా అన్న వాళ్ళు కరువైతే ఇలా అనిపించక తప్పదు. సిరివెన్నెల గారు..అన్నట్లు.. "పదుగురితో పంచుకొని ఆనందమైనా పచ్చికైన పెంచలేని ఎడారి కదా!"..అని .
ఓ..నాలుగు ఏళ్ళ క్రితం మా అబ్బాయిని తీసుకుని నేను వెళ్ళినప్పుడు.. నాలో కల్గిన బాధకి గుర్తుగా.. ఈ కవిత   వ్రాసుకున్నాను. 

ఇది చూడండీ..

24, ఏప్రిల్ 2012, మంగళవారం

అపురూప స్నేహం విలువ

మనలో చాలా మంది ఒక పని ని సహజంగా చేయడానికి సాధ్య పడని అప్పుడు, కొన్ని నియమాలకు విరుద్దంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు.. ఆ పని ని సమర్ధవంతంగా పూర్తి చేసుకోవడానికి దొడ్డి దారులు వెతుకాల్సి వస్తుంది.
మన పని పూర్తి కావాలంటే..డబ్బు,అధికారం,పలుకుబడి..ఇలా ఎవేవైనా ఉపయోగపడతాయని ఆలోచించడం ..తర్వాత ఆ ప్రయత్నాలు చేయడం మామూలే!

ఎందుకో.. చాలా విషయాలు మూడో శక్తి లేకుండా పని పూర్తీ కాని దరిద్రపు వ్యవస్థ. నేను నిజాయితీగా ఉంటాను. కష్టపడి పనిచేస్తాను. నా దగ్గర నైపుణ్యం ఉంది.అని గొంతెత్తి అరచినా.. అవెందుకు పనికి రావు.. జస్ట్ ఒక పై రవీ పోన్ కాల్ చాలు క్షణంలో పని పూర్తి అయి పోతుంది. అలా ఒక పని జరుగుతుందని ఆశించి ..వెళ్ళిన నాకు .. ఒక జీవిత కాలానికి చూడని ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని చూసిన అనుభవం ఒకటి ఈ పోస్ట్ లో చెప్పదలచాను.

ఒక సంవత్సరం క్రితం..అనుకుంటాను.. మా చెల్లి వాళ్ళ అమ్మాయి "అప్పు" చదువుకు సంబందించి .. ఒక కార్పోరేట్ కాలేజ్ లో.. సి.ఓ. బ్యాచ్ లో.. మొదటి సెక్షన్ లో ప్రవేశం అప్పుడు..తనకి ఫీజ్ రాయితీ కొంత లభించింది. ఎందుకంటె తను 8 వ తరగతి నుండి IIT JEE Concept Oriented గా తీర్చిదిద్దబడింది. పైగా 10 తరగతిలో మంచి మార్కులతో..పాస్ అయింది. సహజం గా అలాంటి పిల్లలపై కార్పోరేట్ కాలేజ్ ల వల వేసే ఉంటుంది. ఎందుకంటె.. rank ల పంట పండిస్తారని.

సంవత్సరానికి లక్ష పాతికవేలు ఫీజు చెల్లించాల్సిన ఉన్న CO batch లో మా "అప్పు" ని 60 % ఫీజు రాయితీ తో అడ్మిషన్ ఇచ్చారు. సడన్గా మా చెల్లెలి కుటుంబానికి ఆర్ధిక ఇబ్బంది కలగడం వల్ల..మిగతా ఫీజు ..ఇతరత్రా ఖర్చులు..కలిపి ఇంకొక లక్షరూపాయలు భారం అయింది. అలాటప్పుడు..మిగిలిన ఫీజ్ కి కూడా రాయితీ ఇచ్చే అవకాశం లభించే మార్గాల కొరకు అన్వేషణ మొదలబెట్టింది.మా చెల్లెలు.

అదే సమయంలో.. ఒక అవకాశం కలసి వచ్చింది. శ్రీ చైత్యన ఫౌండర్ & చైర్మన్ BS రావు (సత్యనారాయణ గారు).. మా house owner లక్ష్మి గారి అన్నయ్య ప్రాణ స్నేహితులు . ఆ విషయం నాకు తెలుసు. లక్ష్మి గారి అన్నయ్య సాంబ శివరావు గారు..బి ఎస్ రావు గారు బాల్య స్నేహితులు. అలాగే గుంటూరు లో వైద్య కళాశాలలోను సహాధ్యాయులు.
మిత్రులు ఇరువురు దారులు వేరు వేరు అయినా ఒకే ప్రాణం. యెంత అపురూప స్నేహం అంటే.. యెంత బిజీ షెడ్యుల్ లో ఉన్నా సరే.. శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వహణలో తలమునకలై ఉన్నా సరే తన స్నేహితుడి తలిదండ్రులని కూడా నెలకి ఒకసారి అయినా వచ్చి స్వయంగా చూసి ఒక గంట కూర్చుని..మంచి చెడు కనుక్కుని వారికి అవసరమైనవి అన్నీ ఓ..కొడుకులా సమకూర్చి వెళ్లాలని అనుకుంటారు. అక్కడెక్కడో. అమెరికా దేశంలో ఉన్న .తన మిత్రుడు చేయలేని భాద్యతలు కొన్ని అయినా తీర్చగల్గానన్నఆనందం బిఎస్ రావు గారిది. ప్రతి విషయానికి మా సత్యనారాయణ అన్నయ్య అని ..చెపుతుంటారు కాబట్టి.. మాకు వారిరువురి మిత్రుత్వం గురించి తెలుసు.
"అక్కా.. సాంబశివరావు ..గారి ద్వారా పూర్తీ ఫీజు రాయితీ కోసం ట్రై చేద్దామా!? అని అడిగింది మా చెల్లెలు. నాకు ఎందుకో సాంబశివరావు గారిని ఆ విషయం గురించి రికమండ్ చేయమని అడగడం ఇష్టం లేక పోయింది.

ఎందుకంటే..సాంబశివరావు అన్నయ్య (నేను వారిని అన్నయ్య అని పిలుస్తుంటాను.నిజానికి నేను రక్త సంబందం కాని వారిని అన్నయ్య అని పిలవడం పెద్దగా ఇష్టం ఉండదు కూడా! ) అలాటి విషయాలకి వ్యతిరేకం. ఆయన పెళ్లి కూడా వరకట్నం అనే ప్రసక్తి లేకుండా జరిగిపోయింది..అట. కష్టపడి చదవడం,నిజాయితీగా ఉండటం.అందరి కష్టసుఖాల్ని గమనించడం..పేదవారికి.విద్యార్ధులకి వేలకొలది డాలర్లు సాయం చేయడం.. చేస్తుంటారు సాంబశివరావు అన్నయ్య.

ఆయన గురించి తెలిసి ఉన్న దానిని అవడం వల్ల నాకు మా "అప్పు " ఫీజు రాయితీ గురించి అన్నయ్యతో రికమండ్ చేయించడం గురించి నేను అడగాలని అనుకోలేదు.అదే విషయం ని మా చెల్లికి నేను చెప్పాను. మనమేమి హెల్ప్ చేయమని అడగడం లేదు కదా! పూర్తి ఫీజు రాయితీ లభించే అర్హత మన అమ్మాయికి ఉంది. సాంబశివరావు అన్నయ్య ఒక మాట చెబితే.. రెండు సంవత్సరాలకి కలిపి దాదాపు నాలుగు లక్షల రూపాయలు సేవ్ అవుతాం. ఒక్క మాటే కదా.. నీకిష్టం లేకపోతే నువ్వు అడగవద్దు..నేను అడుగుతాను అని నిష్టూరంగా అంది మా చెల్లి. ఇక తప్పదు అనుకుని.. సాంబశివరావు అన్నయ్య ని కలవడానికి మా చెల్లిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను.

మా చెల్లెలిని అన్నయ్యకి పరిచయం చేసాను. అన్నయ్య ..పిల్లలు యెంత మంది? ఏం చదువు కుంటూ న్నారమ్మా! ..అని అడిగారు. ఆయన ఆత్మీయమైన ప్రశ్నకి మా చేల్లెల్లికి దుఖం ముంచుకు వచ్చింది. మా "అప్పు " IIT లో సీట్ సంపాదించు కోవాలి అన్న లక్ష్యం తోనే సంవత్సరానికి లక్ష రూపాయల పీజులు పోసి..కాన్సెప్ట్ స్కూల్లో చదివిస్తూ.. అప్పుడు ఆర్ధిక పరిస్థితి చతికిల పడటం ..వల్ల తను కాస్త బాగా బాధలోని,ఒత్తిడిలోనూ ఉంది. కదిలిస్తే.. కన్నీళ్లు కార్చేస్తూ బేలగా మారిపోయింది. అప్పుడు నేనే జోక్యం చేసుకుని మా '' అప్పు" చదువు,పీజు రాయితీ విషయం గురించి చెప్పి.. "సత్యనారాయణ గార్కి" కొంచెం పాప గురించి చెప్పగలరా ?అన్నయ్యా..! అని అడిగాను

సాంబశివరావు అన్నయ్య మౌనంగా రెండు నిమిషాలు అలా ఉండిపోయారు. తర్వాత ఇలా చెప్పారు.
అమ్మా.. సత్యనారాయణ డి నాది నలబై ఏళ్ళ స్నేహం . ఏ రోజు కూడా.. నేను ఒకమాట కూడా ఇలా చేయాలి అని నేను చెప్పి ఉండలేదు. నాకు ఏం కావాలో తనకి తెలుసు. నేను ఎయిర్ పోర్ట్ లో ప్లైట్ దిగే సమయానికి కారు తీసుకువచ్చి రెడీగా ఉండటం,,నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు ఏం అవసరం అవుతాయో చూడటం..నా తల్లిదండ్రులని కూడా తన తల్లిదండ్రులుగా చూసుకోవడం చేస్తుంటాడు.నేను చెప్పకుండానే..అన్నీ చేసే తనకి ఈ పని చేయి..రా అని చెప్పడం ..నేను ఎప్పుడు అడగని విషయం. తను నాప్రాణ స్నేహితుడే! ఎన్నో విద్యా సంస్థలు సంపాదించి ఎంతో మంది డాక్టర్లని,ఇంజినీర్లు చదవడానికి శిక్షణ ఇచ్చే నంబర్ వన్ సంస్థ చైర్మన్ కావచ్చు. అతని స్వవిషయాలలో నేను ఎప్పుడు జోక్యం చేసుకోను. అతను నా విషయం లో ఆసక్తి కనపరచడు. మా వృత్తులు,మా పనులు.. వీటన్నిటి అతీతమైన "స్నేహం " తప్ప ఇలా చిన్న పాటి రికమండేషన్ కూడా మా మధ్య ఉండవు.

ఒక సారి మా చిన్న మామ గారు కావూరి గారి మనుమడికి కూడా చైతన్య లో సీట్ కోసం రికమండ్ చేయమన్నారు. అతను చదువులో చాలా పూర్. ఆలాటి విద్యార్ది కోసం..నా భార్య వైపు బంధుత్వం కోసం అయినా కూడా నేను సత్యనారాయణ ని అడగలేకపోయాను. భార్య వైపు బంధువుల కోసం కొన్ని చేయక తప్పని పరిస్థితుల్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు. నేను అలా రికమండ్ కాల్ చేయడం ఇబ్బంది అని కాదు కాని.. మా ఇద్దరి స్నేహం విలువ.. అలా రికమండ్ చేసే స్థాయి గల స్నేహం కాదమ్మా.. అన్నారు.

నేను వెంటనే ఏదో మాట్లాడబోయాను. అన్నయ్య నా మాట వినకుండానే ..గబా గబా ..మేడమీదకి వెళ్లి అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చారు. అప్పుడు..అన్నయ్యకి నేను మనస్పూర్తిగా సారీ చెప్పి.. మీ మనస్తత్వానికి విరుద్దంగా..మిమ్మల్ని ఒక పని చేసి పెట్టమని అడిగాను. నన్ను క్షమించాలి ..అన్నయ్యా.. మీ లాటి వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని నేను అర్ధం చేసుకోలేకపోయాని అని చెప్పాను. వెంటనే మా చెల్లి కూడా అన్నయ్యా ..అక్క మీ గురించి చెప్పింది. తను అడగను అనికూడా అంది. నేనే బలవంత పెట్టాను. మీ పంధా ని,మీ స్నేహాన్ని మేము అర్ధం చేసుకున్నాను. మీరు అలా రికమండ్ చేయలేదని బాద కూడా లేదు అన్నయ్యా.. అలా అడిగి మిమ్మల్ని బాద పెడితే క్షమించండి ..అంది.

అమ్మా.. నేను అమ్మాయి గురించి చెప్పి రికమండ్ చేయ లేక పోయాను అన్నబాధ ఉంది .అలా అని నేను నా పద్దతికి విరుద్దంగా అలా ఆ స్నేహితుడిని అడగలేను. కానీ నా వంతు గా అమ్మాయిని ..నా మేనకోడలే అనుకుని ..మిగతా ఫీజు నేను కడతాను..అని .. జేబు లోనుండి డబ్బు తీసి చెల్లి చేతిలో పెట్టేసారు. నేను చెల్లి కూడా నిర్ఘాంత పోయాం. మేము వెళ్ళింది ఒకందుకు,అక్కడ చూసింది..ఒక ఉన్నత వ్యక్తిత్వంని.. సాయం లభించదు అన్న దిగులు లేదు..కానీ మళ్ళీ అక్కడే..ఓ..సాయం అందించిన ఆపన్న హస్తం.

వారు మళ్ళీ ఇలా అన్నారు. అమ్మా.. కష్టాలు నాకు తెలుసు. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్ట పడి చదువుకున్న వాడినే.మిమ్మల్ని అవమానించాలని నేను ఈ సాయం చేయడం లేదు. ఒక తెలివైన విద్యార్ది పీజు లు కట్టలేక చదువు ఆగ కూడదు.అని చెప్పారు. అది మా సొంత అన్నయ్య కూడా చేయని సాయం అన్నమాట. .

నేను శ్రీ చైతన్య CO బ్యాచ్ ఫీజులు సంవత్సరానికి ఒక్కో విద్యార్ధికి రెండు లక్షలు అని చెబితే..ఆశ్చర్య పోయారు. మీ మిత్రులు వందల కోట్లకి పడగలెత్తారు ఇప్పుడు అని చెప్పి నేను నవ్వాను. ఇక్కడ అంత ఫీజుల..అమ్మా..అన్నారు. నేను ఎప్పుడు వ్యక్తిగతం, ఆర్ధిక వివరాలు ఏమి అడగను..అందరు బాగున్నారా..అనేదే తప్ప ఆర్ధిక పరిస్థితులని గూర్చి అడగను ..అని చెప్పారు. ఆ రోజే మద్యాహ్నం కి అన్నయ్య రిటర్న్ అయ్యారు. జరిగిన విషయం హౌస్ ఓనర్ లక్ష్మి అక్కకి చెప్పాను. "అయ్యో!వనజా..అన్నయ్య అల్లా ఎప్పుడు రికమండ్ చేయరు. "శిల్ప"ని చైతన్య లో జాయిన్ చేసినప్పుడు కూడా.. అందరి దగ్గర తీసుకున్నట్లుగానే పీజులు తీసుకుంటాను అంటేనే .. ఆ కాలేజ్ లో చదివిస్తాం అని వాగ్దానం తీసుకున్నాకే అక్కడ జాయిన్ చేసాం. అన్నయ్య స్వభావానికి విరుద్దం అలాటివి. నాకు చెబితే..సత్యనారాయణ అన్నయ్యకి నాన్న ద్వారా చెప్పించి అడిగిన్చేదాన్ని కదా!" అన్నారు.

నేను ఎప్పుడు ఒకటి అనుకుంటూ ఉంటాను. చిన్న పాటి విషయాలకి కూడా..స్నేహాన్ని అడ్డంగా వాడేసుకుంటూ.. స్వార్ధం తో మెలిగే మనుషులు మద్య.. ఇద్దరి మిత్రుల అపురూప స్నేహం వెనుక నెలకొని ఉన్న ఉన్నత మైన విలువలు,చిన్న పాటి పనులకి కూడా ఉపయోగించుకొని నిబద్దత ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి. అవసరాలకి స్నేహాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుని తర్వాత మొహం చాటేసే స్నేహాల మధ్య.. ఒక ఉన్నత మైన స్నేహాన్ని, ఉన్నత వ్యక్తిత్వాలని చూడటం..నాకు చాలా అబ్బురం. మా అబ్బాయికి కూడా చాలా సార్లు ఆ విషయం చెప్పి.. మా అబ్బాయికి సాంబశివరావు అన్నయ్య ని చూపించాలనుకున్నాను. కానీ కుదరలేదు.

అపరిమితముగా దనం సంపాదించడం, గొప్పగా మెలగడం .ఇతరులకి చిన్న మెత్తు సాయం కూడా అందించలేని పరమ లోభుల కన్నా .. తను నిజాయితీగా సంపాదించుకుంటూ..అందులో సగ భాగం పైగానే పేద విద్యార్ధులకి సాయం అందిస్తూ.. ఆఖరికి తను వ్రాసిన పుస్తకం పై లభించే రాయితీ మొత్తాలని కోడా పేద విద్యార్ధులకి సాయం అందించడంలోను, ఇతరుల ఇబ్బందిని గమనించి స్నేహంగా వెళ్లి ఇంటి అవసరాలకి కావాల్సిన గ్రాసరీ ని కూడా తీసుకు వెళ్లి అందించి.. వారి కోసం ఏమి దాచుకొని .. సాంబ శివరావు అన్నయ్యని. మంజుల గారిని చూస్తుంటే..
ఇంకా ఈ లోకంలో..మానవత్వం,నిబద్దత,ఉన్నత విలువలు యొక్క చిరునామా కనబడుతుంది. venkata S Musunuru .. అన్నయ్య అమెరిక పేరు. Granger -indiana ఉంటారు. Anesthesiology.లో బుక్స్ వ్రాసినందుకు గాను వారి సేవలకు గాను.. అవార్డులు వచ్చినట్లు విన్నాను కూడా.

ఇక్కడ వారి ఫోటో కూడా పెట్టి ఉండేదాన్ని. కానీ అన్నయ్యకి ఇలా చెప్పడం కూడా ఇష్టం ఉండదు.
ఆయనలో.. మరో మంచి కోణం .. ని చెల్లిని ప్రాణంగా చూసే అన్నయ్యని ,చిన్నమెత్తు కష్టం కూడా రానీయని అన్నయ్యని.ఒకవేళ కష్టం వచ్చినా తీర్చే అన్నయ్యని .ఓ..మంచి కొడుకుని, తండ్రిని కూడా నేను చూసాను. అలాంటి అన్నయ్య ఉండటం అదృష్టం మాత్రమే కాదు..గర్వపడటం కూడా. ఈ పోస్ట్ వ్రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఎందుకో నేను స్నేహానికి ఇచ్చిన ఆవిలువ కి గ్రేట్ ఫీల్ లోకి వెళ్ళిపోయాను కూడా. స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం ..అంటారు కదా!

ఇంతకీ..మా "అప్పు " చదువు కి కూడా సాయం చేయడం ..ఒక విధంగా గొప్ప విషయం అనుకుంటాను. ఎందుకంటే..ఒక ఉన్నత వ్యక్తిత్వం ఏమిటో.. ఒక మనిషిలో చూడ గలిగాము కదా! మా పిల్లల కి ఆదర్శం అంటే ఏమిటో చెప్పగల్గుతూ..ఓ. స్నేహం విలువ ఇది..అని చెప్పడం తక్కువ విషయమేమీ కాదు కదా! మా "అప్పు " కి ఇలా చెప్పాను. నువ్వు బాగా చదువుకుని.. ఆ.. అంకుల్ సాయం చేసినట్లు పదిమంది పిల్లలకి అయినా హెల్ప్ చేయగలగాలి. అప్పుడే ఈ సాయానికి విలువ ఉంటుంది అని. ష్యూర్ .. పెద్దమ్మా..అని అంది అమ్మాయి. పిల్లల్లో ఆత్మ విశ్వాసం, సేవా భావం ,వ్యక్తిత్వపు విలువలు నేర్పాల్సిన బాధ్యతా యుతమైన పని కూడా ఉంటుంది కదా!

ఇకపొతే..వెంటనే మా చెల్లెలికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి..ఇప్పుడు వాళ్ళే ఫీజ్ లు కట్టుకోగాల్గే స్థితి లో కి వచ్చేసారు. మా "అప్పు" 93 %. మార్క్స్ తో.. A ** సెక్షన్లో.. TOP టెన్ గా ఉండటానికి ట్రై చేస్తుంది. కార్పోరేట్ కాలేజ్ లు రాంక్ ల పంట కోసం..విద్యార్దుల పై ఒత్తిడి,పిల్లల మానసిక ఒత్తిడి గురించి మరొక పోస్ట్ లో వివరిస్తాను. ఇప్పటికి ఇక సెలవు.

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

ద్వై దీ భావం

ద్వై దీ భావం .. కలుగుతుందా మీకెప్పుడైనా.. !? 

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఒకే అభిప్రాయం తో ఎల్లెడలా ఉండలేం ఎందుకని అని!? . 

ఒకోసారి మన అభిప్రాయాలే.. మారి మనకి నచ్చక పోయినా సరే.. వెలిబుచ్చక తప్పని స్థితి లోకి   వెళుతుంటాం.. అలా ఎందుకో ఏమిటో.. అని ఆలోచిస్తూ ఉండగా.. మెదిలిన కొన్ని..  .

పుష్ప విలాపం వింటూ ఆక్రోశించడం 
మల్లెమొగ్గలు కోసుకుంటూ ఆనందించడం 

జీవకారుణ్యం గురించి వినేటప్పుడు నిజమేననిపించడం
దోమలు దాడిచేసినప్పుడు మాత్రం జీవ కారుణ్యం లోపించడం 

హత్య చేసేటప్పుడు కోపంతో వణకడం
హత్య చేయబడేముందు భయంతో వణకడం 

చికెన్ సెంటర్ కెళ్ళి కోళ్ళని చూడగానే ఊరేను  కన్నీళ్లు
చికెన్ చూడగానే ఊరేను నోట్లో నీళ్ళు ... 

 మీకు కూడా ఇలా సరదాగా ఏమైనా తడతాయేమో చూడండి.. :))))     

19, ఏప్రిల్ 2012, గురువారం

కరుణక్క కూతురు

సన్నగా చినుకులు పడుతున్న చైత్ర మాసపు తొలివారం. వేసవి వేడిమితో అలమటిస్తున్న  భాగ్య నగర వాసులకు అంత కన్నా భాగ్యం మరొకటి వుండదేమో అన్నట్లు ఆ చినుకుల  తడిని ఆస్వాదిస్తూ విరిసిన దరహాసాలతో, కులాసా కబుర్లతో ట్యాంక్ బండ్  ప్రాంతమంతా కోలాహోలంగా ఉంది.

తన ముందు కూర్చున్న బావ వేణుతో బైక్ పై వెళుతూ పల్లెటూరి కబుర్లు చెబుతున్నశ్రీను  అకస్మాత్తుగా మాటలు ఆపేసి వారి ప్రక్కనే వస్తున్న బైక్ పై దృష్టి సారించాడు. ఆతనంత  హఠాత్తుగా మాటలెందుకు  ఆపాడో అర్ధం కాక ..యేమిటి బావా! అంత లోనే మాట్లాడ కుండా ఆగిపోయావ్? అనడిగాడు. 

ఏం లేదు బావా! మా వూరి అమ్మాయి "సుధ" ఎవరో పిల్లాడితో కలసి బైక్ యెక్కి  వెళుతూ కనబడింది. ఆ అమ్మాయా కాదా ? అని చూస్తున్నాను. 

ఆ అమ్మాయే అయితే నీకేమిటి అభ్యంతరం ?  

"మా పల్లెటూర్లో  ఇట్టాంటివి గిట్టవు. అయినా ఆ సుధ వాళ్ళమ్మ కరుణక్క ఆ పిల్లని యెంత కష్టపడి   చదివించింది. కొద్దిగయినా బుద్ది,జ్ఞానం ఉండొద్దూ! పెళ్లి కాకుండా ఆ పరాయి  మగ పిల్లలతో ఆ తిరుగుళ్ళు ఏమిటీ" మాటల్లో కోపం .
"ఇక్కడ యిలాటివన్నీ మామూలే బావా! పెద్దగా పట్టించుకోకు"  

అది కాదు బావా! ఆ పిల్ల మన వూరి నుండి ఖమ్మం పోయి చదువుకున్నప్పుడు యెంత పద్దతిగా ఉండింది, ఇప్పుడు చూడు యెలా వుందో !ఖరీదైన బట్టలు,ఫోన్లు, జుట్లు విరబోసుకోవడాలు , యెంత నాగరికం నేర్చింది. అక్కడ కరుణక్క  పొద్దస్తమాను  యంత్రం తిరిగినట్టు మిషన్ చక్రంతో  తిరుగుతూ పని చేస్తూనే వుంటుంది. వాళ్ళబ్బ  సచ్చినోడు  వొట్టితాగుబోతు. అయినా తన కష్టం పిల్లకి రాకూదడనుకుని చదువు చెప్పిచ్చింది. ఈ పిల్ల వుద్యోగంకని వచ్చి యి క్కడిలా తిరుగుతుంది అన్నాడు బాధగా .

ఆ అమ్మాయి ఏం చదివింది? అడిగాడు వేణు

ఏదో కంప్యూటర్ కోర్స్  చదివింది. వాళ్ళమ్మ పెళ్లి సంబంధాలు  చూస్తుంది. నాకు పెళ్లి వద్దు,వుద్యోగం చేయాలని పట్టుబట్టుకు కూర్చుంది.  ఇక్కడ చూస్తే  యిలా  ! కాస్త బాగానే విచార పడ్డాడు.శ్రీను.

ఇక యింటికి  వెళ్ళేదాకా ఈ విషయమే మాట్లాడతాడనుకుని యేవో   మాటలు చెపుతూ  టాపిక్ మార్చేశాడు వేణు.

ఇంటికి వచ్చాడు అన్నమాటే గాని యెప్పుడెప్పుడు  చెల్లెలు "హేమ" కి సుధ విషయం చెపుదామా  అన్నట్టు కాసుకు కూర్చున్నాడు శ్రీను. 

రాత్రి భోజనాలు అయ్యాక చెల్లెలకి సుధ ని చూసిన విషయం చెప్పాడు. 

"అన్నయ్యా! పల్లెటూరిలో ఆడపిల్లలు యెవరు యేమనుకుంటారో నన్న  భయంతోనో, కొన్ని కట్టుబాట్లు మధ్య పెరుగుతారు. చదువు పేరిట బయట ప్రపంచంలోకి అడుగిడగానే వాళ్ళల్లో ఆధునికంగా ఉండాలన్న కోరిక బలపడుతుంది. దానికి కారణం లేకపోలేదు. పట్టణాలలో పిల్లలు పల్లెటూరి నుంచి వచ్చిన పిల్లలని విలేజ్ గాళ్స్ అని చులకన చేస్తారు. వాళ్ళు చదువుల్లో పట్టణాలలో చదువుకున్న పిల్లలకన్నా ప్రతిభ ఉన్నవాళ్ళు అయినా సరే.. పల్లెటూరి నుంచి వచ్చిన పిల్లలంటే చిన్న చూపు. వాళ్ళ చులకన భావం తట్టుకోలేకనో,లేదా అధునాతనంగా కనిపించాలనే అణగారిన కోర్కె నిద్ర లేచి,తల్లి దండ్రుల కట్టడి నుండి బయట పడి వొక్కసారిగా  లభించిన స్వేచ్చతో అమ్మాయిలూ మారిపోతున్నారు. 

మేకప్ కిట్  కి, బ్యూటి పార్లల్ కి, ఇంకా బాగా చెప్పాలంటే బాడీ వాక్స్ కి  కూడా బాగా ఖర్చు చేస్తున్న కాలం ఇది.
 .ఆ పిల్ల 'సుధ' ని నేను రోజు చూస్తుంటాను. ఏదో చిన్న పాటి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ వేరు. కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్,   కొత్త దుస్తులు, తరచుగా మారిపోయే  బాయ్ ఫ్రెండ్స్ ఆ  పిల్ల పద్దతి చాలా  మారింది. 

"వాళ్మమ్మ యెంత గుట్టుగా వుంటుంది,  మరీ యీ పిల్లకి పోయే కాలం వచ్చి యిలా తయారయి చచ్చింది" అని తిట్టాడు శ్రీను.

"అన్నయ్యా ! నువ్వు మన వూరు వెళ్ళాక ఈ సంగతి యెవరితో అనకు". 

"లేదమ్మా! నేను కరుణక్కకి యీ విషయం చెపుతాను" అన్నాడు ఆవేశంగా. 

ఎవరి పిల్లలపై వాళ్లకి నమ్మకాలు ఉంటాయి. తల్లి దండ్రుల దృష్టిలో పిల్లలెప్పుడూ అమాయకులే! పోయినసారి నేను సంక్రాంతి పండక్కి వచ్చినప్పుడు.. కరుణక్క సుధ గురించి చాలా బాధ పడింది. "దానికి  చదువు తప్ప వేరే లోకమే లేదు. తిండి కూడా సరిగా తినదు.దానికేం కావాలో దానికే తెలియదు. యెలా  బ్రతుకుతుందో యేమిటో అని చెప్పి బాధ పడింది.  ఆ పిల్ల మన వూరికి వస్తే  అలాగే ఉంటుంది. నాసి రకం బట్టలు కట్టుకుని,జడ వేసుకుని ఉంటుంది. ఇక్కడ చూస్తే మొహం కూడా కనబడకుండా వొంటినిండా బట్టలు చుట్టుకోవడం  యేమిటో!యెవరూ గుర్తు పట్టకుండా కాబోలు ! అక్కసుగా,అసహ్యంగా అన్నాడు శ్రీను.

"సర్లే ! యివన్నీ  మనసులో పెట్టుకోకు. ఎవరిక్కూడా  మంచి మాటలు చెప్పే కాలం కాదిది. కరుణక్కకి అసలు చెప్పకు" అని మాట తీసుకుంది. అందుకు అయిష్టంగానే వొప్పుకున్నాడు శ్రీను. 

ఏమిటీ? మీ అన్న ఇంకా ఆ..సుధ ..విషయం జీర్ణం చేసుకోలేక పోతున్నాడా? అని నవ్వుతూ అడిగాడు వేణు అక్కడికొచ్చి.
"ఆ అమ్మాయే కాదు.. చదువుకున్న అమ్మాయిలే నాకు నచ్చడం లేదు " అన్నాడు. శ్రీను. 

"అలా అంటే మీ చెల్లెలు కూడా నాకు  నచ్చకూడదు " అన్నాడు ఉడికిస్తూ వేణు. 

"అలా అనబాకు వేణు బావా !మా చెల్లెలిని  యెంత పద్దతిగా పెంచామో! " అన్నాడు రవంత కోపంగా. 

ఒక  పాతిక,ఇరవయ్యి యేళ్ళ క్రితం..అమ్మాయిలూ ప్రేమ అంటేనే భయపడేవారు. ఒకవేళ ప్రేమించినా ఆ ప్రేమ వొకరితోనే అనుకుని వీలయితే పెళ్లి చేసుకుని,లేకపోతే మనసులోనే ప్రేమని చంపేసుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని కాపురం చేసుకునేవాళ్ళు. అంటూ చెప్పుకొచ్చింది హేమ.

ఇప్పటి కాలంలో చదువుల పేరిట ,ఉద్యోగాలు పేరిట బయట ప్రపంచం తెలియడం రకరకాల ఆకర్షణకి లోనై  ఒక  ప్రేమ కాదు ఎన్నో సార్లు ప్రేమలో మునిగి పోతున్నారు. లవ్ కి లస్ట్ కి తేడా తెలియ కుండా పోతుంది.కొంత మంది సినిమాలు షికార్లు కోసం,కొంత మంది షాపింగ్ లలో బాగా ఖర్చు బెట్టించి తమకి కావాల్సింది కొనిపించడం కోసం కొంత మంది కాలక్షేపం కోసం యిలా ప్రేమలు మొదలెట్టారు. ఒకో అమ్మాయికి పొద్దున్నే ఒకరు, సాయంత్రం వేరొకరు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నా ఫ్రెండ్ ఒకడికి అర్ధరాత్రి అమీర్ పేట ఉమెన్స్ హాస్టల్ నుంచి ఒక అమ్మాయి అర్ధరాత్రి పోన్ చేసి"ఒరేయ్..రామ్.. నా మొబైల్ చార్జెర్ కనబడటం లేదురా! అర్జంట్ గా చార్జెర్ తెచ్చి ఇవ్వవా..ప్లీజ్ ! అని కాల్ చేసి అడగ గానే.. పది పదిహేను మైళ్ళు  ఆ అర్ధ రాత్రి ప్రయాణించి ఆ అమ్మాయికి ఫోన్  చార్జెర్ ఇచ్చి వచ్చాడు.రిటన్ వచ్చాక ఆ అమ్మాయి నంబర్కి కాల్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ నిరంతరం  ఎంగేజ్.  చూడు నాకోసం బకరా గాడు ఎలా బలి అయ్యాడో అని వొకటే నవ్వులని యింకో అమ్మాయి తెల్లవారి చెప్పేదాకా వీడికి  ఆ సంగతి తెలియలేదు అని చెప్పాడు వేణు. 

 నా కొలీగ్ రామ్ తో నాలుగైదు నెలల నుంచి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించి వీడికి హ్యాండ్ యిచ్చింది వొక అమ్మాయి. వాడు తన జీతం అంత ఇలాగే తగలబోస్తాడు.  ఇంటికి వొక్క  పైసా పంపడు. వాడే కాదు,చదువుకుంటున్న మగ పిల్లలందరూ  అంతే! తల్లి దండ్రులు కష్ట పడి సంపాదించి వీళ్ళిక్కడ యే౦ యిబ్బంది పడతారో అన్నట్టు పొట్ట కట్టుకుని మరీ డబ్బు పంపిస్తే.. వీళ్ళిక్కడ ఐ మాక్స్ ధియేటర్ లో సినిమాలు, అమ్మాయిలతో ట్యాంక్ బండలపై విహారాలు, పార్టీలు. అంతా విచ్చల విడి తనంగా ఖర్చు పెట్టడం చేస్తున్నారు. కొంచెమైనా బాధ్యత  లేదు. ఎందుకు వచ్చారో, యే౦ చేస్తున్నారో అన్న వివేకం లేదు.వీళ్ళకి యెవరు చెప్పినా తలకెక్కదు.ఒకటి రెండు చేదు అనుభవాలు అయితేనే కాని నిజం ఏమిటో..గ్రహించరు అని చెప్పింది హేమ.

ఇంకో విషయం కూడా అర్ధం అవుతుంది మనకి.  వీళ్ళు యిలా  అనేక మంది అమ్మాయిలతో కాలక్షేపపు తిరుగుళ్ళు తిరిగి రేపు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పై మనసు లోతుల్లో అనుమానం పెనుభూతం. ఈ అమ్మాయి  యింకా వర్జిన్ గానే ఉందా? ఇన్నేళ్ళు    యే బాయ్ ఫ్రెండ్ లేకుండానే వుందా ? అనే అనుమానపు ధోరణి తో  నిత్యం మానసిక అశాంతితో నలిగి పోతున్నారు. మా ఆఫీసులో పనిచేసే రమేష్ అలాగే చేసాడు. ఓ..పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఆ అమ్మాయి డిగ్రీ వరకు చదివింది. ఒక్కటే కూతురు. బాగా ఆస్తిపరులు. మంచి వుద్యోగం వుందని  రమేష్ కిచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. ఆ రమేష్ భార్యతో మాట్లాడిన తొలి మాట .."యెంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, యిదే నీకు తొలి అనుభవమా! నిజం చెప్పు ? అని అడిగాడట. ఆ అమ్మాయి వెంటనే ఆ గదిలోనుంచి బయట పడి పెద్ద వాళ్ళతో  విషయం చెప్పింది. "జీవితాంతం ఇలాగే అనుమానిస్తాడు. ఆతను నాకొద్దు " అని చెప్పిందట ఆ అమ్మాయి. మూడో రోజుకల్లా వివాహం రద్దు చేసుకున్నారు అని చెప్పాడు వేణు దీర్ఘంగా నిట్టూరుస్తూ 
వేణు వీళ్ళిద్దరి మాటలు వింటూ అయోమయం ఆశ్చర్యంలో కొట్టుమిట్టాడుతుంటే ..

అన్నయ్యా.. నేను యెక్కువ చెపుతున్నాననుకోకు, లోపం యెక్కడుందో తెలియడం లేదు. తొలివలపు తీయదనం బ్రతుకంతా  తీయం గా మిగిలిపోవాలి కానీ యిప్పటి  స్పీడ్ యుగపు పిల్లలకి  యివేవీ అవసరం లేదు. అంతా స్వేచ్చ కావాలి. అది యిచ్చినా  కష్టమే, యివ్వక  పోయినా నష్టమే! చదువులు,ఉద్యోగాలు,సంపాదనలు యివి  తప్ప యేమీ  వద్దు. నైతిక విలువలు.  అస్సలు అవసరం లేదు. అంతా ఎంజాయ్మెంట్. అంతే! ఆడ పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల దగ్గర ఖరీదైన గిఫ్ట్ లు వున్నా యిది యెక్కడిది..అని పట్టించుకోవడంలేదు. ఏ లవ్ ఎపైరో..బయట పడినప్పుడు, లేదా తల్లిదండ్రులు పెళ్ళికి అంగీకరించనప్పుడో  యింటి నుండి వెళ్లి పోయినప్పుడో, అవాంచిత గర్భం ధరించినప్పుడు తప్ప బయట పడని విషయాలివి. దీర్ఘంగా చెప్పింది అన్నకి విషయం అర్ధమవ్వాలని. శ్రీను హేమ వంక ఆశ్చర్యంగా చూసాడు."యెంత ఎదిగింది..నా చిట్టి చెల్లెలు" అనుకున్నాడు.

వీటన్నిటి మధ్య బుద్దిగా చదువుకుంటున్న అమ్మాయిలకి యిబ్బంది ఉంది.కొందరిని చూసి అందరిని వొకే గాట కట్టే పరిస్థితుల్లో.. అమ్మాయిల భవిష్యత్  గురించి   ప్రతి యింట్లో  తప్పని సరి దిగుళ్ళు ఉంటున్నాయి. సామాజిక పరమైన సమస్యలు కొన్ని, కొని తెచ్చుకునే సమస్యలు కొన్ని. వీటన్నిటి మధ్య యువతరం పరుగులు పెడుతుంది. ఆకర్షణ,ప్రేమ,మొహం,విలాస వంతమైన జీవన విధానం,కాలక్షేపపు ప్రేమ,నిజమైన ప్రేమ యేమిటో ..ఈ గడబిడ. యెక్కడికో యీ పరుగులు ? యే౦ సాధించాలనో  అర్ధం కావడం లేదు వొకింత వేదనగా అన్నాడు వేణు .  

అందరూ  మౌనంగా ఉండిపోయారు. 

ఏవేవో ఆలోచనలతో పక్కపై దొర్లుతూనే వున్నాడు  శ్రీను. తెల్లవారిన తర్వాత తన వూరికి  తిరిగి వెళ్ళాడు . సుధ విషయం  కరుణక్క కి చెప్పాలని నోటి మీదకు వచ్చి కూడా   చెల్లి కిచ్చిన  మాట గుర్తుకొచ్చి  ఆగి పోయాడు. 

కొన్నాళ్ళకి.."సుధ" ప్రేమించిన వాడు  పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేసి మోసం  చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని   ప్రేమించినతని యింటి  ముందు మౌన పోరాటం చేస్తున్న విషయాన్ని  ప్రత్యక్ష ప్రసారాలలో చూసి   శ్రీను ఆశ్చర్య పోలేదు కానీ.. కరుణక్క ..నా కూతురు  వొట్టి అమాయకురాలు అని యేడవడం చూసి జాలి పడ్డాడు.

యెంత ప్రేమించినా అమ్మాయిలు ఆ విషయం లో  జాగ్రత్త పడొద్దూ ! అని వూర్లో  జనం అనుకుంటుంటే పట్టణ పిల్లల వన్నీ పిదప బుద్దులు , ఆ రహస్యాలు తెలియకుండా పల్లె నైనా కాస్త స్వచ్చంగా  వుండనీయాలి అనుకున్నాడు శ్రీను    అది సాధ్యం కాదని అనుమానం వున్నా సరే  !  


18, ఏప్రిల్ 2012, బుధవారం

ప్రేమ అన్నది ఒక కల

 సర్వాంతర్యామి ప్రేమ .. 

చెప్పా పెట్టకుండా వచ్చి జీవితాలని అతలాకుతలం చేసి వెళ్ళిపోతుంది.  

పాము కాటుకు చిక్కుకున్న వాళ్ళు బతికి బట్ట కట్టవచ్చునట. ప్రేమ కాటుకి బలైన వారు బతికి బట్ట కట్టలేరని..ఓ..కవి వ్రాసినట్లు..
ఎక్కడ చూసినా ప్రేమ జాడలే!  
ఏముంది !? అందులో అనుకుంటూనే ..ఎప్పుడో ఒకప్పుడు టక్కున అగాధం లాంటి ఆ ప్రేమలో జారి పడుతుంటారు.
ప్రేమ గాధలు,బాధలు వినే వారికి బాగా లోకువైపోయిన రోజులివి. ఎక్కడ వినగలం చెప్పండి.అన్నీ అవే కదా! 
పార్కుల్లో ప్రేమలు పోయి మొబైల్ ప్రేమలు నరకం రా బాబు.. అనుకోవడం తప్ప ఇక వినడానికి ఏముంది. !? 
మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లేదా ఒక అబ్బాయి.. 
"వేరొకరి మాజీ ప్రేమికుడు లేదా మాజీ ప్రేమికురాలు " 
వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. కాలక్షేపపు ప్రేమలు.. విలాసాల కోసం ప్రేమలు ..ఎక్కువై ..నిజమైన ప్రేమ ఎక్కడుందో..అని అనుమాన పడుతూనే ఉంటాం. 
ఈ ప్రేమ గురించి యెంత చెప్పినా తక్కువే! కొంత చెప్పినా ఎక్కువే!  ప్రేమ అనే కలలలో పోద్దస్తమాను తేలియాడకుండా, ఆ మాయదారి వలలో చిక్కుకోకుండా కాస్త మనసుని అదుపు ఆజ్ఞాలలో ఉండనీయండి. 
"ప్రేమ ఉద్భవం ఎదను చిగిర్చే వసంతం - ప్రేమ విఫలం వ్యధను రగిల్చే గ్రీష్మం"   బి కేర్ పుల్ !
 అందుకే..విషయానికి బై బై ..చెప్పేసి ఒక పాట. 
నూటికి నూరు శాతం.." ప్రేమ" గురించి చెప్పే పాట 
ప్రేమ "బ్రహ్మముడి" వరకు దారితీయక పోయినా సరే బ్రహ్మ పదార్ధం లాంటి వస్తువని అనుకుంటూ..ఎంతో మంది ప్రేమికులి పెదవుల పై చిరునవ్వులని చెరిపేసే ప్రేమ...



ప్రేమ ..గురించి..ఈ పాట.
 కే.జే.యేసు దాస్  గళం ఒలికించిన ఈ పాటకి 
సాహిత్యం: దాసరి నారాయణరావు గారు.
సంగీతం: చంద్ర శేఖర్. . 
సాహిత్యం..
 ఓ..ఓ...ఓ..ఓ...ఓ..
ప్రేమ అన్నది ఒక కల.. కల .. కల
చిక్కు కుంటే అది వల... వల.. వల 
మొదట  సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా 
పిదప ఎదిరిపోతుంది కాకిలా 
కడకు విడిచిపోతుంది ఏకాకిలా (ప్రే)

మనసు  అనే మల్లె మొక్క  పై ఆశ అనే తుమ్మెదల్లె
వాలుతుంది రసవంతంగా, చేరుతుంది బలవంతంగా  
చేరి మొగ్గపై మొగ్గలేస్తుంది అది ముక్కలైతే యెగిరి పోతుంది
మరో మొక్క పై వాలుతుంది కొత్తగా..కొత్తగా 

ప్రేమ అన్నది ఒక కల.. కల . కల
చిక్కు కుంటే అది వల... వల   వల 
మొదట  సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా 
పిదప ఎదిరిపోతుంది కాకిలా 
కడకు విడిచిపోతుంది ఏకాకిలా

వయసు అనే పూల  బండి పై 
పెళ్లి అనే గూడును  కట్టి ఆపుతుంది నెమ్మదిగా ...
ఎక్కుతుంది ఆనందంగా....  
ఎక్కి బండినే పడ దోస్తుంది అది పడుతుంటే పారిపోతుంది
మరో బండి పై ఎక్కుతుంది కొత్తగా ..కొత్తగా

ప్రేమ అన్నది ఒక కల.. కల . కల
చిక్కు కుంటే అది వల... వల   వల 
మొదట  సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా 
పిదప ఎదిరిపోతుంది కాకిలా 
కడకు విడిచిపోతుంది ఏకాకిలా (ప్రే)
 


17, ఏప్రిల్ 2012, మంగళవారం

పోస్ట్ కార్డ్ స్పందన

ఆడ పిల్లలు మెకానిక్ కోర్సెస్ చదివి ఏం చేస్తారు? అని చాలా మంది యెగతాళి చేస్తారు.
అది ఒకప్పటి మాట.
నేటి కాలం లో మెకానికల్,ఆటో మొబైల్  బ్రాంచ్ లని కోరి  తీసుకుని ఇష్టంగా చదువుతున్న ఆమ్మాయిలని చూస్తున్నాం. 

పురుషులకి మాత్రమే పరిమితమైన రంగాలలో స్త్రీలు ప్రవేశించడం చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభం  అయింది. 
ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పబోతూ ఈ ఉపోద్ఘాతం అన్నమాట. 
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న  ఒక యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి విదేశాలకి వెళ్లి అక్కడ కంప్యుటర్ సైన్స్ లో డాక్టరేట్ సాధించాలని ఆశయం తో ఉంది. 
అప్పటికి ఆమె చదువుతున్న తరగతిలో  ఒకే ఒక స్త్రీ ఆమె. 

ఒక రోజు నోటీస్ బోర్డ్లో  ఒక ఉద్యోగ ప్రకటన  కనిపించింది. 

టెల్కో ఆటో మొబైల్ సంస్థ జారీ చేసిన ఆ ప్రకటన లో యువకులు,తెలివికలవారు,కష్టించి పనిచేసేవాళ్ళు,అత్యున్నత విద్యా ప్రమాణ నేపధ్యం ఉన్న ఇంజినీర్లు కావలెను. స్త్రీ అభ్యర్ధులు దరఖాస్తు పంపనవసరం లేదు అని చదివిన ఆమెకి ఉవెత్తున కోపం ముంచుకు వచ్చింది. స్త్రీ అభ్యర్ధులు ఎందుకు అర్హులు కాదో తెలుసుకోవాలనుకుని ఆ విషయాన్ని సవాల్ గా తీసుకుంది.  ఆ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుని నిర్ణయించుకుని

టాటా గ్రూప్ అధిపతి జే.ఆర్.డి.టాటా. గారికి ఓ పోస్ట్ కార్డు పై ఇలా వ్రాసి పోస్ట్ చేసింది.

"భారత దేశంలో  టాటాలు ఎన్నిటికో ఆధ్యులు. ఇనుము-ఉక్కుకర్మాగారం,రసాయనాలు,వస్త్రాలు,రైలింజనాలు,ఇంకా అనేక పరిశ్రమలు స్తాపించారు. ఉన్నత విద్య కోసం ఇనిస్టి ట్యూషన్స్ ఎన్నో స్తాపించారు. నా అదృష్టం కొద్ది నేను అక్కడే చదువుకున్నాను. అలాంటి  మీరు స్త్రీ-పురుషుల మధ్య వివక్షని మీ కంపెనీలో పాటిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది".అని వ్రాసి పోస్ట్ చేసారు. 

పదిరోజులకి ఆమెకి ఓ టెలిగ్రాం వచ్చింది.  టెల్కో పూనే లో మీరు ఇంటర్వ్యూ కి హాజరు కావాలని.  ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమెకి  ఆ ఉద్యోగం లభించింది.టెల్కో ప్లోర్ లో పని జేసిన మొట్టమొదటి మహిళ ఆమె నని చెపాల్సిన పనిలేదు కదా! 

కొన్ని వందల ఉత్తరాలలో ఒక పోస్ట్ కార్డ్ కి విలువనిచ్చిన వ్యక్తీ ఓ ప్రముఖ వ్యక్తితో మాట్లాడింది కూడా! ఆయన అప్రో జే.ఆర్.డి.టాటా. (అప్రో అనేది గుజరాతీ పదం. అప్రో..అంటే "మన" అని అర్ధం.) 

ఆమెకి ఓ రోజు రాత్రి   పోద్దుపోయిన తర్వాత ఆమె భర్త వచ్చి ఆమెతో కలసి వెళ్ళేవరకు ఆమెకి రక్షణగా నిలబడ్డారు. అలాగే ఆమె 1982  లో టెల్కో ఉద్యోగం కి రాజీ చేసిన రోజు  అప్రో జే.ఆర్.డి.టాటా తో మాట్లాడింది. 

'ఇప్పుడు ఏం చేద్దామనుకున్తున్నావ్ మిసెస్ కులకర్ణీ"!? అని అడిగారు.
అప్పుడు ఆమె నా భర్త ఇన్ఫోసిస్ కంపెనీ ప్రారంభిస్తున్నారు. నేను పూనే  కి మారాలి అని చెప్పారు ఆమె.


 ఇప్పుడు అర్ధం అయిందా!? ఆమె సుధా కులకర్ణి. (సుధా నారాయణ మూర్తి  or  సుధా మూర్తి) 

తర్వాత ఇన్ప్ఫోసిస్ కంపెనీ పురోగమన వృద్దిని ఆయన చూడాలని ఆమె కోరుకుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. కానీ  ప్రతి రోజు ఆమె తన ఆఫీస్ లో అడుగుపెట్టగానే అప్రో ఫోటో ని చూసి నమస్కరించుకుంటుంది.

ఈనాడు దేశంలో ఎంతో మంది ఆడపిల్లలు పురుషులతో సమానంగా ఉన్నారంటే అది వారు వేసిన బాటే కదా!

ఈ స్పూర్తికరమైన విషయం ప్రస్తుతం ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరంలో పాఠ్యభాగంగా ఉంది.  

అలాగే ఆమె చెప్పిన ఎన్నో విలువైన విషయాలు" How I  taught My Grand Mother.". అనే  పుస్తకంలో కథలుగా చదువుకోవచ్చు. తెలుగులో "అమ్మమ్మచదువు " పుస్తకంలో చదవవచ్చు.
తెలుగు అనువాదం:ద్వారక, అలకనంద ప్రచురణలు.  తప్పక చదవండి.  

16, ఏప్రిల్ 2012, సోమవారం

తన రంగునిచ్చి తను రాలిపోయిన "గోరింటాకు"



నాకు  చాలా బాగా  నచ్చిన సినిమా .. గోరింటాకు.

నేను పదునైదేండ్లు వయసులో ఉండగా.. చూసిన సినిమా. ఇప్పటిలా ఒక సినిమా రాగానే కొన్ని నెలలకే , కొన్ని రోజులకే కనుమరుగై పోయిన రోజులు కావు కదా అవి. మంచి సినిమా అంటే ఏడాదికి ఓ సారి అయినా వచ్చి ఓ..పది పదిహేను రోజులపాటు ధియేటర్ లో మూడు పూటలా  అలరించి వెళ్ళేవి .

నేను పదవతరగతి చదివేటప్పటికి  ఆ చిత్రం విడుదలయి ఓ..రెండేళ్ళు దాటింది. శోభన్ చిత్రాలు అంటే..మా వూరి వాళ్లకి బాగా అభిమానం. అక్కడే పుట్టి పెరిగి వెళ్ళినవాడని..అందరికి పరిచయం ఉండటం మూలంగా ఎక్కువ గా శోభన్ చిత్రాలని   ఆదరించే వారు.  చిత్రం బాగుంటే ఇంకా ఎక్కువగా  ఆ చిత్రాన్ని ఆదరించి అభిమానాన్ని చాటుకునేవారు.  అయినా శోభన్ బాబు ఖాతాలో ఎక్కువ మంచి చిత్రాలే ఉండేవి.

నేను "గోరింటాకు " చిత్రాన్ని చూసింది మూడు సార్లు..కానీ ఆ చిత్రాన్ని రోజు సెకండ్ షో ని చూడకుండా వినడం ఓ..పదిహేను రోజులు. రాత్రి సమయాలలో ట్యూషన్ టైం అయిపోయి..అందరూ  ముసుగుతన్ని  పడుకుంటే..ఆ చిత్రంలో సంభాషణలన్నింటిని  బాగా  వింటూ.. అంత కన్నా బాగా జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. అలా నిద్రలోకి జారుకునేదానిని.(ప్రక్కనే దియేటర్ ఉండేది కాబట్టి)

అలా గోరింటాకు చిత్రం నాకు బాగా నచ్చేసింది. చిత్ర కథా రచన దాసరి గారు అనుకుంటాను. చాలా పదునైన సంభాషణలు, కదిలించే సంభాషణలు చాలానే ఉండేయి,

ఓ పల్లెటూర్లో పుట్టిన రాము కి ఓ..చిట్టి చెల్లి ఉండేది. ఆమెకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. తల్లి ఆ అమ్మాయికి గోరింటాకు కోసి రుబ్బి పెడుతూ.. ఓ.పాట పాడుతుంది. ఆ పాట వినగానే మనకి గీత రచయిత దేవులపల్లి  టక్కున గురుకు వస్తారు. మాహానటి సావిత్రి రూపం గుర్తుకు వచ్చి బాగా బాధ కల్గుతుంది.

"మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు,గన్నేరులా పూస్తే కలవాడోస్తాడు,  సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా..అందాల చందమామ తానే దిగి వస్తాడు." అని పదహారు అణాల తెలుగుతనాన్ని పూయించిన పాట.
ఇంతకీ  ఆ తల్లికి లభించిన  మొగుడు కోపిస్టి వాడు,పాపిష్టి వాడు కాబట్టి..అ బిడ్డ అల్పాయుష్కురాలయింది.ఆ ముద్దుల అన్నకి గోరింటాకు అంటేనే భయం మిగిల్చింది.

ఆ చిత్రంలో సావిత్రి భర్త ఓ..వ్యసనపరుడు. పరాయి స్త్రీల మోజులో..కుటుంబాన్ని గాలికి వదిలేసి..అప్పుడప్పుడు వచ్చి తన ప్రతాపాన్ని చూపించి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుల నీరు నింపుకుని ఆ భర్తకి ఎదురు చెప్పలేక మౌనంగా భరిస్తూ.. బిడ్డలే ప్రాణంగా బ్రతుకుతున్న ఆమెకి కడుపు కోత మిగిల్చి..పూర్తిగా తన విలాస జీవితంలోనే మునిగి పోతాడు..తండ్రి (జే వి రమణ మూర్తి). మేనమామ, అత్తల సాయంతో..రాము (శోభన్ బాబు ) చదువుకోవడానికి పట్నం చేరు కుంటాడు. మెడిసన్ కోర్స్ లో జాయిన్ అయి.. చదువుకుంటూ.. సక్రమంగా ఫీజు చెల్లించలేక ఆ
దుస్థితిలో అందరి దృష్టిలో పడినప్పుడు  స్వప్న (సుజాత) దృష్టిలో పడతాడు. ఆమె అతని కి సాయపడి..అందుకు బదులుగా తన చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పమని అడిగి వారి ఇంట్లోనే అవుట్ హౌస్ లో ఆశ్రయం ఇస్తుంది. అతనికి సహాయ పడుతుంది.

ఆమె మంచితనాన్ని, సహృదయాన్ని, వ్యక్తిత్వంని ఆరాదిస్తూ..తన మనసులో భావాల్ని ఎప్పటికప్పుడు  డైరీలో రాసుకుంటూ ఉంటాడు రాము. అవకాశం దొరికితే తన మనసులో భావాలని  ఎన్నో సార్లు  చెప్పాలనుకుని ఆరాట పడతాడు. అలా కొన్నేళ్ళు ఆమెకి తన ప్రేమని చెప్పాలనుకుని కూడా చెప్పలేక మూగప్రేమతో.. సతమత మవుతాడు.

చదువు పూర్తికావడంతో..స్వప్న తండ్రి ఆమెకి  వివాహం చేయదలచి ఒక మంచి సంబందం చూస్తాడు.ఆ విషయాన్నే  రాముకి చెప్పి అతని సలహా తీసుకుంటాడు.రాము కూడా ఆమెకి అన్ని విధాల సరైనజోడని ఆమె తండ్రి ఎంపికకి ఓటు వేస్తాడు. అది తెలిసిన స్వప్న ..తన ప్రేమని తనలోనే దాచుకుని తండ్రి కుదిర్చిన వ్యక్తి ని వివాహం చేసుకుంటుంది.

ఆనంద్ తో   కలసి కాపురానికి  వెళ్ళిన స్వప్నకి .. ఓ..చేదు విషయం తెలుస్తుంది. ఆమె వివాహమాడిన ఆనంద్ (దేవదాస్ కనకాల) కి అంతకు ముందు ఓ..వివాహం జరిగి..ఓ..పాపకి జన్మనిచ్చాడని తెలుస్తుంది. అతని తప్పుని నిలదీసి..అతనికి బుద్ధి చెప్పి  పాపతో కూడా వచ్చిన ఆమెని అతనితో కలిపి   తిరిగి పుట్టింటికి చేరుకుంటుంది. ఈ లోపు రాము ..ఆ ఇంటి నుండి వేరే ఇంటికి మారి పోయి..పల్లెటూరి నుండి తల్లిని తీసుకు వచ్చుకుని ఆమెతో కలసి ఉంటూ ఉంటాడు.

వారి ఇంటి ప్రక్కనే మేడమీద నివసిస్తున్న పద్మ పాడిన విషాదమైన పాట (పాడితే శిలలైన కరగాలి) వింటాడు. ఆ పాట తర్వాత ఆమె  దుఖః భారంతో సృహ తప్పడం ఉన్మాదిలా ప్రవర్తించడం  చేస్తూ ఉంటుంది. రాము  ఒక డాక్టర్ గా వెళ్లి ఆమెకి సేవలు అందిస్తాడు.ఆ క్రమంలో  ఆమె  చేష్టలవలన  గాయపడతాడు కూడా. ఆమె తల్లి  చెప్పిన విషయాల వల్ల కొన్ని విషయాలు  రాముకి తెలుస్తాయి. పద్మ వివాహ ఘడియకు ముందు ఆమెని పెండ్లాడాల్సిన వరుడు..పెళ్ళికి సిద్దమై వస్తూ.. దారిలో జరిగిన  యాక్సిడెంట్ లో చనిపోవడం మూలంగా  ఆమె ఆ షాక్ తో మానసికంగా దెబ్బతిని అలా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది. ఆమె పై కలిగిన సానుభూతితో.. ఆమెకి ట్రీట్మెంట్ లో భాగంగాను..పద్మకి సన్నిహితం అవుతాడు. ఈ లోపు.. రాము తండ్రి అనారోగ్యం పాలయి హాస్పిటల్ లో దిక్కు మొక్కు లేకుండా పడి ఉండటం చూసి  తండ్రికి  తన తిరస్కృతి చూపుతూనే వైద్యం అందించి మామూలు మనిషి అయ్యేటట్లు చూస్తాడు. ఆ తర్వాత  తండ్రి తమతో మరలా కలసి ఉంటాడని  తల్లి అన్నప్పుడు వ్యతిరేకిస్తాడు...కానీ తల్లి మాట కాదనుకోలేక తమతో కలసి ఉండటానికి అయిష్టంగానే అంగీకరిస్తాడు. ఎందుకో సావిత్రి నిర్ణయాన్ని హర్షించలేకపోయాను కూడా ! అలాంటి భర్తని ఆమె క్షమించడం నా దృష్టిలో అవివేకం కూడా !

మధ్యలో ఒకసారి స్వప ని  కలసినప్పుడు ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడతాడు.
ఒకరోజు..  స్వప్నకి రాము డైరీ ఆ ఇంట్లో కనబడుతుంది అది చదివిన ఆమెకి అతని మనసులో ఉన్న ప్రేమ  సంగతి తెలుస్తుంది. అతనితో.. మాట్లాడాలనుకుంటుంది. ఈ లోపుగా రాముకి  పద్మకి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వారు ఇద్దరు పెళ్ళిచేసుకోవాలని నిర్ణయం చేసుకున్తప్పటికి ..స్వప్న ప్రేమ సంగతి తెలుస్తుంది. పద్మ ఆత్మహత్యా ప్రయత్నం .. చేయడం..స్వప్న ఆమెకి బ్లడ్ డొనేట్ చేసి బ్రతికించడం.. ఆ ఇరువురి మధ్య నలిగిన మూగ ప్రేమ తిరిగి కలిసే సమయానికి మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టొరీ కావడం అంతా  ఒక కలలా అనిపించినా.. కథ, సెంటిమెంట్ బలంగా ఉండటంతో.. ఎక్కడా ప్రేక్షకుడికి విసుగు పుట్టవు. మన మధ్య జరుగుతున్న  సహజమైన కథలా రీళ్ళు కి రీళ్ళు కదలి వెళ్లి పోతుంటాయి .

పద్మ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నాని రాము చెప్పినప్పుడు   స్వప్న ఒక ఉన్నత వ్యక్తిత్వంతో.. పద్మ ఉన్న స్థితిలో ఆమెని వివాహమాడటమే మంచిదని రాముని ఒప్పిస్తుంది.

"స్వప్నా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ ? "  అని అడుగుతాడు..రాము.
"నేను తిరిగి నా భర్త దగ్గరకే వెళ్లి పోవాలనుకుంటున్నాను" అని చెపుతుంది.
"నీకు పాత కాలం ఆడవారికి తేడా లేదు అని నిరూపించావ్"..అంటాడు రాము.
"కాలం ఏదైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే కదా !" అంటుంది..స్వప్న.
చదువుకునే రోజుల్లో వల్లించే ఆదర్శాలు,ఆశయాలు నిజ జీవితంలో ఆచరణ లో కనబడని స్త్రీల జీవితం పట్ల ఆవేశం,ఆవేదన ఉంటుంది.
అలాగే  చిత్రం ఆఖరిలో స్వప్న   ఒంటరిగా మిగిలిపోయి..అలా దూరంగా నడచి వెల్లిపోయేటప్పుడు.. వినిపించే  గీతం  మనసుకు వస్తూను ఉంటుంది.  "తన రంగుని ఇచ్చి (ప్రాణ మిచ్చి ) తనువంతా ఎండి తను రాలిపోతుంది." అంటూ గోరింటాకు స్వరూపాన్ని స్వప్న పాత్రకి అన్వనయించి చెప్పడం నాకు చాలా నచ్చింది.

స్త్రీల  పూర్తి కాల జీవితం పురుషుల నడవడికతో ముడిపడి ఉండటం.. వారి అహంకార విలాస,విచ్చలవిడి శృంగార జీవితాన్ని భరించాల్సి రావడం.ఎన్ని తప్పులు చేసినా..అన్నీ మరచి పోయి వారిని క్షమించడం.. సావిత్రి పాత్రలో మనకు దర్శనం ఇస్తే..

పెద్ద చదువులు చదువుకుని.. ఇచ్చిన మనసు బయట పెట్టుకోలేక తండ్రి కుదిర్చిన మనువాడి..అతని నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఇంకొక స్త్రీజీవితాన్ని సరిదిద్దే ప్రయత్నంలో.. పురుషుడి మోసాన్ని నిలబెట్టి కడిగి పారేసి ఆ స్త్రీకి న్యాయం చేకూరుస్తుంది... ఆ పాత్రలో నటి  సుజాతని తప్ప మరొకరిని ఊహించలేము.

ఆనంద్ (దేవదాస్ కనకాల) ని నిలదీసే టప్పటి డైలాగ్స్ నాకు యెంత బాగా నచ్చాయో!

మూడు మూరల పసుపుతాడుతో..  ఒక పసుపు కొమ్ముతో..ఒక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఆమెని తల్లిని  చేసి మరలా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుని ..ఎంతోమంది జీవితాలతోనో ఆడుకోవాలనుకునే నిన్ను షూట్ చేసి పారేసినా పాపం లేదంటుంది. చాలా పదునైన సంభాషణలు.

సంభాషణ ల రచయిత ఎవరో గుర్తు లేదు కానీ ..ముప్పయ్యి ఏళ్ళ క్రితం చూసిన చిత్రం ఇంకా  గుర్తు ఉండి పోయిందంటే  ..కథా కథనం యెంత గొప్పవో కదా! ఆ చిత్రంలో పాటలన్నీ ఎంతో..బాగుంటాయి. రమాప్రభ,చలం ల హాస్యం మనసార నవ్విస్తాయి.  కే.వి.మహదేవన్ సంగీతంలో పాటలు ఒక దానికి మించి మరొకటి..
అద్వితీయమైన సుజాత నటన మన మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది.

నాలో స్త్రీవాదం పట్ల ఉన్న భావాలు బలంగా నాటించిన చిత్రం అది.ఎందుకంటే..అలాటి కథలు సావిత్రి భర్త లాటి పురుషులు కుడి ఎడమగా అలాటి ధోరణులు   మనం చూస్తూనే ఉంటాం కాబట్టి.  భర్తలని ప్రశ్నించలేని అసహాయతలో ఇంట్లో మగ్గిపోయిన ఆడవారి జీవితాలకి తార్కాణం సావిత్రి పాత్ర.. మేడిపండు లాటి వివాహ వ్యవస్థలో మగ్గిపోయిన ఆడవారి కథ కూడా.

విధి వంచించినా ఓ..సహ్రుదయుడి సానుభూతి లభించి అది ప్రేమగా మారి సరిక్రొత్త జీవితం లభించిన పద్మ  జీవితం..  ఇలా ఇన్ని కోణాలు ఉన్న చిత్రం అది.

మళ్ళీ ఒకసారి చూసి చిత్రం గురించి వ్రాయాలనుకున్నాను. కానీ చూడటం కుదరక.. గుర్తు తెచ్చుకుని ఇది వ్రాస్తున్నాను.


14, ఏప్రిల్ 2012, శనివారం

ఎవరున్నారని..

ఎవరున్నారని..


అన్యమనస్కంగానే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న శ్రావ్య కి మనసంతా పాప చుట్టూనే తిరుగుతుంది.


జ్వరం తగ్గింది లేదో, రెండవ మోతాదు  సిరఫ్ యిచ్చారో లేదో! కొంచెమైనా  పాలు త్రాగిందో లేదో, తప్పని  సరిగా హాజరు కావాల్సిన  పని  రోజులు. సెలవు పెట్టడానికి వీలు లేని  సంవత్సరాంతపు లెక్కలు.


చేస్తున్నకొద్దీ పని  తవ్వుకుని వస్తుంది. ప్రక్కవాళ్ళు చేసే పనిని  కూడా నైపుణ్యం అని కితాబు విసిరి అరగ రుద్ది చేయించే  మేనేజర్.


మాములుగా అయితే అభ్యంతరం చెప్పేది కాదేమో, ఇప్పుడు పసిగుడ్డు అలా జ్వరంతో పడివుంటే చూసుకునే వీలు లేక మనసు బాధగా మూలుగుతుంది. పేగు పాశం మెలిపెడుతుంది.  వాసు కి కాల్ చేసి ఒకసారి పాపని చూసి రమ్మని చెపితే! మనసులో అనుకుంది.


ఊహు ప్రయోజనం లేదు అనుకుంటూనే..మళ్ళీ మొబైల్ చేతిలోకి తీసుకుని నెంబర్ డయల్ చేసి కాల్ బటన్ నొక్కబోయి ఆగిపోయింది.


పిచ్చి మొహం! నిన్న నువ్వు కాల్ చేసి చెపితే మాత్రం అతను  యే౦ పట్టించుకున్నాడు గనుక? ఈ రోజు మళ్ళీ చెప్పాలనుకున్నావ్..అని  మనసు చీవాట్లువేసింది. ఉష్..అని నిట్టూర్చి ..క్రెష్ కి కాల్ చేసింది..


"పాపకి యెలా ఉంది" అడిగింది


క్రెష్  నిర్వాహకురాలు సుధ స్నేహశీలి. తన ఆదుర్ధాని అర్థం చేసుకుని "పాపకి  మీరు చెప్పినట్లు  కరెక్ట్ టైం కి మందు యిచ్చాను. జ్వరం తగ్గింది. నిద్రపోతుంది. మీకేం కంగారు వద్దు. జాగ్రత్తగా చూసుకుంటాను. మాములుగా సాయంత్రం వచ్చి తీసుకుని వెళ్ళండి” అంది.


కాస్త మనసు శాంతించింది. లంచ్ టైములో కొలీగ్,  స్నేహితురాలు లత అడిగింది "పాపకి యెలా వుంది? ఇంట్లోనే వుంచి వచ్చావా? "అని.


“లేదు,  క్రెష్ లోనే వదిలివచ్చాను.జ్వరం తగ్గింది పర్వాలేదు" అని చెప్పింది.


“మీ అమ్మ గారికి అనారోగ్య సమస్య లేకుంటే ఆవిడే చూసుకునేవారు. ఆవిడ అనారోగ్యం మీకు పెద్ద యిబ్బంది తెచ్చిపెట్టింది”


ఇబ్బంది యేముంటుంది. పిల్లలని తల్లిదండ్రులేకదా చూసుకోవాలి. పాపం అమ్మ మాత్రం యెవరి పిల్లల్నని చూస్తుంది. అన్నయ్య పిల్లలిద్దరిని నాలుగేళ్ళు వచ్చేదాకా పెంచిచ్చి అలసి పోయింది.అయినా  పిల్లలని పెంచే అలవాటు పోయిన దశలో పిల్లని పెంచడం యెంత కష్టం? ఏదో కాసేపు యెత్తుకుని ముద్దు చేసి లాలించడానికినూ అచ్చంగా అమ్మలా పెంచడానికీనూ  యెంత తేడా!? పాల బాటిల్స్ కడగడం వాళ్లకి యే మాత్రం బాగోకున్నా హాస్పిటల్ కి తిప్పడం రాత్రుళ్ళు మెలుకువగా వుండి చూసుకోవడం యెంత కష్టం. వాళ్ళ బాధని మనం అర్ధం చేసుకోవాలి. మన వుద్యోగాలు,మన సంపాదనలు, మన సరదాల కోసం వాళ్ళని అరగదీస్తున్నాం. 


కోడలు వుద్యోగం చేస్తుందని ఆమెకి సాయపడాలని ఆరు సంవత్సరాలు నడుం విరిగేలా చాకిరి చేసి యిద్దరి పిల్లలని పెంచి యిచ్చింది. అయినా కోడలికి యింత కృతజ్ఞత లేదు.  ఈ మధ్య మంచి ట్రీట్మెంట్ కోసమని హైదరాబాద్ వెళితే.. ఒక వారం రోజుల లోపలే  తను  బండెడు చాకిరి చేయలేకపోతున్నానని పెద్ద గొడవ  చేసిందట.అమ్మ-నాన్న

 వింటూన్నారనే జ్ఞానం కూడా లేకుండా అన్నయ్యని సాధించడం చూసి వాళ్ళే  అక్కడ వుండలేక వచ్చేసారు.


అవసరం వున్న నీకు సాయంగా వుండలేకపోయాను. పరాయి బిడ్డకి చాకిరి చేసి చేసి అలసిపోయాను   పనివాళ్ళకి వున్నపాటి   విలువ కూడా సంపాదించుకోలేకపోయాను అని అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే  వింటున్నప్పుడు చాలా బాధగా వుంటుంది.


సర్ది చెపుతూ నువ్వే వదినని అర్ధం చేసుకోలేదేమో, అయినా వదిన పరాయి బిడ్డని అంటావెందుకు?   అయినా నువ్వు నీ  కొడుకు బిడ్డలనే కదా పెంచి పెద్ద చేసావు. ఎందుకమ్మా అలా అనుకుంటావ్ అని సర్ది చెపుతుంటాను అని చెప్పుకొచ్చింది.


మన ఆడవాళ్ళలో కూడా కొంత మందిలో యెంత చదువుకుని వుద్యోగాలు చేస్తున్నా సంస్కారం, కృతజ్ఞత వుండదు. మీ అమ్మగారి లాంటి అత్త గారిని కళ్ళకద్దుకుని చూసుకోవాలి. మరి మీ  వదిన తీరు యేమిటో! అంది లత.


నేనయినా అమ్మని తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ యిప్పించాలని మనసులో వున్నా ఆచరించి చూపలేను. అసలు అమ్మ యిక్కడికి రాదు కూడా. మా అత్త గారు నా డెలివరి టైములో చేసిన గొడవ నేను మర్చిపోలేదు.  అమ్మని నాన్నని వూరికే యిక్కడ కూర్చుని తిని పోవడానికి వచ్చినట్లు యెన్ని మాటలు అన్నారో, కాన్పుకి పుట్టింటికి వెళ్ళక వారిని యెన్ని మాటలు అనిపించానో !


అమ్మ కూడా నాకు సాయంగా ఉండాలని యెంతగా అనుకుందో, నడుం నొప్పి బాధిస్తున్నా నాకు,పాపకి సేవలు చేయాలని యెంత ఆత్రుత పడిందో?మా అత్తగారి మాటలకు  గాయపడి నేనే వాళ్ళని పంపించేసాను. వాళ్ళు వెళ్ళిన రెండు రోజులకే అత్తగారు  వెళ్ళిపోయింది. నెలరోజుల పసి గుడ్డుతో యెంత అవస్థ పడ్డానో వాసుకి అంతా వినోదంగా వుంటుంది.


ఇంటి లోన్ తీసుకుని వున్నాను కాబట్టి ఉద్యోగం మానేయలేను. పైగా "వాసు” సేలరీ కూడా బాగా కట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో జాబ్ మానేయలేను.


వాసుకి స్నేహితులు తప్ప యెవరూ, యేమీ  పట్టవు. స్నేహితులు అతని చేత ష్యూరిటీ సంతకాలు యిప్పించుకుని నల్లపూసై పోయారు. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ వారికి వాసు జీతంలో నుండి ఆ మొత్తం కట్ అవక తప్పడం లేదు.ష్యూరిటీ పెట్టినందుకుగాను తానే ఆ లోను అమౌంట్ లు తీర్చక తప్పని పరిస్థితి.రాత్రుళ్ళు ఆలస్యంగా రావడం మామూలైపోయింది. ఈ మధ్య డ్రింక్ కూడా చేస్తున్నాడు.


అసలు ఫ్రెండ్స్ అంటే యెవరు? అవసరానికి అలా ష్యూరిటీ సంతకాలు పెట్టించుకుని మొహం చాటేసేవారా?  స్నేహం ముసుగులో అలా ప్రవర్తించే వాళ్ళు నిజమైన స్నేహితులేనా? అసలు మనుషులపై నమ్మకమే పోతుంది. ఎవరిని నమ్మాలో యెవరిని నమ్మకూదదో అర్ధం కావడం లేదు. 


ఏదైనా ప్రశ్నిస్తే ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాను తప్పేముంది అంటాడు. ఆ ఫ్రెండ్స్ మూలంగానే కదా చాలా యిబ్బంది పడుతున్నాం అంటే  నాకు ఫ్రెండ్స్ ముఖ్యం అంటాడు.


వాదనకి కాకపోయినా వాస్తవం తెలుసుకుంటాడని "మరి నన్నెందుకు చేసుకున్నావ్.."అని అడగాల్సి వస్తుంది.


ఓహో.. యిప్పుడు నన్ను నువ్వే కదా పోషించేది, అందుకే నీకు లోకువైపోయాను అంటాడు.అలిగి అన్నం తినడు. రెండు రోజులు బ్రతిమాలించుకుని అలా అడగడం నా తప్పని చెంపలు వేసుకుని సారీ చెపితే గాని శాంతించడు. తప్పు కాకపోయినా సారీ చెప్పడం, కుటుంబ బాధ్యత మోయడం, పాపను చూసుకోవడం వుద్యోగం చేయడం అన్నీ చేసుకుంటూనే వున్నాను. అసలు మాది ప్రేమ వివాహమేనా అన్న అనుమానం వస్తుంది.  అమ్మ నాన్నని  వొప్పించి యెంత ఇష్టపడి చేసుకున్నాం.  కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా  వరుసగా తన పరిస్థితిని బాధగా చెప్పింది.


మళ్ళీ స్నేహితురాలి భుజంపై చేయి వేసి ఓదార్చుతూ పక్కనే వచ్చి కూర్చుంది లత.


“అసలు నేనే పొరబాటు చేసినట్లు ఉన్నాను . సొంత ఇల్లు అమరుతుందని ఆశతో వుద్యోగం చేస్తానని సంబరపడ్డాను కానీ ఆ ఇల్లు  మా మధ్య వైరుధ్యాలు పెంచుతుందని అనుకోలేదు. నేను అప్లై చేయడం వెంటనే  జాబ్ రావడం అదృష్టం అంటారు. అలాగే అమ్మ వాళ్ళు యిచ్చిన డబ్బుతో యిల్లు కొనడం,దానికి పూర్తి డబ్బు సమకూరకపోతే లోన్ తీసుకోవడం నా జాబు ష్యూరిటి పై  లోన్ ఇవ్వడం వలన నా పేరుతొ యిల్లు రిజిస్టరై వుండటం సరదాకి యిల్లు నాది కదా అనడం కూడా నచ్చలేదు.  వాసుకి ఆ మాటే బాగా నాటుకుపోయి  నూన్యతా భావం వచ్చేసింది.  నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను.  కన్నీళ్లు కారుతుండగా అంది.


ఓదార్పుగా స్నేహితురాలి భుజంపై చేయి వేసింది


నిన్నటికి నిన్న క్రెష్ నుండి పాపకి బాగా జ్వరంగా వుందని కాల్ చేసారు. తను ఖాళీగానే వున్నాడు. నేను వెంటనే కాల్ చేసి పాపని యింటికి తీసుకుని వెళ్ళు వాసు. నేను హాస్పిటల్ లో  అపాయింట్ మెంట్ తీసుకుని యింటికి వస్తాను అని చెపితే నాకు తీరికలేదు. ఫ్రెండ్స్ తో వేరే పని మీద బయటకి వెళ్ళాలి, అవన్నీ నువ్వే చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేసాడు.  వర్కింగ్ అవర్స్ అయ్యేవరకు పాపకి యెలా వుందో  అని  నేను యెంత టెన్షన్ అనుభవించానో,ఇలాటి నిర్లక్ష్యాన్ని యెలా అర్ధం చేసుకోవాలి, తండ్రిగా అతనికి యే౦ పట్టదా?


-క్రెష్ కి వెళ్లి పాపని తీసుకుని హాస్పిటల్ లో చూపించుకుని యింటికి  వెళ్లేసరికి వాసు యింట్లోనే వున్నాడు. తీరిగ్గా టీవి చూసుకుంటూ. కూరగాయలు లేవు. ఉదయం చేసిన కూరలు వేసి పెట్టానని బేగ్ వేసుకుని వుద్యోగాలు వెలగ బెట్టడం కాదు. మొగుడు కంచంలో యే౦ కావాలో కూడా చూసుకోవాలని పరుషమైన మాటలు.ప్రక్కనే వున్న  కూరగాయల మార్కెట్ కి వెళ్లి కూరలు తెచ్చే తీరిక తనకి వుండదు.నేను మాత్రం అన్ని పనులు చేయాలనుకుంటాడు. ఎందుకింత క్రూరమైన హింస? నాకు అర్ధం కావడం లేదు.


“ఉదయమే.. జ్వరంతో వున్న  పాపనేసుకుని వెళ్లి కూరగాయలు తెచ్చి వంట చేసి అతనకి లంచ్ బాక్స్ సర్ది టిఫిన్ రెడీ చేసి టేబుల్ పై పెట్టి..   పాపతో సహా బయటపడి మనసు పీకుతున్నా జ్వరంతో వున్న బిడ్డని  క్రెష్ లో వదిలేసి వచ్చాను. ఈ వుద్యోగం అవసరమా అనిపిస్తుంది” మనసులో బాధ౦తా చెప్పుకుంది.


" ఊరుకో.. యిలా యెన్నైనా సర్దుకుపోవాలి ఆకాశంలో సగం మనం " చెప్పింది నవ్వుతూ.


"అవును కదా"అని నవ్వుతూ శ్రావ్య.


లంచ్ బాక్స్ తీసి అలా యేదో కెలికి తిన్నాననిపించింది. సాయంత్రం వరకు ఆలోచన బరువుతో అలాగే పని చేసుకుని బయటపడి క్రెష్ కి వెళ్ళింది.


క్రెష్ సుధ "మేడం పాపని వాళ్ళ నాన్నగారు  వచ్చి  మద్యాహ్నమే తీసుకుని వెళ్ళారు " అని చెప్పింది.కొంచెం ఆశ్చర్యం,సంతోషంతో యింటికి  దారితీసింది. బస్ లో సీటు దొరికింది. విండో సీట్ లో కూర్చుని కళ్లు మూసుకుంది. ఆమె కనుల ముందు మనోహర దృశ్యం.


***********

ఇంట్లోకి ఫ్రవేశిస్తూనే… 

వాసు పాపని  ఆడిస్తూ కనపడ్డాడు. ఆమె ఆడగక ముందే అతనే చెప్పాడు. “పాపకి జ్వరం తగ్గిందిలే, కంగారు పడకు. పాపకి స్నానం చేయించాను.నువ్వు ఫ్రెష్ అయి రా” అన్నాడు.


పాపని అతని చేతుల్లో నుంచి తీసుకుంది.పాప మొహం జ్వరం తగ్గి తేటగా వుంది. స్నానం చేయించి వుండటం వల్ల   పువ్వులాగా ప్రెష్ గా వుంది. కొంచెంసేపు అలా చూసి పాపని అతనికి యిచ్చి ఆమె ప్రెష్ అయి వచ్చింది. 


“శ్రావ్యా!  నేను కాఫీ కలిపాను,త్రాగి చూడు” చెప్పాడు. మళ్ళీ ఆశ్చర్యం .


“ఆ రెండు కళ్ళల్లో యిన్ని ఆశ్చర్యాలు చూపకు.  నువ్వు నిన్న యెంత నొచ్చుకున్నావో అర్ధం అవుతూనే వుంది.నేను రాత్ర౦తా   ఆలోచించాను. నిన్ను బాధపెడుతున్నాని అర్థమవుతుంది. నేను

మారాలనుకుంటున్నాను”.

 

మౌనంగా వింటుంది శ్రావ్య


“ఉదయాన్నే లేచి కూరగాయలు అవి తీసుకొచ్చి నీకు హెల్ప్ చేద్దామనుకున్నాను. అలవాటు లేక మెలుకువ రాలేదు నేను  నిద్ర లేచేటప్పటికే  నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోయావు. పాపకి జ్వరం తగ్గిందో లేదో ఆలోచించాను నాకు సిగ్గుగా అనిపించింది” అపాలజిక్ గా అన్నాడు .


అతని మాటల్లో నిజాయితీకి చలించిపోయింది శ్రావ్య, 


మళ్ళీ వాసునే మాట్లాడసాగాడు.


నేను నిన్ను సాధించాలని, దూరం పెట్టాలని యేదో వొక మాటలు అంటున్నాననుకున్నాను కానీ నువ్వు  చేసే శ్రమ, మన యింటి కోసం నువ్వు పడే తాపత్రయం అన్నీ అర్ధమయ్యే కొద్ది నీ పై జాలి కల్గింది. పెళ్ళికి ముందు మన నాలుగేళ్ల ప్రేమలో యెప్పుడూ కస్సుమనే నీలో యింత ఓర్పు యెలా వచ్చిందో! ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా.  నాకు ఫ్రెండ్స్ మాత్రమే  కాదు నువ్వు,పాప కూడా ముఖ్యమే !అయినా మనకిప్పుడు  యెవరున్నారు, అదే యిక్కడ యెవరున్నారని?


“ఎవరున్నారని నాకైనా.. యెవరున్నారు నీకైనా యెవరున్నారని  నీలా నాకైనా” నవ్వుతూ పాట అందుకున్నాడు.  ఆమెని రారమ్మని చేయి చాచాడు. 


శ్రావ్య అతని బాహువుల మధ్య  యింకో పాపలా సంతోషంగా వొదిగిపోయింది. 


*********

కండక్టర్ గట్టిగా హెచ్చరించాడు ఫలానా స్టేజ్ లో దిగివాళ్లు ముందుకు రావాలని…

ఉలికిపడి లేచింది. ఇంట్లోకి వెళ్లకుండానే కారిడార్ లో పాపను ఎత్తుకుని తల్లి కనబడింది. ఆశ్చర్యపడలేదు.


నువ్వు ఎప్పుడొచ్చావమ్మా అంది.


“మధ్యాహ్నం వచ్చానమ్మా…రాగానే అల్లుడికి ఫోన్ చేసి చెప్పాను. పాపను క్రెష్ నుండి తీసుకొచ్చేయమని.

నా బంగారుతల్లిని చూసుకోవడానికి ఈ అమ్మమ్మ లేదూ”


శ్రావ్య ఊహలు తల్లకిందులయ్యాయి. కలలెన్నటికీ నిజమవవేమో! వాస్తవం ముల్లై గుచ్చుతుంది. భారంగా నిట్టూర్చింది.