30, జనవరి 2012, సోమవారం

ప్రియమైన పుత్రులున్ గారికి

ప్రియమైన పుత్రులున్ గారికి మీ మాతృ శ్రీ  అనేకానేక అనేకమైన హృదయపూర్వకమైన దీవెనలతో  వ్రాయు  లేఖార్దములు. మీరు అక్కడ క్షేమముగా వున్నారని తలెంచెదను.

మీరు మాతో దూరవాణి ద్వారా కానీ, చిత్ర వాణి ద్వారా కానీ మాటలాడి పది దినములు అయినది. మీ క్షేమ సమాచారముల గురించి.. మేము మిక్కిలి దిగులు చెందుతుంటిమి. ఆ దిగులును మరచినది యెట్లనగా..నేను వొక తీవ్రమైన సమస్యని యెదుర్కొనుచుంటిని. అందువల్ల నేను మీతో మాటలాడుటలో అశ్రద్దగా వున్నాను. మీరు మన మాతృ భాషని పూర్తిగా మరచినట్లు తోచుచున్నది. అందువలన మేము మీకు గ్రాంధికంలో ఉత్తరం వ్రాయటమైనది.అటులైనను..మీరు ఈ లేఖ చదువుటకు తగిన  శ్రద్ద వహించెదరు..అని నా నమ్మిక. 

మీరు నాతో .. మాట్లాడినప్పుడల్లా యేమి చేస్తుంటిరి  ..మాతా శ్రీ  అని పదే పదే అడుగుతూ వుందురు  కదా! పని   లేకపోయినా యెడల ఈగలు,దోమలు తోలుకొనుడు..అని వాడుక మాట యున్నది కదా..అటుల గాకున్ననూ.. నేను పని వున్న నూ ..కూడా మశ్చరములను వేటాడుటయే  ముఖ్యమైన పనిగా వున్నది. ఈ ఋతువు నందు మన వసతి గృహము దరిదాపుల్లో..మశ్చరములు బహుళంగా వున్నవి. మన వసతి గృహం ముందునూ ప్రక్కనూ.. బహుళ అంతస్తుల భవనములు నిర్మింపబడి సముదాయ గృహములగా మారి యున్నవి.  మన గ్రామ పరిపాలనా అధికారులు నిబంధనలకు విరుద్దంగా.. అలా కట్టడములకై  అనుమతిని యిచ్చితిరి కానీ .. జనులు వాడిన నీటిని సక్రమముగా వెడులు క్రియలు చేపట్టక నిర్లక్ష్యం వహించిరి. అందువల్ల.. మశ్చరములు  బహుగా వర్ధిల్లి.. జనుల్ని కుట్టి విపరీతముగా బాధించు చున్నవి. రాజ్యంలో.. ప్రభువులకు   చిత్త శుద్ధి లోపించినట్లే.. అధికారులకునూ  చిత్త శుద్ధి-నీతినియమములు నశించి.. ప్రజలను పెక్కు ఇక్కట్లుకి గురిచేస్తుంటే..పీల్చి పిప్పి అవుతున్న ప్రజలకు. మురుగు దుర్గంధం మరియు  మశ్చరముల కాటు తప్పడం లేదు.

విదేశములలో..  మిడతల దండు ఆకస్మికంగా దాడి చేసి పంటలను నాశనం చేసినట్లు..వార్తా పత్రికలో చదివి యుంటిని కానీ..ఈ మశ్చరముల దండు నాకు కడు  విచిత్రముగా తోచు చున్నది.మశ్చరముల కాటుకు రక్షణగా వుండు నవనీతం వంటి పైపూత మందు వ్రాసుకుని నా శరీరం రంగు మారినది కానీ.. వాటి యొక్క కాటు నుండి మమ్ము మేము రక్షింప మార్గం తోచడం లేదు. పిచికారి మందులు, చక్రముల గాఢమైన పొగలు, తెరలు,వలలు..అన్నియు నిష్ప్రయోజనం అయిపోతున్నవి. 

అదియును గాక  మశ్చరముల నివారణకి యే క్రియలు చేపట్టిననూ..మాకు..శరీర తత్వమునకు సరిపడక నాశికా రంద్రముల నుండి..ధారాపాతమైన స్రావాలు వెలువడుతున్నవి. లేదా.. నాశిక దిబ్బడలు,నయనములు యెర్ర బారుట, అగ్ని మంటలు వచ్చి వైద్యశాలల చుట్టునూ..ప్రదక్షిణములు చేయుట పరిపాటి  అయినది. ఇక  ఉపేక్ష తగదు అని ద్వారములకి,గవాక్షములకి వల చట్రములని బిగింప జేసితిమి. అదియును మితిమీరిన వ్యయం అయి ఈ సంవత్సరము.. పుస్తకముల పండుగకి వెడల వీలు కల్గక  యెన్నటి నుండో.. ఖరీదు   చేయవలెనని అనుకున్న  ఆసక్తి కల్గిన పుస్తములకి గండి కొట్టినవి. నాకు  తీవ్ర విచారం కల్గినది.వల చట్రములు బిగించిననూ కూడా  అదేమీ చిత్రమో..మశ్చరముల.. బెడద వదలక మరింత  యెక్కువ అయినది. 

అప్పుడు..ఒకే ఒక సులభతరమైన బాణం ని ప్రయోగింప జొచ్చితిని. అది..రాముని చేతియందు రావణుని వధించు బాణం వలె..,భీమసేనుడి చేతిలోని.. గద వలే, ఇంకన్నూ చెప్పాలంటే.. సామ్రాట్ అశోకుడి   చేతిలోని వీర   కార్తీకేయ ఖడ్గం   గాను నేను అమితంగా వూహించుకుని.. మశ్చరముల పని యిక ఖాళీ అని మిగుల సంతోషించితిని. ఇంతకూ ఆ బాణం యేమనగా అది విద్యుత్ దండం. ఆ దండముని పట్టుకుని.. అసుర సంధ్య వేళ మొదలిడి..నిశాంత సమయం వరకునూ.. మశ్చరముల వేట కొనసాగించుతూనే వుండితిని. "వంద ఈగలు అయినను తప్పించుకొన వచ్చును గానీ  ఒక్క మశ్చరము కూడా తప్పించుకొన వీలు లేదు అనే నినాదం పూని.. కంటి మీద కునుకు లేకుండా.. వేటాడుతుంటిని. ఆ దశలో.. మేము బాల్యదశలో.. ఆడిన పసుపురంగు బంతి కొట్టే  టెన్నిస్   ఆటను ఆడుతున్నట్లు బంతి ని ఒడుపుగా పట్టుకుని బలంగా కొట్టి ప్రత్యర్దులని  మట్టి కరిపించిన రోజులు మదిలో మెదిలినవి. కానీ ఇక్కడ  ఆట   యేక పక్షమున  తలపించినది. అప్పుడైననూ నేను అపజయం యెరుగను.కానీ మశ్చరముల  సమయ స్ఫూర్తి, తెలివితేటల యందు నేను వోడూతూనే వుంటిని.  అది నా మొదటి రోజు అనుభవము. 

ఇక రెండవ రోజు.. రంద్రాన్వేషణ మొదలెట్టి..  మశ్చరములు వచ్చు మార్గమును సూక్ష్మంగా పరిశీలించి కడు  జాగ్రత్త వహించితిని. అయిననూ కూసింత కూడా..ప్రయోజనం కానరాలేదు. నా శరీరం నందలి రుధిరాన్ని వాటికి విందు భోజనంగా..అందించక తప్పడం లేదు. గానం వినబడకుండా వుండని   మన గృహం నందు.. గానము లేదు వీనుల విందు సంగీతం లేదు.అన్నపానీయముల పనియును లేదు. కర్ణ ద్వయం పేలినట్లు  మశ్చరముల సంగీతం వినుటయే సరి. మాకున్  కక్ష   స్వభావం  మేల్కొని యెల్లప్పుడునూ మీ సంగీతమే..మేము ఆస్వాదించట యేనా..నా గాన కళా ప్రావీణ్యముని వినుడని..  అర్ధ రాత్రుల యందు మేల్కొని  వానికి నా గానము వినిపించితిని. అవి అందుకున్ కూడా  భయపడక.. జారుకోక.. మన యింటి యందె నిశ్చలంగా స్థావరం యేర్పరచుకుని వున్నవి. ఇది..నా రెండో.. అనుభవ దినం.

ఇక మూడో రోజు..  నా బాణం (అదే నా విద్యుత్ దండం)  కార్యరూపం దాల్చనని మోరాయించినది. నేను వెంటనే నా కార్తీకేయ కరవాలమునకై పరుగులు తీసితిని. ఆ దుష్ట అశోకుడి,ఆ క్రూర అశోకుడి,ఆ నీచ   అశోకుడి..  కార్తీకేయేం యెక్కడ యెక్కడ అని వెతికితిని. వేయి క్షాత్రవులని చంపి కానీ వొరలో యిమడని కార్తీకేయం   అంత త్వరగా దొరికినది కాబట్టి సంతసమే! (పనిలో పని గా ఇటులు  మీ పితురులని  తిట్టామని  కోపగించుకోకండి అశోక తనయా..మేము యెపుడైనను అటుల తిట్టు సాహసించెదమా?  చెప్పండి.!? మీ తండ్రి గారికి మాతృ శ్రీ మిమ్ము తిట్టితిరి అని సరదాకి అయిన, హాస్యంగా అయినను ఫిర్యాదు చేయకండి.)  మేము వెంటనే సరి క్రొత్త దండం ని ఖరీదు చేసి..ఆఘమేఘముల మీద  గృహమునకి వచ్చితిమి. పాపం మన పని వారల .. కనుల వెంట ఆనందభాష్పములు. మా యజమానికి యెంత   ద్రయార్ద్ర హృదయము.. మమ్ము మశ్చరముల నుండి కాపాడుటకు యెన్ని అవస్థలు పడుతున్నదని. నాకు వొడలెల్లన్ గర్వం వుప్పొంగినది. పాపము శమించుకాక! వేలాది  మశ్చరములను జంపి.. మేము.. తప్పిదం చేయుచుంటిమి అని ఆత్మ విమర్శ జేసుకుంటిని కానీ మశ్చరముల అమిత కాటు వల్ల అనారోగ్యములు దరి జేరి.. వొళ్ళు యిల్లు గుల్ల అవుతుంటే.. ఇక వుపేక్షించ జాలను  అని కఠోరనిర్ణయం గైకొని..దండ యాత్ర సాగించితి కానీ..  అది మశ్చ రముల జైత్రయాత్ర అని మరునాటికి గానీ తెలియ రాలేదు. 

మరల మర వచ్చు పోవు వసంతములా ..మశ్చరముల దండు..దినదినంబు వృద్ది అగుచున్నది.  జంపుట వల్ల వోపిక నశించుచున్నది. కానీ..  శాశ్వత పరిష్కారం కనబడలేదు. గ్రామ పరిపాలనా విభాగామునకి వెళ్ళి.. ఫిర్యాదుని మరియొకమారు సమర్పించితిని. వారు వచ్చి..శ్వేతవర్ణ పిండి చల్లితిరి కాని అందు సారంబు లేక యధావిధిగా మశ్చరముల బాధ తొలగలేదు. నేను..దీర్ఘముగా యోచన చేసితిని. బాల్యంలో జదివినప్పుడు సరిగా గ్రహించని విషయం తెలుసుకొనుటకు మశ్చరముల జీవిత చక్రముని నిశితంగా పరిశీలించితిని కూడా. ఏవేవో మందులని పిచికారి చేయిన్చితిని. ఆ రోజు మాత్రం కాస్తంత ఉపశాంతి దక్కినది.

మశ్చరముల వేటలో.. మా వుదయపు వ్యాహాళికి స్వస్తి చెప్పితిని. ఎందుకనగా.. మశ్చరములను వేటాడుటయే  ..నాకు అమితమైన వ్యాయామం అయి.. నా చిరు బొజ్జ తగ్గి.. నా బాహు దండముల కొవ్వు కరిగి.. కాస్త నాజూకు  అయితిని కూడా. ఇరుగు పొరుగు వారు.. పూర్తి దినము అంతయూ.. ఆ అంతర్జాలం,రంగుల పెట్టేయందే.. కాలక్షేపం చేయుచుంటిరి. కాస్త వెలుపలకి రండు అని .. ఎక్కెసపు మాటలు వినలేకున్నాను. కానీ మేము చేయు పని యేమంటే.. యెలాగు మశ్చరములను  యెదుర్కొనుట   అన్నదే యోచన అని వారికిన్ చెప్పలేదు.  మేము..అంతర్జాలంలో తల దూర్చి   యెన్ని దినములు అయినదో..నాకు అమితమైన బెంగ గా వున్నది. అతి విలువైన మా సమయములను, నిదురను,అన్న పానీయములని తృజించి సమయము వెచ్చించి ననూ కానీ.. మశ్చరముల బెడద తప్పడం లేదు. 

ఇక మేము విసుగు చెంది.. రాత్రుల సమయం నందు.. నడి మంచం పైననే కూర్చుని విద్యుత్ దండం ప్రక్కన యుంచుకుని మౌనంగా  వీక్షిస్తూ వుంటిమి. మశ్చరముల వద్దకు మేము వెళ్ళకుండా.. అవియే మా వద్దకు వచ్చుట చూసి.. అయ్యో..అనవసరంగా   యిన్ని దినముల  నుండి  జాంటీ రోడ్స్ వలే మైదానం అంతా తిరిగి బంతి పట్టుకొనునట్లు మశ్చరముల వెంటబడి శక్తి కోల్పోయి అలసితినే! అమితంగా డస్సితినే  ..అని తెగ విచారబడితిని. ఎలా అయితేనేమి.. మశ్చరముల దండుని కొంత కట్టడి చేయగల్గితిని. మీ తండ్రి గారు మీ స్వగ్రామములో ఉంటిరి గాన వారు ఈ మశ్చరముల కాటుని తప్పించుకొంటిరి .లేకున్నా వారికి సేవలని జేసి.. వీటి బెదడకి.. నేను  మరింత అలసి పోయి వుందునేమో!  మేము మశ్చరముల నివారణకి మేము యేమి  చేయుచుంటిమో,యెంత పరిశీలన చేయు చుందునో.. వ్రాయుట మొదలిడిన  అదినొక బ్రహుత్ గ్రంధం వ్రాయవచ్చును. ఆ గ్రంధమును ఏ విశ్వ విద్యాలయమునకైనా సమర్పించిన యెడల నాకు పరిశోధనా పత్రం తేలికగా లభించి..నాకున్న  విద్యా విషయ సంబంధమైన కోరిక కూడా (పి.హెచ్.డి)బహు తేలికగా నెరవేరును అని పించుచున్నది.

మీరు నివశించు దేశమున అభివృద్ధి పథం గా వున్నది కాన అక్కడి నివారణ  వుపాయాలని మాకున్ తెలియ పరచి.. సహాయం చేయవలే అని మిమ్మల్ని అడుగ వలెనని అనుకుంటిని.  ఇంతలో మీ సహొదరి గారు.. మాతో మాటలాడినారు. మా రాజ్యమున మశ్చరముల బెడద లేదు.. అని మాతృదేశం లోని మన వెతలకి చింతించినది.  పరిపాలని అసహ్యిన్చుకున్నది. అవినీతి లాగును,దేశ సంతతి లాగునూ.. మశ్చరముల వృద్ది అని అవహేళనం  జేసినది. మాకు బాధ కలిగిననూ..మాటలాడలేదు. ప్రొద్దు గుంకినది. మరల మా వేట ప్రారంభం అవబోతున్నది. ఒక్క విషయం చెప్పి లేఖ ముగించెదను.

మీరు రాత్రిబవళ్ళు  కష్ట పడినను..మేమున్ కష్ట పడినను..మన యొక్క స్వగృహ నిర్మాణం కల నెరవేరుట సుదూరముగా తోచుచున్నది. అందుమూలంగా మేము మీకు సూచించునది యేమన గా..మీ తండ్రి గారిన్ యెలాగు అయినను వొప్పించి కొన్ని గజముల భూమిని విక్రయించి ఆ ధనం వుపయోగించి..  ఊరికి చివరగా..మురుగు, మశ్చరముల,రణ గొణ ధ్వనుల  బాధ లేని  అధునాతన రీతిలో పూర్తి శీతలీకరణ గృహం మాదిరి  వలె  పూర్తి " నవీకరణ  రక్షిత వల "నిర్మిత మైన గృహముని అధునాతనంగా  నిర్మించుకుని.. ప్రశాంతముగా వుండుటకు ఆస్కారముని కలిగించు కొనవలయని..ఆ విధముగా యోచన చేయమని తెలియ పరుస్తూ.. మన  స్వంత యింటి కలని కోరికని తీర్చి సంతోష పరచవలసినదిగా.. చెపుతూ..     

మీరు యెల్లప్పుడు క్షేమంగా వుండుటయే.. మా  మదిలోని కోరిక గా యెరింగి.. జాగ్రత్తగా మసలుకొనుచూ.. వెను వెంటనే..ఈ లేఖకి.. సమాధానమును  గ్రాంధికం గాకున్ననూ  మాతృభాషలో అయినను వ్రాసి..మమ్మల్ని ఆనందింప జేయుదురని   ఆకాంక్షిస్తూ..
                                                  
                                                          ప్రేమ పూర్వకమైన, వాత్శల్య భరితమైన  దీవెనలతో.. మీ మాతృ శ్రీ గారు.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

దోమల బాధ కూడా బాగా చెప్పేరు. పాపం పుత్ర రత్నం మాత్రం ఏమి చేయగలడు, మన బలిసిన దోమలను?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ ప్రియమైన పుత్రులున్ గారికి గ్రాంధికంలో
మీరు రాసిన లేఖ బాగుందండీ..

priyanestam sanajai చెప్పారు...

namaskaram meru mee purtulungarikoraku unchina lekha memunu chadinaamu marachina grandhikam palu chotla sarala telugu gurthu chesinanduku dhanyavadamulu mana nagarmantayu ee macharamula badha janulanu ibbandipettuchunnavi aa vishayamu gurthuvachinapudu kadu vichaichuchu untmegani eamiyunu cheyalekuntimi. vyakhyaninchadaniki avakasam kalpinchinanduku dhnyavaadamulu.

itlu priya nestam sanjai